Chandrababu: ఎన్డీఏకు వైసీపీ మద్దతు.. చంద్రబాబు అలెర్ట్

లోక్సభలో ఎన్డీఏకు పూర్తి మెజారిటీ ఉంది. 293 మంది సభ్యుల బలం ఉంది. కానీ బిజెపి నాయకత్వం మాత్రం నలుగురు సభ్యులు ఉన్న వైసీపీ మద్దతును కోరింది. 2019 నుంచి ఐదేళ్ల పాటు జగన్ కేంద్రం విషయంలో ఎలా నడుచుకున్నది అందరికీ తెలిసిన విషయమే.

Written By: Dharma, Updated On : June 26, 2024 11:29 am

Chandrababu

Follow us on

Chandrababu: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజా ఎన్నికల్లో జగన్ పై ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. ఇప్పుడు అదే ఎన్డీఏ కు జగన్ మద్దతు తెలిపారు. ఎన్డీఏ లో కీలక భాగస్వాములుగా చంద్రబాబుతో పాటు పవన్ ఉన్నారు. స్పీకర్ ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏకు పూర్తి మెజారిటీ ఉన్నా.. బిజెపి మాత్రం వైసీపీ మద్దతు కోరింది. వెంటనే జగన్ సైతం ఓకే చెప్పారు. అసలు ఏపీ విషయంలో మోదీ వ్యూహం ఏంటన్నది తెలియడం లేదు. మూడు ప్రాంతీయ పార్టీలను తన చెప్పు చేతుల్లోకి తీసుకోవడం ఆసక్తికర పరిణామంగా మారింది. ఏపీలో వైసీపీకి నలుగురు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. వారు స్పీకర్ ఎన్నికల్లో ఎన్డీఏ నిలిపిన అభ్యర్థికి ఓటు వేయనున్నారు.

లోక్సభలో ఎన్డీఏకు పూర్తి మెజారిటీ ఉంది. 293 మంది సభ్యుల బలం ఉంది. కానీ బిజెపి నాయకత్వం మాత్రం నలుగురు సభ్యులు ఉన్న వైసీపీ మద్దతును కోరింది. 2019 నుంచి ఐదేళ్ల పాటు జగన్ కేంద్రం విషయంలో ఎలా నడుచుకున్నది అందరికీ తెలిసిన విషయమే. కేంద్రానికి అవసరమైన ప్రతిసారి జగన్ మద్దతు తెలుపుతూ వచ్చారు. ఎన్డీఏలో టిడిపి, జనసేన ఉండడంతో స్పీకర్ ఎన్నికల్లో వైసిపి ఎలా వ్యవహరిస్తుంది అన్నది చర్చగా మారింది. కానీ బిజెపి నుంచి మద్దతు కావాలని ప్రతిపాదన రావడం.. దానికి జగన్ ఓకే చెప్పేయడం జరిగిపోయింది. లోక్సభలో వైసిపి పార్లమెంటరీ నేత మిథున్ రెడ్డితో బిజెపి నేతలు చర్చించారు. వెంటనే ఆయన జగన్ తో చర్చలు జరిపారు. ఎన్డీఏకు మద్దతు ఉంటుందని ప్రకటన కూడా వచ్చింది.

ఎన్డీఏకు సంపూర్ణ మెజారిటీ ఉండగా.. వైసీపీ మద్దతు కోరడం ఏమిటన్న ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. అసలు ఏపీ విషయంలో మోడీ ఏం ఆలోచిస్తున్నారన్న ప్రశ్న వినిపిస్తోంది. ఎన్డీఏలో భాగస్వాములుగా ఉండగా.. బిజెపి వైసిపి మద్దతు కోరడంపై టిడిపి, జనసేనలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మొన్నటికి మొన్న ప్రమాణ స్వీకార మహోత్సవంలో చిరంజీవి, పవన్ ను తీసుకొని వచ్చి మరి ప్రధాని మోదీ అభివాదం చేయించారు. ఇప్పుడు మొన్నటి ఎన్నికల్లో ఎవరిపై పోరాడారో.. అదే జగన్ ను ఇప్పుడు మద్దతు కోరారు. దీని వెనుక వ్యూహం ఏదైనా ఉందా అన్న అనుమానాలు టిడిపిలో ఉన్నాయి. అయితే దీనిపై చంద్రబాబు అలెర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఎన్డీఏ సుస్థిరతను దెబ్బతీయాలని ఆలోచన చేస్తున్న ఇండియా కూటమికి అవకాశం ఇవ్వకూడదని మోడీ భావిస్తున్నారు. అందుకే సభలో తమ బలాన్ని చూపే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే చంద్రబాబుతో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను సంప్రదించిన తర్వాతే.. ప్రధాని మోదీ వైసిపి మద్దతు కోరినట్లు తెలుస్తోంది.