YS Jagan : వైసీపీలో ఉన్న వారితోనే రాజకీయం.. జగన్ కొత్త స్ట్రాటజీ

గతంలో ఎన్నడూ లేని గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు జగన్. కాంగ్రెస్ పార్టీని విభేదించి ఉప ఎన్నికలకు వెళ్ళినప్పుడు మంచి ఫలితాలు సాధించారు. 2014లో సైతం గౌరవప్రదమైన అసెంబ్లీ స్థానాలను పొందారు. 2019లో ఏకపక్ష విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మాత్రం దారుణంగా ఓడిపోయారు.

Written By: Dharma, Updated On : September 18, 2024 7:25 pm
Follow us on

Ys jaganmohan reddy : వైసీపీలో ఒక్కో నేత యాక్టివ్ అవుతున్నారు. పార్టీ దారుణంగా ఓడిపోయిన తర్వాత చాలామంది నేతలు సైలెంట్ అయ్యారు. మరికొందరు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇంకొందరు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే పార్టీ నుంచి వెళ్లిపోయిన వారితో సంబంధం లేకుండా.. తన వెంట నడిచే వారితో రాజకీయాలు చేయాలని జగన్ భావిస్తున్నారు. అయితే గత ఐదు సంవత్సరాలు అధికారాన్ని వెలగబెట్టి.. పదవులతో సంపాదించుకున్న చాలామంది నేతలు సైలెంట్ కావడంతో జగన్ నిరాశకు గురయ్యారు. అయితే కూటమి ప్రభుత్వంపై క్రమేపీ ప్రజా వ్యతిరేకత పెరుగుతోందని భావిస్తున్న జగన్..తన నమ్మకస్తులను పార్టీ బాధ్యతలు అప్పగిస్తున్నారు.అదే సమయంలో అసంతృప్తితో గడిపే నాయకులను అస్సలు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసే వారిని వదులుకునేందుకు సిద్ధపడుతున్నారు.బాలినేని శ్రీనివాస్ రెడ్డి విషయంలో సైతం జగన్ ముఖం మీద చెప్పేసినట్లు సమాచారం.ఆయన షరతులను జగన్ అంగీకరించలేదు.అందుకే పార్టీకి గుడ్ బై చెప్పారు బాలినేని.

* వరుసగా జిల్లాల రివ్యూలు
ప్రస్తుతం ఒక్కో జిల్లా రివ్యూ పెడుతున్నారు జగన్.మొన్న చిత్తూరు జిల్లాకు సంబంధించి సమీక్ష చేశారు.ఆ జిల్లాకు చెందిన నాయకులంతా హాజరయ్యారు. ముఖ్యంగా మాజీ మంత్రి రోజా హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె వైసీపీలో ఉండరని.. తమిళ రాజకీయాల్లో చేరిపోతారని ఆ మధ్యన ప్రచారం జరిగింది. ఆమె సోషల్ మీడియాలో సైతం వైసీపీ రంగులు,పార్టీ అధినేత ఫోటో తీసేయడంతో ఈ అనుమానాలకు బలం చేకూరింది. అయితే ఆమె ఏకంగా చిత్తూరు జిల్లా సమీక్షకు హాజరు కావడమే కాదు.. జిల్లాలో పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించడం విశేషం.నగిరి నియోజకవర్గంలో సైతం ఆమె యాక్టివ్ గా మారారు.

* నెల్లూరు బాధ్యతలు అనిల్ కు
తాజాగా నెల్లూరు జిల్లా సమీక్షను జరిపారు జగన్. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన విజయసాయిరెడ్డి తో పాటు ఆ జిల్లాకు చెందిన నేతలంతా హాజరయ్యారు. ఎన్నికల్లో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను తప్పించారు. నరసరావుపేట ఎంపీగా పోటీ చేయించారు. అయితే అనిల్ ఓడిపోయారు. ఇప్పుడు అదే అనిల్ కు నెల్లూరు జిల్లా బాధ్యతలను అప్పగించారు జగన్. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు వచ్చినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అనిల్ కుమార్ యాదవ్ అయితే సరిపోతారని జగన్ ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.

* వారిని పట్టించుకోని జగన్
అయితే చాలామంది వైసీపీ సీనియర్లు ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నారు. పార్టీ నుంచి వెళ్లాల్సిన వారు వెళ్ళిపోతున్నారు. జగన్ పై అభిమానం ఉన్నవారు ఉండిపోతున్నారు. అయితే జగన్ మాత్రం పార్టీ నుంచి వెళ్లే నాయకుల విషయం పట్టించుకోవడం లేదు. ఉన్నవారితో రాజకీయం చేయాలని భావిస్తున్నారు. రోజా, అనిల్ కుమార్ యాదవ్ లాంటి వారికి ప్రోత్సాహం అందించాలని చూస్తున్నారు. మరి ఆయన ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.