
విజయవాడ-హైదరాబాద్ హైవే పై దొంగతనాలు భయపెడుతున్నాయి. లారీలే లక్ష్యంగా చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. ఆగి ఉన్న లారీలను ఎంచుకుని మరీ దోపిడీకి పాల్పడుతున్నారు. దీనిపై పోలీసులు సైతం సవాలుగా తీసుకుని విచారణ ముమ్మరం చేశారు. అర్థరాత్రి వేళ మోటార్ సైకిళ్లపై మెరుపులా వచ్చి రహదారిపై వెళ్తున్న లారీలు, కార్లను హఠాత్తుగా ఆపుతారు. పైసలు ఇవ్వాలని కత్తులతో బెదిరించి అడుగుతారు.
దీంతో వారు చేసేది లేక తమ వద్ద ఉన్న సొమ్మును వారికి అప్పగిస్తున్నారు. రాత్రి వేళ లారీ ఆగిందంటే చాలు అక్కడికి చేరిపోతున్నారు. డబ్బులు ఇస్తే సరి లేకోతే భయాందోళనకు గురి చేస్తున్నారు. సినిమా తరహాలో కంచికర్ల ప్రాంతంలో తరుచూ జరుగుతున్న ఇలాంటి ఘటనలు డ్రైవర్లలో గుబులు రేపుతున్నాయి. లారీలను లక్ష్యంగా చేసుకుని కొందరు బెదిరించి నగదు వసూలు చేస్తున్నారు. గత్యంతరం లేని డ్రైవర్లు నగదు దుండగులకు అప్పగించి తమ గోడును పోలీసులకు వెళ్లబోసుకుంటున్నారు.
రెండు రోజుల కిందట అర్తరాత్రి కంచికచర్ల మండలం నక్కలపేట క్రాస్ రోడ్డు వద్ద విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీని ఐదుగురు వ్యక్తులు మోటార్ సైకిళ్లు అడ్డుపెట్టి ఆపారు. డ్రైవర్ వద్ద ఉన్న సొమ్ము ఇవ్వాలని అడిగారు. అతడు ససేమిరా అనడంతో కత్తులతో బెదిరించారు. అతని వద్ద ఉన్న రూ.6500 తీసుకుని పరారయ్యారు. హైదరాబాద్ కు చెందిన లారీ డ్రైవర్ దోపిడీ గురించి కంచికచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇటీవల హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వస్తున్న లారీని అలసటకు గురైన డ్రైవర్ కీసర సమీపంలో ఆపాడు. రాత్రి కావడంతో నిద్ర పోయాడు. కొద్దిసేపటికి ఇద్దరు వచ్చి డ్రైవర్ ను నిద్ర లేపి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అతడు తన వద్ద ఉన్న రూ.1000 వారికి ఇచ్చాడు. డబ్బు తీసుకున్న విషయం ఎవరికి చెప్పవద్దని బెదిరించారు. డ్రైవర్ స్థానికుడు కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండిపోయాడు.
దొంగతనాలపై సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దుండగులు కత్తులతో బెదిరించి నగదు దోచుకెళ్లడం దొంగల ముఠా పనిగా గుర్తించారు. డ్రైవర్ల వద్ద వివరాలు సేకరించి పాత నేరస్తులపై ఆరా తీస్తున్నారు. నిందితులు కంచికచర్ల ఇందిరానగర్ కాలనీ వాసులుగా గుర్తించినట్లు సమాచారం. ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని తెలుస్తోంది. దీనిపై త్వరలో కీలక ప్రకటన చేస్తారని సమాచారం.