Homeఆంధ్రప్రదేశ్‌AP Politics: ఏపీ రాజకీయాల్లో సినిమాల ప్రభావం ఎంత?

AP Politics: ఏపీ రాజకీయాల్లో సినిమాల ప్రభావం ఎంత?

AP Politics: ఏపీలో పొలిటికల్ సెటైరికల్ సినిమాలు కొత్త కాదు. అయితే గతంలో ప్రభుత్వ వైఫల్యాలను, పొలిటికల్ పార్టీల్లో లోపాలను సినిమాల ద్వారా ఎత్తిచూపేవారు. ప్రతి ఎన్నికలకు ముంగిట దాసరి నారాయణరావు లాంటి దర్శకుల నుంచి ఇలాంటి సినిమాలు వస్తుండేవి. అయితే ఇప్పుడుఅవి కాస్త పక్కకు వెళ్లాయి. ఇప్పుడంతా ప్రత్యర్థి పార్టీల్లో నేతలను టార్గెట్ చేసుకుంటున్నారు. పోటా పోటీగా సినిమాలు తీస్తున్నారు. ప్రజలను ఒక రకమైన గందరగోళంలో నెడుతున్నారు. సినిమాలతో రాజకీయాన్ని ప్రభావితం చేయాలని భావిస్తున్నారు.

గత ఎన్నికలకు ముందు రాజశేఖరరెడ్డి ఇతివృత్తంతో యాత్ర సినిమాను రూపొందించారు. ఎన్నికల ముంగిట యాత్ర 2తో మరోసారి విడుదల చేశారు. మరోవైపు రాంగోపాల్ వర్మ వ్యూహం, శపధం సినిమాలను తీశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ ఎదుర్కొన్న పరిణామాలను ఇతివృత్తంగా తీసుకుని.. రెండు పార్టులుగా చూపించే ప్రయత్నం చేశారు. కానీ చంద్రబాబు వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఈ సినిమాలో దృశ్యాలు ఉన్నాయంటూ నారా లోకేష్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయ చిక్కులు అధిగమించినా.. సినిమా ప్రదర్శనకు సంబంధించి అనుమతులు విషయంలో జాప్యం జరుగుతోంది.

అయితే తెలుగుదేశం పార్టీ సైతం వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సినిమాలు తీయడం ప్రారంభించింది. అమరావతి రాజధాని రైతుల కష్టాలను ఇతివృత్తంగా చేసుకుని రాజధాని ఫైల్స్ సినిమా తెరపైకి వచ్చింది. ఈ సినిమా ప్రదర్శన విషయంలో అభ్యంతరాలను కోర్టు కొట్టి వేసింది. దీంతో సక్సెస్ ఫుల్ గా ఈ సినిమా ప్రదర్శన పూర్తయింది. వైసిపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, జగన్ నిరంకుశ వైఖరిని ఈ సినిమా ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. సినిమా టేకింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకున్నారు. జగన్ పై ప్రతికూలత చూపించేలా ఈ సినిమాను తీసినట్లు తెలుస్తోంది.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ఇతివృత్తంగా తీసుకుని వివేకం బయోపిక్ అనే చిత్రాన్ని రూపొందించారు. ఇందులో సీఎం దంపతులతో పాటు ఎంపీ అవినాష్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నారు. ఎక్కడ పేర్లు మార్పు కానీ చేయలేదు.దర్శకుడు చాలా ధైర్యంగా ఈ సినిమాను రూపొందించిన తీరు అభినందనలు అందుకుంటుంది. అయితే ఈ సినిమా విషయంలో వైసిపి ముందే మేల్కొంది. ఓటిటి ద్వారా సినిమాను విడుదల చేయడాన్ని అడ్డుకుంది. దీంతో గంట నిడివి గల ఈ సినిమాను యూట్యూబ్లో పెట్టారు. మరోవైపు నారా రోహిత్ ప్రతినిధి 2 సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజకీయ ఇతివృత్తంగా ప్రతినిధి సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్ గా ప్రతినిధి 2 చిత్రం రాబోతుంది. మొత్తానికైతే ఎన్నికల ముంగిట ఏపీ రాజకీయాలను ప్రభావితం చేసేలా సినిమాలు వస్తుండడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version