Madanapalle : పిల్లలను చూసేందుకు వస్తే..ఏకంగా భర్తనే తగులబెట్టేసింది

బిడ్డలను చూసేందుకు వచ్చానని చెప్పినా వినకుండా.. గొడవపెట్టుకున్నారు. అందరూ కలిసి కొట్టారు. ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పటించారు.

Written By: Dharma, Updated On : May 5, 2023 5:43 pm
Follow us on

Madanapalle : వివామైన తొలినాళ్లలో వారు ఎంతో అన్యోన్యంగా గడిపారు.  పిల్లలు పుట్టాక  వారి మధ్య స్పర్థలు పెరిగాయి. విడాకులకు దారితీశాయి. కానీ పిల్లలంటే ఇరువురికీ ప్రేమే. ప్రస్తుతం పిల్లలు భార్య వద్దే ఉన్నారు. పిల్లలు దూరమయ్యేసరికి మనస్తాపానికి గురైన భర్త చూసేందుకు వెళ్లాడు. కానీ అత్తింటి వారు అడ్డుకున్నారు. అభ్యంతరం వ్యక్తం చేశారు. పిల్లలతో విడిచిపెట్టాడన్న బాధతో భార్య పెట్రోల్ పోసి నిప్పంటించింది. తీవ్ర గాయాలపాలైన అతడు.. ప్రస్తుతం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

మదనపల్లెలోని  రామారావు కాలనీకి చెందిన బావాజీ అలియాస్‌ బాబ్జీ (33)కు కొన్నేళ్ల క్రితం యాస్మిన్‌ అనే మహిళతో వివాహం జరిగింది. ప్రస్తుతం వీరికి ముగ్గురు పిల్లలున్నారు. గత కొద్దిరోజులుగా వీరి మధ్య విభేదాలు పొడచూపాయి. ఇటీవల తీవ్రమయ్యాయి. దీంతో ఇరువురూ కోర్టును ఆశ్రయించారు. పదిరోజుల కిందట విడాకులు మంజూరయ్యాయి. ప్రస్తుతం ముగ్గరు పిల్లలు తల్లి యాస్మిన్ వద్దే ఉంటున్నారు. అయితే పిల్లలు దూరం కావడంతో తండ్రి బావాజీ మనస్తాపానికి గురయ్యాడు. స్థానికంగా ఓ చికెన్ దుకాణంలో పనిచేసే ఆయన మనోవ్యధకు గురయ్యాడు. రోజూ పిల్లలను తలచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.

ఎలాగైనా పిల్లలను చూడాలని భావించాడు. గురువారం రాత్రి డ్రైవర్స్ కాలనీలోని భార్య ఇంటికి వెళ్లాడు. దీంతో భార్య యాస్మిన్ తో పాటు ఆమె కుటుంబసభ్యులు కోపోద్రిక్తులయ్యారు. దుర్భాషలాడుతూ అడ్డుకున్నారు. బిడ్డలను చూసేందుకు వచ్చానని చెప్పినా వినకుండా.. గొడవపెట్టుకున్నారు. అందరూ కలిసి కొట్టారు. ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పటించారు. మంటల్లో చిక్కుకున్న బావాజీ కేకలకు చుట్టుపక్కల ఉన్న వారు వచ్చారు. మంటలను అదుపు చేశారు. 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే 90 శాతం శరీరం కాలిపోవడంతో వైద్యులు అత్యవసర వైద్యసేవలందిస్తున్నారు. ఈ ఘటనతో ముగ్గరు పిల్లలు అనాథలుగా మారారు. తండ్రి చావుబతుకుల మధ్య కొట్టిమిట్టాడుతుండగా.. తల్లి నేరానికి పాల్పడడంతో జైలుపాలైంది.,