Vivekananda Reddy case latest news: ఏపీలో( Andhra Pradesh) ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసు హాట్ టాపిక్ అవుతోంది. ఈ కేసు విచారణలో ఇప్పటివరకు సేకరించిన వివరాలే ఫైనల్ అని.. కొత్తగా ఆధారాలేవీ లభ్యం కాలేదని సిబిఐ కోర్టుకు స్పష్టం చేసింది. అయితే ఈ కేసులో అసలు సూత్రధారులను సిబిఐ విచారణ చేపట్టలేదని వివేకానంద కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడేళ్లుగా తాను న్యాయపోరాటం చేశానని.. అందుకు తగ్గ ప్రతిఫలం ఏది రాలేదన్నది ఆమె ఆవేదన. సిబిఐ విచారణ తీరును ఆమె ఆక్షేపిస్తున్నారు. అయితే ఆధారాలు దొరకలేదని సిబిఐ చెబుతోంది. అదే సమయంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. వివేక గుండెపోటు చిత్రీకరణ వెనుక సునీత ఉన్నారన్నది ఆయన ఆరోపణ. ఆయన సైతం సిబిఐ తీరును ఆక్షేపిస్తున్నారు. తన విషయంలో సిబిఐ చేసిన అతిని గుర్తు చేస్తున్నారు. అటు సునీత సిబిఐనే ఆక్షేపిస్తున్నారు. ఇటు అవినాష్ రెడ్డి సిబిఐనే తప్పుపడుతున్నారు. సిబిఐ మాత్రం ఈ కేసులో తమకు ఎటువంటి ఆధారాలు లభించలేదని.. కేసును క్లోజ్ చేయాలని కోరుతున్నట్లు అనిపిస్తోంది.
దర్యాప్తు భిన్నంగా..
వివేకానంద రెడ్డి( Vivekananda Reddy ) హత్య కేసు విచారణకు సంబంధించి ఇప్పుడు సిబిఐ కార్నర్ అవుతోంది. అది ఎలా అంటే.. సిబిఐ నమోదు చేసిన చార్జ్ షీట్లలో ఒక్కోసారి ఒక్కోలా చెబుతూ వచ్చింది. ఒకానొక దశలో అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాలని చూసింది. రాజకీయ కుట్ర కోణంలోనే ఈ హత్య జరిగినట్లు పేర్కొంది. a7 నిందితుడిగా వైయస్ భాస్కర్ రెడ్డిని చూపించగా.. a8 నిందితుడిగా అవినాష్ రెడ్డి ని చెప్పింది. భాస్కర్ రెడ్డి స్వయానా అవినాష్ రెడ్డి తండ్రి. భాస్కర్ రెడ్డి కి ఏ అవసరం ఉంటుంది. ఆయన ఏం ఎమ్మెల్యే కాదు.. ఎంపీ అంతకంటే కాదు. ఆయన ఎందుకు వివేకానంద రెడ్డిని హత్య చేయించి ఉంటారు. నిజంగా రాజకీయ కోణం ఉంటే అది ఎవరికి ప్రయోజనం. కచ్చితంగా అది అవినాష్ రెడ్డికి ప్రయోజనం చేకూర్చేది అయి ఉండాలి. ఇలా ఎన్నో చిక్కుముడులను సిబిఐ ఛేదించలేకపోయింది.
ఏడేళ్ల పాటు హైడ్రామా..
ఒక్కటి మాత్రం నిజం. ఏ దర్యాప్తు సంస్థ కైనా సాక్షాలు ముఖ్యం. ఆధారాలు ముఖ్యం. అవి లేనిదే నిందితుల నిర్ధారణ కాదు. ఇప్పుడు సిబిఐ కి ఈ కేసులో ఎదురైన పరిణామం అదే. టిడిపి ప్రభుత్వ హయాంలో వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు. ఎన్నికలకు ముందు ఆయన హత్య జరిగింది. అప్పట్లోనే సిబిఐ విచారణ కోరింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. తీరా అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి తన సొంత బాబాయి హత్య జరిగితే ఏ రేంజ్ లో విచారణకు ఆదేశించాలి. కానీ అప్పటివరకు సిబిఐ విచారణ కోరిన ఆయన వద్దని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేదాకా పరిస్థితి వెళ్ళింది. చేతిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటే సిబిఐ కి సహకారం అందించాలి. కానీ వైసీపీ హయాంలో సిబిఐ విచారణకు అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి. సిబిఐ విచారణ సవ్యంగా సాగలేదు కూడా. మరి ఇటువంటి సమయంలో సాక్షాలు ఎలా దొరుకుతాయి. ఆధారాలు ఎలా దొరుకుతాయి. ముందుగా సిబిఐ విచారణ చాలా వేగంగా సాగింది. తర్వాత మందగించింది. ఏడేళ్లలో ఎన్నో రకాల ఒత్తిళ్లు, పరిణామాలు జరిగాయి. వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఆశించిన స్థాయిలో విచారణ జరగలేదు. తమపై మోపిన అభియోగాలను నిరూపించలేకపోయిందని అవినాష్ రెడ్డి ఆవేదనతో ఉన్నారు. ఇలా ఎలా చూసుకున్నా సిబిఐ ఇప్పుడు కార్నర్ అవుతోంది. దేశంలోనే అతిపెద్ద దర్యాప్తు సంస్థ. అందుకే ఇటువంటివి రాకుండా చూసుకోవాల్సిన అవసరం సిబిఐ ఉంది. లేకుంటే నవ్వుల పాలు కావడం ఖాయం.