Jagan: ఏపీలో( Andhra Pradesh) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో ప్రజల నుంచి స్పందన రావడం లేదు. తమ పార్టీ నేతలపై దాడులకు తెగబడుతున్నారని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే గతంలో జగన్ ఇలాంటి దాడుల విషయంలో వ్యవహరించిన తీరును ఇప్పటికీ ప్రజలు గుర్తు చేస్తున్నారు. వారికి గుర్తు లేకపోతే సోషల్ మీడియా గుర్తు చేస్తోంది. బీపీలు వస్తే పార్టీ కార్యకర్తలు, అభిమానులు దాడి చేస్తారు అన్న జగన్ మాటను ఎక్కువ మంది గుర్తు చేస్తున్నారు. అప్పట్లో టిడిపి నేత ఒక్కరూ బోస్ డీకే అనే పదాన్ని వాడారు. దానిని విచిత్రమైన బూతుగా మార్చారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. చివరకు జగన్మోహన్ రెడ్డి అదే మాటను వక్రీకరిస్తూ.. తనను అంత మాట అంటే అభిమానులకు బీపీ వచ్చి ఆ టిడిపి నేత ఇంటిపై పడ్డారని.. అందులో ఎంత మాత్రం తప్పు లేదని తేల్చేశారు. ఇప్పుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమక్షంలో, పోలీసుల సమక్షంలో చంద్రబాబుపై బూతు పదం ప్రయోగించారు. ఇప్పుడు కూడా బీపీ వచ్చింది అని చంద్రబాబు ప్రకటించలేదు. ఎంతవరకు ఆయన సంమయమనం పాటించమని పార్టీ శ్రేణులను కోరేరే తప్ప ఇలా సమర్ధించలేదు. అయితే తాజా పరిణామాలతో జగన్ వైఖరిని మరోసారి ప్రజల ముందు ఉంచుతోంది సోషల్ మీడియా. అయితే ఈ ఘటనతో పొలిటికల్ సెంటిమెంటు రగిలించాలని వైసీపీ భావించింది. కానీ దానికి ఎంత మాత్రం ప్రజలు అవకాశం ఇవ్వడం లేదు.
* వివాదాస్పద నేతలతో..
మొన్నటికి మొన్న కల్తీ మద్యం వ్యవహారం జరిగింది. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా వైసీపీ నేతలే ప్లాన్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా మాజీ మంత్రి జోగి రమేష్ ( Jogi Ramesh )పేరు బయటకు వచ్చింది. ఈ కుట్రలో ఆయన భాగస్వామ్యం అయ్యారని నిర్ధారణ కావడంతో కోర్టు రిమాండ్ విధించింది. ఆ కేసు విచారణ అలా కొనసాగుతుండగానే ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు. ఇప్పుడు అదే నేత నిత్యం లోకేష్ పై విరుచుకు పడుతూనే ఉన్నారు. అంబటి రాంబాబు కంటే దారుణంగా వ్యాఖ్యానాలు చేశారు. అయితే జోగి రమేష్ ఇంటి పై దాడి జరిగింది. కానీ ప్రజల నుంచి మాత్రం సానుభూతి లభించడం లేదు. అంబటి రాంబాబు ఇంటిపై దాడి విషయంలో కూడా ప్రజలు లైట్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆ ఇద్దరు నేతలు అత్యంత వివాదాస్పదులే. ఈ ఘటనల ద్వారా వైసీపీ రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం అంటే అంతకంటే మూర్ఖత్వం ఉండదు. వారి వల్ల మరింత చెడ్డ పేరు వస్తుందే కానీ.. ప్రజలు మాత్రం గుర్తించే ఛాన్స్ లేదు. దానిని జగన్ గుర్తించడం లేదు.
* తప్పు పడుతున్న నిపుణులు..
ఏదైనా ప్రజా సమస్యలపై పోరాటం చేయవచ్చు కదా. సీనియర్ నేతలను ముందు పెట్టి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించవచ్చు కదా? అయితే దానిని వదిలేసి ఇలా అంబటి రాంబాబు, జోగి రమేష్ లాంటి వారితో రాజకీయాలు చేయాలనుకోవడం మూర్ఖత్వమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు ఇటువంటి వారితో రాజకీయం చేస్తామంటే హర్షించరంటున్నారు. ఎందుకంటే రాజకీయాల్లో వీరు వ్యవహరించిన తీరు తెలిసినదే. అధికారంలో ఉన్నప్పుడు వీరు ఎంతలా తెగించి, దూకుడుగా వ్యవహరించారో తెలియనిది కాదు. అటువంటివారితో రాజకీయాలు చేయడం ఎంత మాత్రం సహేతుకం కాదని పార్టీలో సీనియర్ నేతలు సైతం అభిప్రాయపడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి వారిద్దరిపై ఆధారపడి, ఆ రెండు ఘటనలపై పోరాటం ప్రారంభించడం అనేది నిజంగా సాహసమే.