YSRCP silence on Vijay: తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా సైలెంట్ అయింది. తమిళనాడులో విజయ్ 2 పార్టీలను వెనక్కి నెట్టుకుంటూ.. అత్యధిక స్థానాలను సాధించారు. అది మొదలు ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంది. ఒకటి ఒంటరిగా వెళ్లి విజయ్ ఎక్కువ స్థానాలు సాధించడంతో పవన్ పై వ్యతిరేక ప్రచారం మొదలు పెట్టింది. రెండు విజయ్ తన ఎన్నికల ప్రచారంలో జగన్ ఫోటోను వాడుకున్నారన్నది వైసిపి చూపిస్తున్న అంశం. అది మొదలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా విజయ్ జపం మొదలుపెట్టారు. మంత్రి రోజా లాంటి వారు అయితే టీవీ ఇంటర్వ్యూలో కూడా దీనిపైనే మాట్లాడారు. ఆమె డీఎంకేకు మద్దతుగా ఎన్నికల్లో ప్రచారం చేశారు. విజయ్ గెలిచేసరికి ప్లేటు ఫిరాయించారు. అయితే ఎప్పుడైతే విజయ్ ప్రమాణస్వీకారం చేశారో.. నాటి నుంచి ఫుల్ సైలెన్స్ అయ్యింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. దానికి కారణం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.
డీఎంకేను వీడి విజయ్ తో..
తమిళనాడులో గత కొద్ది రోజులుగా రాజకీయ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. ఏ పార్టీకి కూడా సంపూర్ణ మెజారిటీ రాలేదు. అత్యధిక స్థానాలు దక్కించుకుంది విజయ్ పార్టీ. దాదాపు పది అసెంబ్లీ స్థానాలకు కూత వేటు దూరంలో 108 స్థానాలతో నిలిచిపోయింది. కాంగ్రెస్ పార్టీ డిఎంకెను విడిచిపెట్టి విజయ్ తో చేతులు కలిపింది. వామపక్షాలు సైతం మద్దతు పలికాయి. దీంతో అధికారం చేపట్టేందుకు అవసరమైన సంఖ్యాబలం విజయ్ కు వచ్చింది. అందుకే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఈ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి ప్రత్యేకంగా పిలిచారు విజయ్. రాహుల్ గాంధీని సోదరుడితో పోల్చారు విజయ్. ఇది ఎంత మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రుచించలేదు.
రాహుల్ గాంధీని పిలవడంతో..
ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ఖాతాలో ఈ క్రెడిట్ వేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ మద్దతుతో పూర్తిగా సీన్ మారిపోయింది. కాంగ్రెస్ పార్టీకి విజయ్ ప్రభుత్వంలో ఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది ఇప్పుడు. కాంగ్రెస్ పార్టీ వాసన అంటేనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పడదు. అటువంటిది రాహుల్ గాంధీని ప్రత్యేకంగా ఆహ్వానించడం.. ఆయనను సోదరుడితో విజయ్ పోల్చడం.. వంటివి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను డిఫెన్స్ లో పడేసాయి. అందుకే వారు ఫుల్ సైలెన్స్ లోకి వెళ్లిపోయారు.