Pawan Kalyan : పవన్ పై ‘పాత బస్తీ అల్లర్ల తరహా’ కేసు.. జగన్ సర్కార్ ప్రతీకారం

విజయవాడలోని 228 సచివాలయంలో పనిచేస్తున్న దిగమంటి సురేష్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 405/2023 కింద పోలీసులు కేసు నమోదుచేశారు. 153, 153ఏ, 505(2) తదితర ఐపీసీ సెక్షన్లు ఫైల్ చేశారు. ఇందులో సెక్షన్ 153 అంటే పవన్ మాటలతో రెండు వర్గాల మధ్య వివాదం రేగి శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందంటూ కేసు నమోదైంది.

Written By: Dharma, Updated On : July 13, 2023 9:32 am
Follow us on

Pawan Kalyan : ఏపీలో పాతబస్తి తరహా ఘటనలు జరుగుతాయని పోలీస్ శాఖ ఆందోళన చెందుతోంది. రెండు మతాలు,వర్గాలు, కులాలు మధ్య వివాదాలు జరుగుతాయని.. శాంతి భద్రతలు గాడి తప్పుతాయని భావిస్తోంది. ఇంతకీ ఈ విధ్వేష ఘటనలు ఎలా జరుగుతాయో తెలుసా? జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు మూలంగా జరుగుతాయట. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా పవన్ పై వస్తున్న ఫిర్యాదులపై ఎన్నిరకాల సెక్షన్లు ఉంటాయో.. అన్నింటినీ నమోదుచేస్తున్నారు. కేసులు ఫైల్ చేస్తున్నారు.

ఇటీవల వలంటీరు వ్యవస్థపై పవన్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇన్ని వ్యవస్థలు ఉండగా సమాంతర రాజకీయ వ్యవస్థను ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. వారు సేకరించే డేటా ఎటో వెళుతోందని ఆరోపించారు. తాను అందరు వలంటీర్లను తప్పుపట్టలేదన్నారు. వలంటీరు ఒక వ్యక్తి, నిరుద్యోగ యువతే అన్నారు. కానీ అది వ్యక్తుల సమూహంగా తయారై వ్యవస్థగా మారుతోందన్నారు. ఆ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రజలను అదుపు చేస్తున్నారని ఆరోపించారు. రూ.5 వేలు ఇచ్చి నిరుద్యోగ యువత జీవితాన్ని తన స్వార్థం కోసం ఊడిగం చేయించుకుంటున్నారని జగన్ పై నేరుగా విమర్శనాస్త్రాలు సంధించారు. అయితే వ్యవస్థాగత లోపాలుపై మాట్లాడిన పవన్ పై జగన్ వలంటీర్లను ఉసిగొల్పుతున్నారు. దిష్టిబొమ్మలు దహనం చేయిస్తున్నారు. పోలీస్ కేసులు పెట్టిస్తున్నారు.

విజయవాడలోని 228 సచివాలయంలో పనిచేస్తున్న దిగమంటి సురేష్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 405/2023 కింద పోలీసులు కేసు నమోదుచేశారు. 153, 153ఏ, 505(2) తదితర ఐపీసీ సెక్షన్లు ఫైల్ చేశారు. ఇందులో సెక్షన్ 153 అంటే పవన్ మాటలతో రెండు వర్గాల మధ్య వివాదం రేగి శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందంటూ కేసు నమోదైంది. 153ఏ అంటే రెండు కులాలు, మతాల మధ్య విధ్వేషాలు రేగే ప్రమాదం ఉందని భావించి నమోదుచేశారు. 505(2) తాను చెబుతున్నది రూమర్ అని కావాల్సి చెప్పి వివాదాలకు కారణమవుతున్నారని కేసు ఫైల్ చేశారు. విచిత్రమేమిటంటే పాతబస్తి గొడవల్లో ఈ తరహా సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. ఇప్పుడు వాటిని గుర్తుచేస్తూ పవన్ పై నమోదుచేయడం విశేషం.

రాష్ట్ర వ్యాప్తంగా పవన్ పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వలంటీర్లు, వైసీపీ నేతలు ఫిర్యాదులు చేస్తున్నారు. దీనికి ప్రజాసంఘాల ముసుగు తగిలించడం విశేషం. ప్రజలకు సేవలందిస్తున్న వలంటీర్లపై పవన్ అనుచిత వ్యాఖ్యలు తగవు అంటూ సాక్షితో పాటు నీలి మీడియాలో పతాక శీర్షికన కథనాలు వస్తున్నాయి. అస్మదీయ నేతలు, అనుకూలమైన ప్రజాసంఘాల నేతలు, మేథావుల అభిప్రాయాలను పతాక శీర్షికన ప్రచురిస్తున్నారు. అయితే ఇన్ని కేసులు నమోదవుతున్నా పవన్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.