Arrest of YCP leaders : ఏ క్షణమైనా వైసీపీ నేతలు అరెస్ట్.. షాకిచ్చిన హైకోర్టు

ఏపీలో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. పాత కేసులు తెరపైకి వస్తున్నాయి. దీంతో కొంతమంది వైసీపీ నేతల్లో గుబులు. అయితే తాజాగా హైకోర్టు వైసీపీ నేతలు వేసిన పిటిషన్లను తిరస్కరించింది. దీంతో ఈ క్షణమైనా వైసీపీ నేతల అరెస్టు తప్పదని ప్రచారం ప్రారంభమైంది.

Written By: Dharma, Updated On : September 4, 2024 12:44 pm

Arrest of YCP leaders

Follow us on

Arrest of YCP leaders  : వైసీపీ నేతలు అరెస్ట్ అవుతారా? పాత కేసుల నేపథ్యంలో అరెస్టులు జరిగే ఉద్దేశం ఉందా?మధ్యాహ్నం తర్వాత దీనిపై క్లారిటీ రానుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నేతలపై పాత కేసులను తిరగదోడిన సంగతి తెలిసిందే. దీంతో వారంతా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే కోర్టు ఈ పిటిషన్లను కొట్టివేసింది. దీంతో ఏ క్షణమైనా వైసీపీ నేతల అరెస్టు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా మాజీ మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్సీ తలశీల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ నందిగాం సురేష్, దేవినేని అవినాష్ తదితరుల అరెస్టు జరిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.ప్రస్తుతం వారిపై అరెస్టు కత్తి వేలాడుతోంది. మధ్యాహ్నం కి కోర్టు నుంచి క్లారిటీ వచ్చాక.. చకచకా అరెస్టులు జరిగే ఛాన్స్ కనిపిస్తోంది.

* చంద్రబాబు ఇంటి పై దండయాత్ర
2021లో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్ దాడికి వెళ్లారు. అప్పట్లో ప్రభుత్వం పై చంద్రబాబు విమర్శలు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వందలాది వాహనాలతో చంద్రబాబు ఇంటిపై దండెత్తారు జోగి రమేష్. నానా హంగామా సృష్టించారు. అప్పట్లో జోగి రమేష్ పై టిడిపి నేతలు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పైగా ఈ ఘటన తరువాత జోగి రమేష్ కు జగన్ మంత్రి పదవి ఇచ్చారు. అయితే తాజాగా టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. తన అరెస్టు తప్పదని జోగి రమేష్ భావించారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.

* టిడిపి కేంద్ర కార్యాలయం పై దాడి
2021 అక్టోబర్లో టిడిపి కేంద్ర కార్యాలయం పై దాడి జరిగింది. అప్పట్లో వైసీపీకి చెందిన 70 మందికి పైగా దాడిలో పాల్గొన్నారు. దీనిపై అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పార్టీ శ్రేణులకు బీపీ వస్తే ఇలానే ఉంటుందని అప్పట్లో సీఎం జగన్ వెనుకేసుకొచ్చారు. అప్పటి డిజిపి సైతం చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఈ కేసులో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశీల రఘురాం,విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ తదితరుల డైరెక్షన్ లోనే ఈ దాడి జరిగినట్లు తాజాగా గుర్తించారు. దీంతో వారంతా తమ అరెస్టు తప్పదని భావించి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.

* సాయంత్రానికి క్లారిటీ
అయితే తాజాగా ఈరోజు జరిగిన విచారణలో ముందస్తు బెయిల్ పిటిషన్లు తిరస్కరించింది హైకోర్టు. దీంతో ఏ క్షణమైనా వారి అరెస్టు జరుగుతుందని అంతా భావిస్తున్నారు. అయితే బెయిల్ పిటిషన్ల తిరస్కరణతో పిటిషనర్ తరపు న్యాయవాదులు రెండు వారాలపాటు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే ఇప్పటికిప్పుడు ఈ అంశంపై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని.. దీనిపై విచారణ జరిపి అంశాన్ని మధ్యాహ్నం పరిశీలిస్తామని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ కోర్టు ఎటువంటి ఆదేశాలు ఇవ్వకుంటే వైసీపీ నేతల అరెస్టు ఖాయమని తెలుస్తోంది.