Lok Sabha Elections Results 2024: రాజకీయాలలో శాశ్వత వైరం.. శాశ్వత స్నేహం ఉండదు. ఎప్పటికయ్యేది ప్రస్తుతమో అన్నట్టుగానే రాజకీయాలు ఉంటాయి.. అందుకే తమ అవసరాలకు అనుగుణంగా రాజకీయ నాయకులు కప్ప దాట్ల సామెత తీరుగా పొత్తులు పెట్టుకుంటారు. అవసరం తీరిన తర్వాత ఆ పొత్తులను గంగలో కలిపేసుకుంటారు.. ఇందులో ఏ పార్టీకీ మినహాయింపు ఉండదు.. ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో.. మరోసారి కప్పదాట్ల రాజకీయాలు తెరపైకి వచ్చాయి.
2014లో కేంద్రంలో మోడీ ఆధ్వర్యంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు భాగస్వామిగా ఉండేవారు. ఆ తర్వాత మోడీతో వైరం నేపథ్యంలో దూరం జరిగారు. 2019 ఎన్నికల్లో ఏపీలో దారుణమైన ఓటమిని మూట కట్టుకున్నారు. ఆ తర్వాత అనేక పరిణామాల నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి జగన్ ప్రభుత్వం టార్గెట్ చేయడంతో స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలుకు వెళ్లారు. దీంతో నరేంద్ర మోడీ, అమిత్ షా కల్పించుకొని చంద్రబాబు నాయుడిని ఒడ్డున పడేశారు. బతుకు జీవుడా అనుకుంటూ చంద్రబాబు నాయుడు మళ్ళీ తనదైన రాజకీయ చాణక్యానికి తెరదీశారు. ఏపీ వ్యాప్తంగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. ప్రభుత్వ తప్పులను ఎండగట్టారు. ఎన్డీఏ కూటమిలో చేరి భాగస్వామ్య పార్టీగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలు గెలుచుకొని సత్తా చాటారు.. అయితే చంద్రబాబు గెలుచుకున్న ఆ 16 ఎంపీ స్థానాలు ప్రస్తుతం ఇండియా కూటమికి జీవగంజి లా మారాయి..
భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల్లో 300కు మించి స్థానాలు గెలుచుకుంటే.. ఈసారి 240+ లోపే ఆగిపోయింది. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 272 ఎంపీ స్థానాలు కచ్చితంగా ఉండాలి.. అయితే ఆ స్థాయిలో బీజేపీకి బలం లేకపోవడంతో అనివార్యంగా టిడిపి, జెడియు సహకారం తీసుకోవాల్సి వచ్చింది.. జెడియు అధినేత నితీష్ కుమార్ కూడా కప్పదాట్ల వ్యవహారాల లాంటి రాజకీయ నాయకుడే అయినప్పటికీ.. నరేంద్ర మోదీకి ఇప్పుడు సపోర్ట్ అవసరం కాబట్టి తప్పడం లేదు..
ఇదే సమయంలో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల పొత్తుకు సంబంధించి ఒక వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఒకే వేదికపై నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉన్నారు. ముందుగా కూర్చోవాలని నరేంద్ర మోదీని చంద్రబాబు ఆహ్వానించగా.. లేదు లేదు మీరు కూడా నాతో పాటు కూర్చోవాలని చంద్రబాబు నాయుడిని నరేంద్ర మోదీ కుర్చీలోకి లాగారు. బలవంతంగా నైనా చంద్రబాబు ఆ కుర్చీలో కూర్చున్నారు.. వాతావరణం మారిన తర్వాత చంద్రబాబు చిరునవ్వు చిందిస్తారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆశించినంత స్థాయి మెజారిటీ రాకపోవడంతో బిజెపి టిడిపి సపోర్ట్ తీసుకుంది. దాని ఉద్దేశించి ఓ నెటిజన్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది వైరల్ గా మారింది..
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More