Kodali Nani: నోరే కాదు.. కాస్త బుర్ర ప్రయోగించు.. కొడాలి నాని పై తిరుమల భక్తుల ఆగ్రహం

ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలు చేసే కొడాలి నాని కి.. తిరుమల తిరుపతి దేవస్థానంలో నిబంధనలు తెలియవా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

Written By: Neelambaram, Updated On : September 19, 2023 4:15 pm
Follow us on

Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి వివాదాస్పదంగా మారారు. తిరుపతిలో నిబంధనలు ఉల్లంఘించారు. మరోసారి వార్తల్లో నిలిచారు. స్వామి వారిని దర్శించుకునే క్రమంలో టీటీడీ నిబంధనలు పాటించలేదు. ఏకంగా స్వామివారి మహాద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించారు. ఈ ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా టీటీడీలో జరుగుతున్న వ్యవహారాలపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొడాలి నాని సోమవారం స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనతోపాటు అనుచరులు అనుసరించారు. ఏకంగా మహాద్వారం గుండా ఆయన ఆలయంలో ప్రవేశించడం వివాదాస్పదంగా మారింది. సాధారణంగా రాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రులు, ప్రభుత్వాధినేతలు మాత్రమే ఈ ద్వారం గుండా వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. కానీ మాజీ మంత్రి కొడాలి నాని నేరుగా ఇదే ద్వారం గుండా వెళ్లడం పై టీటీడీ విమర్శలకు గురవుతోంది. కొందరు అధికారుల అత్యుత్సాహమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలు చేసే కొడాలి నాని కి.. తిరుమల తిరుపతి దేవస్థానంలో నిబంధనలు తెలియవా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రస్తుతం తిరుపతిలో కొడాలి నాని వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో సైతం వైరల్ గా మారింది. నెటిజెన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థులపై నోరు పారేసుకోవడం కాదు.. కాస్త అయినా తెలివితేటలుగా వ్యవహరించాలని ఎక్కువమంది సూచిస్తున్నారు. భక్తులకు పరమ పవిత్రమైన తిరుమలలో అలా చేయడం ఏమిటని ఎక్కువమంది నిలదీస్తున్నారు. ప్రత్యర్థులపై విరుచుకుపడే గుణమున్న కొడాలి నాని తప్పుచేసి దొరికిపోవడంతో టార్గెట్ అవుతున్నారు. ఈ వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.