spot_img
Homeఆంధ్రప్రదేశ్‌YS Sunitha: ఇప్పటివరకు షర్మిల.. ఇక సునీత..జగన్ కు చుక్కలేనా!

YS Sunitha: ఇప్పటివరకు షర్మిల.. ఇక సునీత..జగన్ కు చుక్కలేనా!

YS Sunitha: జగన్ అనుకున్నంతా అయ్యింది. చెల్లెళ్లు ఇద్దరూ ఒకే వేదిక పైకి వచ్చారు. అన్నను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని వ్యూహరచన చేయడం ప్రారంభించారు. సొంత జిల్లా కడప నుంచి దెబ్బతీయాలని భావిస్తున్నారు. షర్మిల పిసిసి పగ్గాలు చేపట్టాక.. వివేక కుమార్తె సునీత కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. కడప నుంచి పోటీ చేస్తారని కూడా టాక్ నడిచింది. షర్మిల రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కడప జిల్లాలో ఉన్న షర్మిలను సునీత కలిశారు. ఇడుపులపాయలో దాదాపు రెండు గంటలపాటు చర్చించారు.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో సునీత గట్టిగానే పోరాడుతున్నారు. తన తండ్రి హత్య కేసులో నిందితులను జగన్ కాపాడుతున్నారని కూడా అనుమానం వ్యక్తం చేశారు. అటు నిందితుల నుంచి సైతం సునీత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో షర్మిల సునీతకు అండగా నిలిచారు. ఆమె న్యాయ పోరాటానికి వెన్నుదన్నుగా ఉన్నారు. ఇప్పుడు అదే షర్మిల పీసీసీ పగ్గాలు తీసుకోవడంతో ఆమెకు అండగా నిలవాలని సునీత నిర్ణయించుకున్నారు. రాజకీయంగా ఆమె వెంట నడవాలని డిసైడ్ అయ్యారు. తండ్రి హత్య కేసులో నిందితులకు గట్టి బుద్ధి చెప్పాలని భావిస్తున్నారు. అందుకు రాజకీయ రంగ ప్రవేశం చేసి షర్మిల తో ఉమ్మడిగా ఢీకొట్టాలని వ్యూహరచన చేస్తున్నారు.

పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి సీఎం జగన్, కడప పార్లమెంటు సీటు నుంచి సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి పోటీ చేయడం ఖాయంగా తేలుతోంది. అందుకే వారిద్దరికీ ఎదురెళ్ళాలని షర్మిల, సునీత నిర్ణయించుకున్నట్లు సమాచారం. కడప పార్లమెంటుకు సునీత, లేదంటే ఆమె తల్లి సౌభాగ్యమ్మ పోటీ చేయాలని షర్మిలా సూచించినట్లు తెలుస్తోంది. తాను ఇక్కడే ఉండి అన్నీ చూసుకుంటానని.. అవసరమైతే పులివెందుల అసెంబ్లీ సీటు నుంచి తాను బరిలో దిగుతానని షర్మిల తేల్చి చెప్పినట్లు తెలిసింది. ఇదే జరిగితే కడప జిల్లాలో రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉంది.

ఇప్పటికే జగన్ రాజకీయంగా దెబ్బతీయడానికి టిడిపి, జనసేన ఒక్కటయ్యాయి. ఇప్పుడు షర్మిల, సునీతలు అన్నకు ఎదురెళ్లాలని నిర్ణయించుకోవడం ద్వారా వారికి ఆయుధాలను అందించినట్లే. ఇప్పటికే మోతాదుకు మించి షర్మిల విమర్శలు చేస్తున్నారు. షర్మిల విషయంలో ఎలా ముందుకెళ్లాలో తెలియక వైసీపీ శ్రేణులు సతమతమవుతున్నాయి. సునీత ఎంట్రీ ఇచ్చివిమర్శలకు దిగితే.. తన తండ్రి హత్య విషయంలో వాస్తవాలు మాట్లాడితే.. వైసీపీకి అపార నష్టం తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పునాదులను కదిపి జగన్ తన పార్టీని నిర్మించుకున్నారు. ఇప్పుడు అదే పార్టీని వేదికగా చేసుకుని షర్మిల, సునీత వైసిపి పునాదులు పెకిలించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version