Visakhapatnam AI data hub project: విశాఖపట్నం అనగానే అందరికీ గుర్తొచ్చేది సముద్రం, బీచ్లు, తర్వాత గుర్తొచ్చేది స్టీల్ ప్లాంట్. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా ఎదిగిన విశాఖను కూటమి ప్రభుత్వం ఐటీకి కేరాఫ్గా మారుస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు చొరవతో విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. ఇటీవలే ప్రారంభించారు. ఇది ఒక ప్రాజెక్టు కాదు, ఆంధ్రప్రదేశ్కు ఒక కొత్త గుర్తింపును తీసుకురాబోతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 1.35 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పడబోయే ఈ ఏఐ మెగా హబ్తో విశాఖ స్టీల్ ప్లాంట్గా మాత్రమే కాకుండా, ప్రపంచ టెక్ మ్యాప్లోని ఒక ప్రముఖ కేంద్రంగా మారనుంది. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ‘‘భవిష్యత్తుకు పునాది, జనరేషన్ను మార్చే ఉద్యమం’’ అని పిలుస్తూ, దీనిని కేవలం పరిశ్రమకాక పాలిటికల్ గుర్తింపుగా నెలకొల్పుతోంది.
శంకుస్థాపన చేసిన నారా లోకేష్..
విశాఖపట్నంలోని తర్లవాడ వద్ద గూగుల్ సెంటర్కు రాష్ట్ర ఐటీ, విద్య శాఖ మంత్రి నారాలోకేశ్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలనను ‘‘విధ్వంస పాలన’’గా, పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయిన కాలంగా చిత్రీకరించారు. ఇప్పుడు గూగుల్తో సంపూర్ణ ప్రాజెక్టు రావడం తమ ప్రభుత్వ ఘనతగా చెప్పారు. తమ ప్రభుత్వం 13 నెలల్లో గూగుల్తో ఒప్పందాన్ని భూమిపూజ వరకూ తీసుకెళ్లడంలో ప్రత్యేక వేగం, పాలసీ క్లారిటీ, కేంద్రం–రాష్ట్రం సహకారం కలిపి కనిపిస్తోంది. ఇది ఒక ప్రభుత్వ సాధనా చరిత్రగా కూడా పరిగణించబడుతోందన్నారు.
ఐదేళ్లు విధ్వంస పాలన
ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం ఐదేళ్లు విధ్వంస పాలన సాగించిందని లోకేష్ ఆరోపించారు. ఒక్క కంపెనీ కూడా తీసుకురాలేదని, ఉన్న కంపెనీలు పారిపోయేలా పాలన సాగించారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లోని కంపెనీలు కూడా ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని తెలిపారు. 2024లో ఒక ప్రభంజనం వచ్చింది. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర… స్టేట్ మొత్తం క్లీన్ స్వీప్. 94 శాతం స్ట్రైక్ రేట్తో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. ప్రమాణ స్వీకారం చేసిన మొదటిరోజు నుండే పెట్టుబడుల కోసం పరిగెత్తాం అని వివరించారు. అన్ని దేశాలు తిరిగి ఆంధ్రప్రదేశ్ని ప్రమోట్ చేశామని తెలిపారు.
సీబీఎన్ బ్రాండ్ తోనే ఇన్వెస్టర్ల రాక
తాము విదేశాలకు వెళ్లినప్పుడు ఇన్వెస్టర్లు తాము ఆంధ్రప్రదేశ్కు ఎందుకు రావాలని అడిగారని, వారికి మూడు యూనిక్ పాయింట్లు చెప్పామని తెలిపారు. మొదటిది బ్రాండ్ సీబీఎన్. ప్రపంచంలో ఏ కంపెనీ వద్దకు వెళ్లినా మన బ్రాండ్ సీబీఎన్ పేరు చెప్పగానే డోర్స్ ఓపెన్ అవుతాయన్నారు. సైబరాబాద్ కట్టిన హిస్టరీ మన బ్రాండ్కి ఉంది. రెండో పాయింట్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుండి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి గేర్ మార్చాం. మూడవది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అని వెల్లడించారు.
డబుల్ ఇంజన్.. బుల్లెట్ ట్రైన్ స్పీడ్..
చాలా రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్లు ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. ఆ బుల్లెట్ ట్రైన్ పేరు నమో. అంటే నాయుడు – మోడీ. అందుకే మనకి గూగుల్ వచ్చింది. దేశానికి 100 రూపాయల పెట్టుబడి వస్తే ఒక్క ఏపీకి 25 రూపాయల పెట్టుబడి వచ్చింది అని తెలిపారు. అదీ సీబీఎన్ బ్రాండ్ సత్తా అన్నారు.
రెండోనెల నుంచే గూగుల్ కోసం వేట..
ఆంధ్రప్రదేశ్కు వచ్చిన ప్రతీ కంపెనీ వెనుక ఒక కథ ఉందని లోకేష్ తెలిపారు. ప్రతీ కంపెనీ వెనుక తమ కష్టం ఉందన్నారు. ఇటీవలే ఆర్సెలార్ మిట్టల్ ప్రాజెక్టు వచ్చిందని తెలిపారు. గూగుల్ స్టోరీ సెప్టెంబర్ 2024లో ప్రారంభమైందని, అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే గూగుల్ ప్రతినిధులతో ఇదే విశాఖపట్నంలో మొదటి మీటింగ్ జరిగిందని పేర్కొన్నారు. ఆరోజు జరిగిన మీటింగ్ ఫలితం ఈ రోజు ఒక డేటా సిటీ. ఆ రోజు వాళ్లు ఒక క్లియర్ విజన్తో వచ్చారు. మూడు అంశాల్లో క్లారిటీ కావాలని అడిగారు. ఆరోజు వాళ్లు అడిగిన మూడు అంశాలను మనం ఒక మిషన్ మోడ్లో తీసుకున్నాం. 13 నెలలు పరుగులు పెట్టాం. వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని ప్రతీరోజు ఫాలో అప్ చేశామని వివరించారు.
సీఎం పర్యవేక్షించారు.. పీఎం సహకరించారు..
విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి ఆశ్విని వైష్ణవ్ సహకరించారని, ముఖ్యమంత్రి నేరుగా మానిటర్ చేశారని లోకేష్ వెల్లడించారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇందుకు సహకరించారన్నారు. 13 నెలల కష్టం తరువాత అక్టోబర్ 2025న ఢిల్లీలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశామని వెల్లడించారు. సీఎం 25 ఏళ్లు కుర్రాడిలా పరిగెడతారు. మేము అయన వెనుక పరిగెత్తడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
శిశాఖ ఏఐ మెగా హబ్
విశాఖలో గూగుల్ 1.35 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది. గూగుల్ ఏర్పాటు చేసేది కేవలం డేటా సెంటర్ కాదు, ఇది ఏఐ మెగా హబ్. 1 గిగావాట్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతున్నారు. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ఈ డేటా సెంటర్ రాబోతుంది. 2028కి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ఈ కంపెనీ నిర్మాణంలో ఉన్నప్పుడే 25 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. గూగుల్ హబ్తో పాటు ఇతర అనుబంధ కంపెనీలతో కలిపి డైరెక్ట్ – ఇన్డైరెక్ట్ గా 2లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఎలక్ట్రికల్ – మెకానికల్ సిస్టమ్స్ ఇలా అనేక రంగాల్లో హై క్వాలిటీ జాబ్స్ వస్తాయని వివరించారు.
అభివద్ధి వికేంద్రీకరణ విజన్
‘‘ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ’’ ఈ విజన్తో ప్రభుత్వం ఉత్తరాంధ్రను ఐటీ–డేటా సెంటర్ల కేంద్రంగా, రాయలసీమ ఎలక్ట్రానిక్స్, రిన్యూవబుల్ ఎనర్జీ, ఆటోమొబైల్ క్లస్టర్గా, కోస్తా సీబీజీ, ఆక్వా, క్వాంటం హబ్గా మలుస్తుందని తెలిపారు. విశాఖ, అమరావతి, తిరుపతి మూడు ఎకనామిక్ జోన్లుగా ప్రాణం పోసుకుని, రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో సమతుల్యంగా అభివద్ధి చేయడమే లక్ష్యం. ప్రభుత్వం చెబుతున్న 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం ఇక్కడ కేంద్రంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
