Vangaveeti Mohan And Ambati Rambabu: కాపు సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఎదగాలని భావిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై మీడియాతో పాటు పోలీసుల సమక్షంలోనే తిట్ల దండకం అందుకున్నారు అంబటి రాంబాబు. అటువంటి నేతను పట్టుకుని ఇప్పుడు కాపుల్లో కాక రేపాలని చూస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఎంతలా అంటే వంగవీటి మోహన్ రంగా సరసన అంబటి రాంబాబును చేర్చారు అంటే ఏ స్థాయి రాజకీయం చేస్తున్నారు అర్థం అవుతుంది. ప్రతి ఒక్క వైసీపీ కాపు నాయకుడు ఇప్పుడు అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. చివరకు వంగవీటి కుటుంబానికి చెందిన వంగవీటి నరేంద్ర సైతం.. మోహన్ రంగాతో అంబటి రాంబాబును పోల్చడం మాత్రం అదోలా ఉంది. కాపు రాజకీయం చేయడం ద్వారా మరోసారి అధికారంలోకి రావాలన్నది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్. అందుకు చాలా లెక్కలు వేసుకుంటోంది ఆ పార్టీ.
* నాడు రంగా హత్యతో..
1988లో వంగవీటి మోహన్ రంగా హత్యకు గురయ్యారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండేవారు. కానీ ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. పేద ప్రజల కోసం ఆయన నిరాహార దీక్షకు దిగారు. ఆ సమయంలోనే దుండగులు ఆయనను హత్య చేశారు. అయితే దానిని కుల రాజకీయంగా ముద్రించారు. దీంతో 1989లో తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరం కావాల్సి వచ్చింది ఆ ఘటనతో. టిడిపి పట్ల కాపులు ఆగ్రహం పెంచుకోవడంతో దానికి మూల్యం చెల్లించుకుంది. అయితే తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సైతం తమ సొంత పార్టీ ఎమ్మెల్యే మోహన్ రంగా హత్య విషయంలో ఎటువంటి పురోగతి సాధించలేకపోయింది. నిందితులను పట్టుకోలేకపోయింది.
* కాపు రిజర్వేషన్ ఉద్యమంతో..
2014 ఎన్నికల్లో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వేషన్ల కోసం పోరాటం చేశారు ముద్రగడ పద్మనాభం. ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లే క్రమంలో హింసకు దారితీసింది. ఎంతోమంది అరెస్టయ్యారు కూడా. ఈ ఘటనతో కాపులు ఆగ్రహం చెందారు. దాని పర్యవసానంగా 2019 ఎన్నికల్లో టిడిపి ఓడిపోయింది. కాపులు దూరం కావడంతోనే అలా జరిగింది. అయితే ఎంతో ఆశతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే టిడిపి కల్పించిన రిజర్వేషన్లను సైతం రద్దు చేసింది జగన్ సర్కార్. పైగా కాపుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించింది.
* కూటమి నుంచి విడగొట్టాలని..
మొన్నటి ఎన్నికల్లో కాపులు టిడిపి కూటమి వైపు వచ్చారు. పవన్ కళ్యాణ్ రూపంలో తమ ప్రతినిధి దొరకడంతో ఇటువైపు మొగ్గు చూపారు. గత రెండేళ్లుగా కాపులు కూటమి వైపు కొనసాగుతూ వచ్చారు. అయితే ఇప్పుడు అంబటి ఘటనతో కాపులను తమ వైపు తిప్పుకోవాలని వైసిపి చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ గత అనుభవాల దృష్ట్యా కాపుల మనసు మారడం లేదు. పైగా అంబటి రాంబాబు వ్యవహార శైలి కాపులకు తెలుసు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు కాపులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ గుర్తున్నాయి. ఆయనను ఎంత మాత్రం నమ్మేస్థితి ఉండదు. కానీ వైసీపీ కాపు నేతలకు మాత్రం హై కమాండ్ కీలక ఆదేశాలు ఇచ్చి పంపుతోంది. ఒకవైపు అంబటి కుటుంబ సభ్యులను పరామర్శ, మరోవైపు జైలులో అంబటి రాంబాబును పరామర్శించడం వంటి వాటితో కాపు రాజకీయాన్ని కాక రేపాలని చూస్తోంది. కానీ అది ఆశించిన స్థాయిలో వర్కౌట్ అయ్యేలా లేదు.