Undavalli Arun Kumar: వైయస్ జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) ఎవరి మాట వినరు. ఎవరి సలహాను స్వీకరించరు. కానీ వైయస్ రాజశేఖర్ రెడ్డి అలా కాదు. మంచి విషయాలను చెబితే ఆయన కచ్చితంగా స్వీకరిస్తారు. పాటించడంతోపాటు అమలు చేస్తారు కూడా. ఇదే విషయాన్ని తాజాగా చెప్పారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. వైయస్ రాజశేఖర్ రెడ్డి తాను ఇచ్చిన సలహా పాటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయం కెవిపి రామచంద్రరావు కూడా తెలుసునని చెప్పుకొచ్చారు. తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడారు ఉండవల్లి అరుణ్ కుమార్. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి చంద్రబాబుకు క్షమాపణ చెప్పడం వెనుక తాను ఉన్నానన్న విషయాన్ని బయటపెట్టారు. రాజశేఖర్ రెడ్డిలో ఉన్న గొప్పతనాన్ని వివరించారు. తద్వారా జగన్మోహన్ రెడ్డికి అదే మైనస్ అని సంకేతాలు పంపించారు.
* లోతుగా విశ్లేషణ..
సమకాలీన రాజకీయ అంశాలపై ఎప్పటికప్పుడు విశ్లేషిస్తుంటారు ఉండవల్లి అరుణ్ కుమార్. చాలా విషయాలపై లోతుగా ఆయనకు అవగాహన ఉంది. 2023 సెప్టెంబర్లో చంద్రబాబు అరెస్ట్ సమయంలో కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్మోహన్ రెడ్డికి కీలక సూచనలు చేశారు. చంద్రబాబు అరెస్టు తప్పుడు సంకేతమని అప్పటినుండి చెబుతూ వచ్చారు. ఇప్పటికీ అదే స్టాండ్ తో మాట్లాడుతున్నారు. చంద్రబాబును అరెస్టు చేయడం వల్లే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఎదురైందని చాలా సందర్భాల్లో చెప్పారు ఉండవల్లి. జగన్మోహన్ రెడ్డి ఎవరి సలహాలు స్వీకరించే పరిస్థితి ఉండదని కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే తాజాగా మాత్రం వైయస్ రాజశేఖర్ రెడ్డి గురించి.. ఆయన గొప్పతనం గురించి వివరించే ప్రయత్నం చేశారు.
* చంద్రబాబుకు క్షమాపణలు..
2007లో ఓబులాపురం మైనింగ్ కేసు పై ఏపీ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. చంద్రబాబు నాయుడు అప్పట్లో ఆరోపణలు చేశారు. అయితే దానిని తిప్పికొట్టే క్రమంలో రాజశేఖర్ రెడ్డి కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తల్లి ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే రాజశేఖర్ రెడ్డి దూషించాలని కాదు.. విమర్శలు చేసే క్రమంలో ఆ ఫ్లోలో వచ్చింది ఆ మాట. పెను దుమారానికి దారి తీసింది. జాతీయస్థాయిలో కూడా చర్చ జరిగింది. మీడియాలో ప్రధాన అంశంగా మారిపోయింది. ఈ విషయాన్ని గుర్తించిన ఉండవల్లి అరుణ్ కుమార్ రాజశేఖర్ రెడ్డికి ఇది డ్యామేజ్ కలిగించే అంశమని.. దీనిపై క్షమాపణలు చెబితేనే మంచిది అని కెవిపి రామచంద్రరావుకు చెప్పారట ఉండవల్లి అరుణ్ కుమార్. అదేదో నేరుగా రాజశేఖర్ రెడ్డికి మీరే చెప్పొచ్చు కదా అని కెవిపి అన్నారట. వెంటనే ఉండవల్లి అరుణ్ కుమార్ రాజశేఖర్ రెడ్డి కి ఫోన్ చేసి చెప్పారట. క్షమాపణలు చెప్పాలని సూచించారట. అందుకు కాస్త అసహనానికి గురైన రాజశేఖర్ రెడ్డి ఫోన్ కట్ చేశారట. కానీ ఆ తరువాత రోజు అసెంబ్లీ ప్రారంభ సమయంలోనే చంద్రబాబుకు రాజశేఖర్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. అంతటితో ఆ వివాదం ముగిసింది అని యూట్యూబ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఉండవల్లి అరుణ్ కుమార్. అయితే జగన్మోహన్ రెడ్డి వినే రకం కాదని.. రాజశేఖర్ రెడ్డి మాత్రం వింటారని చెప్పే ప్రయత్నం గా తెలుస్తోంది ఉండవెల్లి వ్యాఖ్యలు.