Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan : బట్టలూడదీస్తావా? జగన్ జాగ్రత్తగా మాట్లాడు.. ఎస్ఐ మాస్ వార్నింగ్!

YS Jagan : బట్టలూడదీస్తావా? జగన్ జాగ్రత్తగా మాట్లాడు.. ఎస్ఐ మాస్ వార్నింగ్!

YS Jagan : వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డికి( Jagan Mohan Reddy) మాస్ వార్నింగ్ ఇచ్చారు అనంతపురం జిల్లా రామగిరి ఎస్సై సుధాకర్. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్మోహన్ రెడ్డి తమను తప్పు పట్టడం ఏంటని ప్రశ్నించారు. తాము జగన్ ఇచ్చిన దుస్తులు వేసుకోలేదని.. కష్టపడి చదివి.. పోటీ పరీక్షల్లో నిలబడి ఉద్యోగాన్ని సాధించామని.. తమపై ఆరోపణలు చేసే ముందు జాగ్రత్తగా మాట్లాడాలని కూడా హితవు పలికారు. ప్రస్తుతం ఎస్సై సుధాకర్ యాదవ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కూటమి అనుకూల సోషల్ మీడియా ట్రోల్ చేస్తోంది. రాప్తాడు నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో చేసిన కామెంట్స్ పై పోలీస్ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రామగిరి ఎస్సై ప్రత్యేక వీడియో ఒకటి విడుదల చేశారు.

Also Read: వైఎస్ అడ్డాలో టిడిపి పండుగ.. ఏర్పాట్లు షురూ

* వైయస్ జగన్ పరామర్శ..
ఇటీవల రాప్తాడు నియోజకవర్గంలో( rapthadu constitution ) లింగమయ్య అనే బిసి నాయకుడు హత్యకు గురయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అతడిని ప్రత్యర్ధులు దారుణంగా హత్య చేశారు. అయితే ఇది టిడిపి నేతలు చేసిన పనేనంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫోన్ లో పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. త్వరలో తాను వ్యక్తిగతంగా కలుస్తానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే నిన్న రాప్తాడు వెళ్లారు జగన్మోహన్ రెడ్డి. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేశారు. పోలీసుల వైఖరిని తప్పు పట్టారు. చంద్రబాబు మెప్పుకోసం పోలీసులు తమ టోపీలపై ఉన్న సింహాలకు సెల్యూట్ కొట్టకుండా.. చంద్రబాబు చెప్పినట్లు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అలాంటి పోలీసుల బట్టలు ఊడదీసి ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని.. ఉద్యోగాలు ఊడగొడతామని హెచ్చరించారు. ప్రతి పోలీస్ అధికారి తమ ప్రవర్తన మార్చుకోవాల్సి ఉంటుందని చెప్పారు. భవిష్యత్తులో ప్రతి పనికి వడ్డీతో సహా చెల్లిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి.

* ఎస్సై పై సంచలన ఆరోపణలు..
మరోవైపు రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ పై( రామగిరి si Sudhakar Yadav ) సంచలన ఆరోపణలు చేశారు జగన్మోహన్ రెడ్డి. ఎస్సై వీడియో కాల్స్ తో ప్రతి ఎంపీటీసీ ని ప్రలోభ పెట్టారని జగన్ ఆరోపించారు. ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆయన ఫోన్ రికార్డులను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. లింగమయ్య కొడుకు పై కూడా దాడి చేశారని.. కనీసం ఫిర్యాదులు తీసుకోకుండా ఇబ్బంది పెట్టారని జగన్ విమర్శించారు. లింగమయ్య భార్యకు చదువు రాదని.. ఆమెతో వేలిముద్రలు ఎందుకు తీసుకున్నారని కూడా ప్రశ్నించారు జగన్. రాష్ట్రం బీహార్ కంటే దారుణంగా తయారవుతోంది అంటూ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. లింగమయ్య హత్య కేసులో కేవలం ఇద్దరిపై కేసు నమోదు చేశారని.. మిగతా వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న వారిని విస్మరించారని కూడా చెప్పుకొచ్చారు. రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ తీరుపై విరుచుకుపడ్డారు జగన్మోహన్ రెడ్డి.

* ఎస్సై సెల్ఫీ వీడియో..
అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి విమర్శలపై స్పందించారు రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్. ఓ సెల్ఫీ వీడియోను( selfie video) విడుదల చేశారు. పోలీసుల బట్టలూడదీసి కొడతానంటూ జగన్ హెచ్చరించడానికి తప్పు పట్టారు. పోలీసు దుస్తులు జగన్ ఇస్తే వేసుకున్నవి కాదని.. కష్టపడి సాధించిన యూనిఫామ్ వేసుకున్నామని చెప్పుకున్నారు. ఎవరో వచ్చి ఊడదీస్తానంటే అది అరటి తొక్క కాదని ఎద్దేవా చేశారు. తాము నిజాయితీగానే ప్రజల పక్షాన నిలబడతామని.. నిజాయితీగానే ఉద్యోగం చేస్తామని.. నిజాయితీగానే చస్తామని చెప్పారు. అంతేతప్ప అడ్డదారులు తొక్క బోమని.. జాగ్రత్తగా మాట్లాడాలని జగన్మోహన్ రెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు ఎస్సై సుధాకర్ యాదవ్.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version