YS Sharmila: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మౌనముద్ర లో ఉన్నారు. నిన్ననే రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు జరిగాయి. తండ్రికి ఆమె నివాళులు అర్పించారు. మీడియా ముందుకు వచ్చి పొడిపొడిగానే మాట్లాడి వెళ్లిపోయారు. గత కొంతకాలంగా ఆమె సైలెంట్ గానే ఉంటున్నారు. రాజ్యసభ ఎన్నికల తర్వాత ఆమె పెద్దగా కనిపించకుండా మానేశారు. ఆ ఎన్నికల్లో షర్మిలకు ఛాన్స్ ఇస్తామని స్వయంగా రాహుల్ గాంధీ చెప్పినట్లు ప్రచారం నడిచింది. ఆ సమయంలో ఆమె ఢిల్లీ కూడా వెళ్లారు. కాంగ్రెస్ పెద్దలను కలిశారు. ఆమెకు కర్ణాటక నుంచి ఛాన్స్ ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. కానీ చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చారు. దీంతో అప్పటినుంచి ఆమె మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. పెద్దగా కనిపించడం లేదు కూడా. అయితే తండ్రి జయంతి నాడు కొద్దిమంది కుటుంబ సభ్యులతో వచ్చి నివాళులు అర్పించారు.
* సోదరుడిని విభేదించి..
రాజశేఖర్ రెడ్డి అకాల మరణం సమయంలో షర్మిల తన సోదరుడు జగన్మోహన్ రెడ్డి వెంట బలంగా నడిచారు. ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం కృషి చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం బలంగా పనిచేశారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. వ్యక్తిగతంతో పాటు రాజకీయ అంశాలపై ఆయనను విభేదించారు షర్మిల. తెలంగాణలో తన తండ్రి పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు. అక్కడ వర్క్ అవుట్ కాకపోయేసరికి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీ బాధ్యతలు తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకున్నారు జగన్. షర్మిలకు బాధ్యతలు ఇవ్వడం ద్వారా దానిని తిరిగి తీసుకోవాలని కాంగ్రెస్ భావించింది. కానీ అటువంటిదేమీ జరగలేదు. షర్మిల ద్వారా కాంగ్రెస్ బలపడిన పరిస్థితి కనిపించడం లేదు. అందుకే షర్మిల విషయంలో కాంగ్రెస్ హై కమాండ్ పునరాలోచనలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. రాజ్యసభ పదవి ఇవ్వక పోవడానికి అదే కారణంగా తెలుస్తోంది.
* ఆ కారణంతో సైతం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో ఇండియా కూటమి సాఫ్ట్ కార్నర్ తో ఉంది. ఎందుకంటే టిడిపి ఎన్ డి ఏ లో కీలక భాగస్వామిగా ఉంది. జగన్మోహన్ రెడ్డి చివరకు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో పనిచేయక తప్పదు.. ఆ విషయం షర్మిలకు కూడా తెలుసు. ఒక విధంగా కర్ణాటక నుంచి తనకు రాజ్యసభ పదవి రాకపోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణమన్న అనుమానం ఉంది. రేపు ఇండియా కూటమిలో జగన్ చేరితే తన రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది కరం అని ఆమె భావిస్తున్నారు. అందుకే మౌనముద్రలో ఉన్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజులపాటు పొలిటికల్ సైలెన్స్ పాటిస్తే మంచిది అన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో..
