Andhra Jyothi : అనుకూల ప్రభుత్వాలు ఏర్పడినా.. ఆంధ్రజ్యోతికి ఏంటి ఈ కష్టాలు?

ఈ నోటిఫికేషన్ ఇటీవల విడుదల అయింది. దీన్ని మర్చిపోకముందే గురువారం హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాలో డెస్క్ లలో పనిచేయడానికి సబ్ ఎడిటర్లు కావాలని నోటిఫికేషన్ విడుదల చేసింది.. త్వరలో ఇంటర్వ్యూ నిర్వహిస్తామని అందులో పేర్కొంది.. మిగతా పత్రికలతో పోలిస్తే పనిచేసే విషయంలో స్వేచ్ఛాయుత వాతావరణం ఉన్నప్పటికీ.

Written By: Anabothula Bhaskar, Updated On : August 8, 2024 12:39 pm
Follow us on

Andhra Jyothi :  ఒక సంస్థ బలంగా నిలబడాలంటే అందులో ఉన్న ఉద్యోగులు నిబద్దతతో పని చేయాలి. ఆ యాజమాన్యం ఆ ఉద్యోగులను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. మన భారత దేశంలో గొప్పగా వెలుగొందుతున్న ప్రైవేట్ సంస్థలు చేస్తున్న పని అదే. యాజమాన్యంపై ఉద్యోగులకు నమ్మకం, ఉద్యోగులపై యాజమాన్యానికి ప్రేమ ఉన్నాయి కాబట్టే అవి అంతకంతకు వృద్ధి చెందుతున్నాయి. ప్రతి ఏటా లాభాలను నమోదు చేస్తున్నాయి.. కానీ కొన్ని సంస్థలు ఉద్యోగులతో అవసరం ఉన్నంతవరకు పని చేయించుకుంటున్నాయి. ఏదైనా విపత్కర పరిస్థితి వస్తే వారిని బలవంతంగా బయటికి పంపిస్తున్నాయి. అప్పటిదాకా సంస్థనే నమ్ముకున్న ఉద్యోగులు ఒక్కసారిగా ఉద్యోగం కోల్పోయేసరికి రోడ్డున పడ్డారు. వారి మీద ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యులు ఆగమాగం అయ్యారు. కోవిడ్ సమయంలో పై విపత్కర పరిస్థితిని చాలామంది ఉద్యోగులు చవిచూశారు. ముఖ్యంగా మీడియాలో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. అలా ఉద్యోగులను అర్ధాంతరంగా తొలగించి, వారి జీవితాలను సర్వనాశనం చేసిన జాబితాలో ఆంధ్రజ్యోతి ముందు వరుసలో ఉంటుంది.. రాత్రికి రాత్రే ఉద్యోగులను బయటికి పంపించింది. కనీసం నోటిస్ పీరియడ్ ఇయ్యకుండా వారి జీవితాలను సర్వనాశనం చేసింది.. సెంట్రల్ డెస్క్ నుంచి మొదలుపెడితే జిల్లా డెస్క్ ల వరకు అడ్డగోలుగా తొలగింపులు చేపట్టింది.

మళ్లీ పిలిచినప్పటికీ..

ఇలా అర్ధంతరంగా తొలగించడంతో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. కొంతమంది వేరే వ్యాపకాలు చూసుకున్నారు. ఇంకా కొంతమంది అసలు ఈ ఫీల్డ్ కే దూరమయ్యారు. చాలామందిని పంపించిన తర్వాత.. కోవిడ్ అనంతరం పరిస్థితులు చక్కబడిన తర్వాత.. ఆంధ్రజ్యోతి యాజమాన్యం మళ్లీ తొలగించిన ఉద్యోగులకు ఫోన్ చేసింది. ఉద్యోగంలోకి రమ్మని కోరింది. అయితే ఎవరు కూడా వచ్చేందుకు ఆసక్తి ప్రదర్శించలేదు.”మీకు అవసరం ఉన్నప్పుడు రమ్మంటారు. లేనప్పుడు మెడపట్టి బయటికి గెంటేస్తారు. మీ కళ్ళకు మేము ఎలా కనబడుతున్నాం” అంటూ ఆ మాజీ ఉద్యోగులు ముఖం మీదనే చెప్పేశారట. దమ్మున్న పత్రిక, దమ్మున్న ఛానల్ అని బయటకి రాధాకృష్ణ చెబుతుంటాడు గాని.. ఉద్యోగులను కాపాడుకునే విషయంలో, వారి బాగోగులను పట్టించుకునే విషయంలో ఏమాత్రం చూపించడు. ఇదే విషయాన్ని ఆ సంస్థలో పనిచేసిన మాజీ ఉద్యోగులను అడిగితే తెలుస్తుంది. చివరికి ఉద్యోగుల జీతాల నుంచి ప్రతినెల మినహాయించుకునే వెల్ఫేర్ ఫండ్ లో ఒక రూపాయి కూడా ఇంతవరకు ఉద్యోగుల సంక్షేమానికి ఖర్చుపెట్టిన దాఖలాలు లేవు. చివరికి ఇంక్రిమెంట్ విషయంలోనూ అదే ధోరణి. ఇదే విషయాన్ని కొంతమంది ఉద్యోగులు అడిగితే.. రెండు రాష్ట్రాల్లో వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి సాధ్యం కాదని రాధాకృష్ణ చెప్పేశాడట. ఇప్పుడు అనుకూల ప్రభుత్వాలు ఏర్పడినప్పటికీ అత్తెసరు ఇంక్రిమెంట్లు మాత్రమే వేశారట. అయితే ఈ వచ్చిరాని జీతాలతో పని చేయలేక చాలామంది ఆ సంస్థను వదిలి వేసినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో చాలావరకు డెస్క్ లు ఖాళీ అయ్యాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాల నోటిఫికేషన్ విడుదల చేసింది. వాస్తవానికి ప్రస్తుతం ప్రింట్ మీడియా కొడి గట్టే దీపం లాగా ఉంది. మహా అయితే ఐదు సంవత్సరాల నుంచి మనుగడ సాగించలేదని అందులో పని చేస్తున్న వారే అంటున్నారు. అయితే ఆ ఐదు సంవత్సరాలైన బండి నడిపించాలనే ఉద్దేశంతో ఆంధ్ర జ్యోతి యాజమాన్యం జర్నలిజం కాలేజీ నోటిఫికేషన్ వేసినట్టు తెలుస్తోంది.

మళ్లీ నోటిఫికేషన్

ఈ నోటిఫికేషన్ ఇటీవల విడుదల అయింది. దీన్ని మర్చిపోకముందే గురువారం హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాలో డెస్క్ లలో పనిచేయడానికి సబ్ ఎడిటర్లు కావాలని నోటిఫికేషన్ విడుదల చేసింది.. త్వరలో ఇంటర్వ్యూ నిర్వహిస్తామని అందులో పేర్కొంది.. మిగతా పత్రికలతో పోలిస్తే పనిచేసే విషయంలో స్వేచ్ఛాయుత వాతావరణం ఉన్నప్పటికీ.. జీతాల విషయంలో చాలా వ్యత్యాసం ఉంటుంది. అందువల్లే చాలామంది ఉద్యోగులు ఇతర మార్గాలను ఎంచుకునే క్రమంలో డెస్క్ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నట్టు తెలుస్తోంది. అందువల్లే ఆంధ్రజ్యోతి పత్రిక యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేసిందని సమాచారం. అయితే ఇటీవల ఏపీలో జగన్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాకపోవడంతో.. చాలామంది సాక్షి నుంచి వస్తారని ఆంధ్రజ్యోతి పెద్దలు భావించారు. కానీ అలా జరగకపోవడంతో ఇప్పుడు నోటిఫికేషన్ వేశారు. “చాలామంది వెళ్లిపోతున్నారు. పెరిగిన ఖర్చులు తగ్గట్టుగా వేతనాలు లేవు. పైగా రాత్రిపూట పని చేయాల్సి వస్తోంది. డిజైనర్ ఉద్యోగం కూడా సబ్ ఎడిటర్ చేయాల్సి వస్తోంది. దీనివల్ల చాలామంది బయటకు వెళ్ళిపోతున్నారు. బయట డిజిటల్ మీడియా బలంగా ఉంది. ప్రింట్ మీడియా మహా అయితే ఐదు సంవత్సరాలకు మించి ఉండదు. ఇలాంటప్పుడు ఇందులో ఉండలేక చాలామంది వేరే మార్గాలు చూసుకుంటున్నారని” ఆంధ్రజ్యోతిలో పని చేస్తున్న సీనియర్ ఉద్యోగులు అంటున్నారు. సో మొత్తానికి రెండు రాష్ట్రాలలో అనుకూల ప్రభుత్వాలు ఏర్పడినప్పటికీ ఆంధ్రజ్యోతికి ఈ కష్టాలు రావడం పట్ల జర్నలిజం సర్కిళ్లల్లో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.