Homeఆంధ్రప్రదేశ్‌Venkaiah Naidu: ఆ రెండు తప్పులతోనే చంద్రబాబు మూల్యం.. వెంకయ్య నాయుడు సంచలన కామెంట్స్

Venkaiah Naidu: ఆ రెండు తప్పులతోనే చంద్రబాబు మూల్యం.. వెంకయ్య నాయుడు సంచలన కామెంట్స్

Venkaiah Naidu: సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ముప్పవరపు వెంకయ్య నాయుడు. జాతీయస్థాయిలో సీనియర్లలో ఆయన ఒకరు. బిజెపిలో నిబద్ధత కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఎన్నో పదవులు అనుభవించారు. మరెన్నో పదవులు అలంకరించారు. ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. ఇంత చేసినా ఏపీలో బిజెపిని అధికారంలోకి తీసుకు రావడంలో ఫెయిలయ్యారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి అన్ని విధాలా అండదండలు అందించారని ఆయనపై ఒక విమర్శ ఉంది. అందుకే ఏపీలో బిజెపి ఎదగలేదని ఒక అపవాదు ఉంది. తాజాగా టిడిపి అధినేత చంద్రబాబు విషయాల్లో జరిగిన తప్పిదాల గురించి వెంకయ్య ప్రస్తావించారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుత రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయని వెంకయ్య గుర్తు చేస్తున్నారు. చట్టసభల్లో నేతల ప్రవర్తన తీరు చూస్తుంటే బాధ వేస్తోందన్నారు. కొందరి తీరు హుందాగా లేదన్నారు. ప్రముఖ జర్నలిస్టు జాఫర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబుకు ఇచ్చిన సలహాలు గురించి ప్రస్తావించారు. 2018లో ఎన్డీఏ నుంచి టిడిపి బయటకు వచ్చిన సమయంలో తనను చంద్రబాబు ప్రత్యేకంగా కలిసిన విషయాన్ని చెప్పుకొచ్చారు. నాడు ఎన్డీఏలో కొనసాగాలని చంద్రబాబుకు తాను సూచించానని… ఇంకా ఎన్డీఏలో కొనసాగితే నష్టమని.. అసంతృప్తి ఎక్కువగా ఉందని.. దూరంగా వెళ్లడం మంచిదని చంద్రబాబు చెప్పిన విషయాన్ని వెంకయ్య ప్రస్తావించారు.

తన మాట చంద్రబాబు పట్టించుకోలేదని వెంకయ్య వాపోయినంత పనిచేశారు. ఒకవేళ ఎన్డీఏ నుంచి మీరు బయటకు వెళ్లినా రెండు తప్పులు చేయవద్దని తాను సూచించినట్లు చెప్పారు. ఒకటి వ్యక్తిగతంగా నరేంద్ర మోడీని విమర్శించవద్దని.. అప్పటి పరిస్థితులను బట్టి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని కలవొద్దని సలహా ఇచ్చినట్లు వెంకయ్య చెప్పారు. ఆ రెండు సలహాలు పాటించకపోవడం వల్లే చంద్రబాబు మూల్యం చెల్లించుకున్న విషయాన్ని వెంకయ్య నేరుగా ప్రస్తావించడం విశేషం. తనకు ఉపరాష్ట్ర పదవి వస్తుందని అనుకోలేదని.. అసలు కోరుకోలేదని.. ప్రజా ప్రతినిధిగా రాజకీయ జీవితంలో ఉండాలని మాత్రమే ఆకాంక్షించినట్లు తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు. ప్రస్తుతం విధాన నిర్ణయాల్లో చురుకైన పాత్ర పోషించాలని ఉందని.. ఆ తరువాత రాజకీయాలనుంచి శాశ్వతంగా విరమించుకొని స్వచ్ఛంద సేవ చేయాలని అనుకుంటున్నట్లు వెంకయ్య ప్రకటించారు. చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే తనకు రాష్ట్రపతి పదవి రాలేదన్నది సరికాదన్నారు. గతంలోనే తాను, ఎన్టీఆర్ ఒకటేనని ప్రచారం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. తనకు భారతీయ జనతా పార్టీ ముఖ్యమని తేల్చి చెప్పారు. మొత్తానికైతే జర్నలిస్టు జాఫర్ వెంకయ్యతో ముఖ్య విషయాలను చెప్పించడంలో సఫలమయ్యారు. అటు వెంకయ్య సైతం స్వేచ్ఛగా సమాధానం చెప్పారు. ప్రస్తుతం వెంకయ్య కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version