Tirumala Sanctity Controversy Andhra Pradesh: ఏపీలో( Andhra Pradesh) నెయ్యి కల్తీ అంశం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దీనిపై భారీగా డ్యామేజ్ జరిగింది. అయితే నెయ్యిలో జంతు కొవ్వు కలిపి లడ్డూలు తయారు చేశారని అధికార కూటమి ఆరోపించింది. సిట్ దర్యాప్తు జరిగింది. నెయ్యిలో కల్తీ జరిగింది కానీ జంతు కొవ్వు కలపలేదని ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. మధ్యలో హెరిటేజ్ సంస్థను తీసుకొచ్చింది. హెరిటేజ్ సంస్థ ఇందాపూర్ డైరీ కి నెయ్యి కాంట్రాక్ట్ అప్పగించేందుకే కొత్త ఎత్తుగడగా చెప్పుకొచ్చింది. దీనిపై చర్చ జరపాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలిలో పట్టు పట్టింది. కానీ అధికార కూటమి వ్యూహాత్మకంగా శాసనసభలో దీనిపై చర్చ జరిగింది. సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా దీనిపై మాట్లాడారు.
* క్రైస్తవులతో భర్తీ..
ప్రధానంగా చంద్రబాబు( CM Chandrababu) వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు తిరుమల విషయంలో జరిపిన నిర్లక్ష్యాన్ని, ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పిదాలను గుర్తు చేశారు సభలో. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి నియామకాల్లో క్రైస్తవులకు పెద్దపీట వేశారని విమర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో నడిచే యూనివర్సిటీలు, విద్యాసంస్థలకు అధిపతులుగా క్రైస్తవులకు నియామకం జరిగిందని గుర్తు చేశారు. అప్పట్లో అలా నియమితులైన వారు టీటీడీ నిధులతో నడిచే విద్యాలయాల్లో వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు లేకుండా చేశారన్నది చంద్రబాబు వాదన. రాజశేఖర్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే ఈ తప్పిదానికి పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపణలు చేశారు.
* క్రిస్టియన్లకు పదవులు..
మరోవైపు జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy ) హయాంలో సైతం తిరుమల విషయంలో ఉద్దేశపూర్వకంగానే తప్పిదాలకు పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. హిందూ మతం పట్ల విశ్వాసం లేని వారిని.. స్వామి వారి పట్ల భక్తి భావం లేని వారిని టీటీడీ చైర్మన్గా నియమించారని చెప్పుకొచ్చారు. భూమన కరుణాకర్ రెడ్డి అసలు హిందువు కాదని.. ఆయన కుమార్తె వివాహం మెదక్ లో చర్చిలో జరిగిందని ఫోటో కూడా చూపించారు. వై వి సుబ్బారెడ్డి సైతం క్రిస్టియన్ అని చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డితో వైవి సుబ్బారెడ్డి దంపతులు తీసుకున్న ఫోటోను బయటపెట్టారు. విజయమ్మ జగన్మోహన్ రెడ్డిని ఆత్మీయంగా ముద్దాడుతున్న తరుణంలో.. పక్కనే ఉన్న వైవి సుబ్బారెడ్డి భార్య బైబిల్ తో కనిపించిన ఫోటోను నిన్న సభలో చూపించారు చంద్రబాబు. అయితే వారిద్దరూ తాము హిందువులమేనని పలుసార్లు చెప్పుకొచ్చారు. తాజాగా చంద్రబాబు ప్రకటన తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. తన కుమార్తెను తిరుచునాపల్లిలో హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేశానని.. ఆ పెళ్ళికి నందమూరి బాలకృష్ణ తో పాటు నారా రామ్మూర్తి నాయుడు కూడా వచ్చారని.. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కరుణాకర్ రెడ్డి.
* ఉద్దేశపూర్వక తప్పిదాలు..
అయితే తిరుమల విషయంలో రాజశేఖర్ రెడ్డి తో( Y S Rajasekhara Reddy ) పాటు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి అనుసరించిన తీరును బయటపెట్టారు చంద్రబాబు. ఉద్దేశపూర్వకంగా వారు తిరుమల విషయంలో లోపాలు చేశారని ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. నెయ్యి కల్తీ వ్యవహారంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా మాట్లాడుతోంది. మధ్యలో హెరిటేజ్ ను తెచ్చింది. ఈ క్రమంలోనే చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి కాలం నుంచి ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పిదాలను సభ ముందు పెట్టారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే ఇది ఒక విధంగా హిందువుల్లో ఆలోచన తెచ్చి పెట్టినదే. పవన్ కళ్యాణ్ సైతం హిందూ మతం పై ఈ స్థాయిలో నిర్లక్ష్యం జరుగుతుంటే.. ప్రశ్నించకపోవడాన్ని తప్పుపట్టారు. మొత్తానికి అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు వైయస్సార్ ఫ్యామిలీతో తిరుమల పవిత్రతకు జరుగుతున్న ఇబ్బందులను ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయినట్టే.