YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి శాసనసభకు హాజరు విషయంలో మరో వార్త హల్చల్ చేస్తోంది. ఈ వర్షాకాలం అసెంబ్లీ సమావేశాలకు జగన్ తప్పకుండా హాజరవుతారు అన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే ఆయన ఇది సొంతంగా తీసుకున్న నిర్ణయం కాదట. మెజారిటీ ప్రజలు కోరుకున్న అభిప్రాయం ఇదట. ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక సర్వే చేసింది. ఆ సర్వేలో షాకింగ్ అంశాలు బయటపడ్డాయి. పార్టీ బలం పుంజుకుందా లేదా అన్నది పక్కన పెడితే.. ఎక్కువమంది జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని తప్పుపట్టారు. అసెంబ్లీకి వెళ్లక పోవడాన్ని సామాన్య జనాలు సైతం వ్యతిరేకించారు. 65 శాతం మంది ప్రజలు దీనిపై అభ్యంతరాలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి సభకు హాజరైతే మంచిది అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో జగన్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.
* ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో..
మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. నిబంధనల ప్రకారం ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం కుదరదు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. గతంలో చంద్రబాబుకు 23 అసెంబ్లీ సీట్లు వచ్చినప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఇదే మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. ఓ అయిదుగురు, ఆరుగురు ఎమ్మెల్యేలను లాగేస్తే చంద్రబాబుకు ఉన్న ప్రతిపక్ష హోదా పోతుంది కదా అని ఇదే జగన్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి నిబంధనలతో పనిలేదు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. ఈ విషయం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. అధికారం ఉంటే తప్ప.. హోదా ఉంటే తప్ప జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళరా అని ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా తటస్తులు, విద్యాధికులు ఆయన నిర్ణయాన్ని బాహటంగా వ్యతిరేకిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వేలో కూడా ఇదే అంశాన్ని ఎక్కువమంది ప్రస్తావిస్తున్నారు.. అందుకే జగన్ అసెంబ్లీకి వెళ్లక తప్పదు అని తెలుస్తోంది.
* వీకెండ్ ప్రెస్ మీట్ లు..
తనకు ప్రతిపక్ష నేత హోదా రాకపోవడంతో వారాంతపు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇది మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలపై కాకుండా.. ఎంపిక చేసుకున్న మీడియా ప్రతినిధులను పిలిచి అదే పనిగా జగన్మోహన్ రెడ్డి కొన్ని విషయాలు పై మాట్లాడుతున్నారు. అది అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఆన్ రికార్డ్ అవుతుంది. ప్రజా సమస్యలు ప్రస్తావించిన వారవుతారు. వాటికి పరిష్కార మార్గం చూపిన వారు అవుతారు. అందుకే ఎక్కువమంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తే బాగుంటుందన్న అభిప్రాయం వినిపించారు. సొంత పార్టీ శ్రేణుల అభిప్రాయం కూడా అదే.
* ఆ ప్రతిపాదన వచ్చినా..
మొన్న ఆ మధ్యన జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్దామని పార్టీ ఎమ్మెల్యేల వద్ద ప్రస్తావించారట. అయితే తాను రాను మీరు వెళ్ళండి అంటూ సూచించారట. తాను వస్తే రన్నింగ్ కామెంట్రీ రూపంలో కూటమి ఎమ్మెల్యేల నుంచి అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జగన్మోహన్ రెడ్డి చెప్పారట. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో మిగతా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు వెళ్తే తనకు అభ్యంతరం లేదని జగన్ చెప్పారట . అందుకు పెద్దిరెడ్డి ఒప్పుకోలేదట. అయితే కూటమి రెండేళ్ల పాలన పూర్తయింది. జగన్ అసెంబ్లీకి హాజరు విషయంలో ప్రజాభిప్రాయం ఇలా ఉంది. అందుకే ఈ వర్షాకాల సమావేశాల నుంచి జగన్ సభకు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. గతంలో కూడా ఇటువంటి ప్రచారం జరిగింది కానీ.. కార్యరూపం దాల్చలేదు. ఈసారైనా వర్కౌట్ అవుతుందా లేదా చూడాలి.
