YCP: ఈరోజు మీది.. రేపు మాది అంటున్న వైసీపీ

రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు పై దాడులు పెరిగిన నేపథ్యంలో.. ఆ పార్టీ ఒక వీడియోను రూపొందించింది.'ఈరోజు నీది.. రేపు మాది.. మరిచిపోకు ఈ నిజం' అంటూ సాగిన ఈ వీడియోను ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.

Written By: Dharma, Updated On : June 9, 2024 11:36 am

YCP

Follow us on

YCP: టిడిపి కూటమి ఘన విజయం నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మూడు పార్టీల్లో ఒక రకమైన జోష్ కనిపిస్తోంది. గత ఐదు సంవత్సరాలుగా వైసిపి చర్యలతో విసిగి వేసారి పోయిన టిడిపి శ్రేణులు ధైర్యంగా బయటకు వస్తున్నాయి. తమ పట్ల అమానుషంగా వ్యవహరించిన వైసీపీ శ్రేణులపై దాడులకు వెనకాడడం లేదు. ముఖ్యంగా చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని, వల్లభనేని వంశీని తెలుగు యువత టార్గెట్ చేసింది. టిడిపి గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పిన కొడాలి నానిని నిలదీసినంత పని చేశారు. ఆయన ఇంటిపై దాడికి వెళ్లారు. వల్లభనేని వంశీ మోహన్ అయితే ఇంటికే పరిమితం అయ్యారు. ఈ పరిస్థితి ఊహించని వారు ఆందోళనతో గడుపుతున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు పరిస్థితి చేయి దాటుతుందని గ్రహించిన వైసీపీ అధినేత జగన్ గవర్నర్కు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. వైసీపీ నేతలు నేరుగా గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ప్రతీకార రాజకీయాలు, దాడులు పెరుగుతున్నాయని.. తక్షణం కలుగ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.మరోవైపు వైసీపీలో దూకుడు నేతలంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇంకోవైపు వైసిపి హయాంలో నిర్మాణాలను, శిలాఫలకాలను, పేర్లను టిడిపి శ్రేణులు ధ్వంసం చేస్తున్నాయి. దీనిపై కూడా వైసిపి శ్రేణులు ఆందోళనతో ఉన్నాయి. ఇంకా ప్రమాణస్వీకారం చేయకుండానే ఈ రకమైన విధ్వంసానికి దిగుతుండడంపై భయంతో గడుపుతున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు పై దాడులు పెరిగిన నేపథ్యంలో.. ఆ పార్టీ ఒక వీడియోను రూపొందించింది.’ఈరోజు నీది.. రేపు మాది.. మరిచిపోకు ఈ నిజం’ అంటూ సాగిన ఈ వీడియోను ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ పోస్టు వైరల్ అవుతోంది. గత ఐదేళ్లలో మీరు చేసిన విధ్వంసాల మాటేంటి? చేసిన అరాచకాలు మరిచిపోయారా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అసంతృప్త నేతలు, మొన్నటి ఎన్నికల్లో సైలెంట్ అయిన వైసీపీ నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. చాలామంది వైసిపి నేతలు పార్టీని వీడియో అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు దాడులు, మరోవైపు నేతల నిష్క్రమణతో వైసీపీలో ఒక రకమైన ఆందోళన నెలకొంది. పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపడానికి ఈ వీడియో విడుదల చేసినట్లు తెలుస్తోంది.