Homeఆంధ్రప్రదేశ్‌AP MLC Elections: ఆయన ఒక్కరే రిచ్.. ఏపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఆస్తుల వివరాలు ఇవే!

AP MLC Elections: ఆయన ఒక్కరే రిచ్.. ఏపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఆస్తుల వివరాలు ఇవే!

AP MLC Elections: ఏపీలో( Andhra Pradesh) ఎమ్మెల్సీ ఎన్నికల సందడి కనిపిస్తోంది. సోమవారం చివరి రోజు కావడంతో అభ్యర్థులంతా నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే కోటా కింద 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 20న ఎన్నికలు జరగనున్నాయి. ముందుగా జనసేన తరఫున మెగా బ్రదర్ నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం ఉదయం టిడిపి అభ్యర్థులు బీదా రవిచంద్ర, బీటీ నాయుడు, కావలి గ్రీష్మ నామినేషన్లు వేశారు. బిజెపి తరఫున సోము వీర్రాజు దాఖలు చేశారు. అఫీడవిట్లలో తమ ఆస్తులను ప్రకటించారు. అప్పులను సైతం వెల్లడించారు. అయితే వీరిలో ఒకరికి మాత్రమే ఎక్కువ ఆస్తులు ఉన్నట్లు తేలింది.

Also Read: ఒక్కొక్కరికీ రూ.50 వేల నుంచి లక్ష.. డ్వాక్రా మహిళలకు రూ.35,000.. ఏపీలో పండగే!

 

* కావలి గ్రీష్మ( grishma ) టిడిపి సీనియర్ నాయకురాలు ప్రతిభాభారతి కుమార్తె. వరుసగా అయిదు సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు ప్రతిభ భారతి. మంత్రి పదవితో పాటు స్పీకర్ పదవిని కూడా చేపట్టారు. ప్రతిభా భారతి వారసత్వంగా ఆమె కుమార్తె రాజకీయాల్లోకి వచ్చారు. గ్రీష్మ ఆమె భర్త శ్రీనివాస్ పేరుతో రూ. 3.54 కోట్ల స్థిర, చరాస్తులు ఉన్నాయని అఫిడవిట్లో ఆమె పేర్కొన్నారు. గ్రీష్మ వద్ద లక్ష యాభై వేలు, ఆమె భర్త శ్రీనివాస్ వద్ద మూడు పాయింట్ 80 లక్షలు ఉన్నట్టు తెలిపారు. మరో 13 లక్షల 50 వేలు విలువచేసే 40 క్యారెట్ల వజ్రాలు, 35 లక్షల ముప్పై వేలు విలువచేసే 440 గ్రాముల బంగారం, 20 లక్షల విలువ చేసే 20 కిలోల వెండి ఉన్నట్లు పేర్కొన్నారు. ఆమె భర్త వద్ద 17.68 లక్షల విలువైన 250 గ్రాముల బంగారం, భర్త పేరుతో వివిధ కంపెనీల్లో 33.28 లక్షలు విలువైన షేర్లు ఉన్నట్లు పొందుపరిచారు. గ్రీష్మ పేరుతో ఐదు లక్షలు విలువైన భూమి, భర్త పేరుతో హైదరాబాదులోని ఓ అపార్ట్మెంట్లో 40 లక్షల విలువైన 13 చదరపు అడుగుల ఫ్లాట్. భర్త పేరుతో 94.54 లక్షల అప్పు కూడా ఉందని చూపారు అఫిడవిట్లో.

* బిపి నాయుడు( BT Naidu ) తన ఆస్తిని రూ. 5.73 కోట్లుగా అఫీడవిట్లో పేర్కొన్నారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం బెండులగిరిలో ఇంటి విలువ 10 లక్షలు, దీంతో కలిపి 3.10 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని తెలిపారు. మూడు బ్యాంకుల్లో 59 లక్షల గృహ రుణాలు ఉన్నాయని అఫీడవిట్లో పేర్కొన్నారు. బ్యాంకుల్లో నగదు 12.28 లక్షలు, ఫిక్స్డ్ డిపాజిట్లు 1.20 కోట్లు, ఇతరులకు ఇచ్చిన అప్పులు 50 లక్షలు, షేర్ల రూపంలో మరో 10 లక్షలు ఉన్నట్లు తెలిపారు. టయోటా ఫార్చునర్ కారు 20 లక్షలు, మరో 13 లక్షల విలువైన 150 గ్రాముల బంగారం, భార్య దగ్గర 26 లక్షల విలువైన 300 గ్రాముల బంగారం ఉన్నట్లు తెలిపారు. మరోవైపు తన వద్ద 1.7 లక్షల విలువ చేసే సెల్ ఫోన్, భార్య వద్ద 45 వేలు విలువచేసే ఫోన్ ఉన్నట్లు పొందుపరిచారు.

* బీద రవిచంద్ర( Ravichandra) కుటుంబ ఆస్తుల కింద రూ. 41.09 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. అప్పులుగా రూ. 10.83 కోట్లుగా చూపారు. రవిచంద్ర పేరిట ఒక్క వాహనం కూడా లేదు. ఆయన భార్య కుమార్తె పేర్లతో రూ. 17.67 లక్షల విలువైన వాహనాలు ఉన్నట్టు చూపారు. ఆయనకు ఒక్క గ్రాము బంగారం లేదు. భార్య పేరిట 37 లక్షలు, కుమార్తెకు ఐదు లక్షల విలువైన ఆభరణాలు ఉన్నాయి. చరాస్తులు రూ.23.46 కోట్లు, స్థిరాస్తులు రూ.17.63 కోట్లు ఉన్నాయని పొందుపరిచారు.

* బిజెపి అభ్యర్థి సోము వీర్రాజు( Veerraju) కుటుంబానికి రూ. 2.83 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. వీర్రాజు పేరుతో రూ. 1.62 కోట్లు, ఆయన భార్య వరలక్ష్మి పేరుతో రూ. 1.21 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. వీర్రాజు వద్ద 30 గ్రాములు, ఆయన భార్య వద్ద అరకిలో బంగారం ఉన్నట్లు చూపారు. 57 లక్షల విలువైన చరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు. యూనియన్ బ్యాంకు లో 50 లక్షల వరకు అప్పులు ఉన్నాయని తెలిపారు. మూడు పోలీస్ కేసులు పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు.

 

Also Read: జయసాయి రెడ్డికి బిగ్ షాక్.. ఆ కేసుల్లో సిఐడి నోటీసులు!

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version