Homeఆంధ్రప్రదేశ్‌Jagan: వద్దనుకున్న వ్యవస్థే జగన్ కు అండ

Jagan: వద్దనుకున్న వ్యవస్థే జగన్ కు అండ

Jagan: ఒక్కోసారి మనం వద్దనుకున్నవే దిక్కవుతాయి. దేనినైతే వ్యతిరేకిస్తామో అవే అనుకూలంగా మారుతాయి. ఏపీలో జగన్మోహన్ రెడ్డికి అదే పరిస్థితి ఎదురైంది. ఆయన గతంలో వద్దనుకున్న శాసనమండలి వ్యవస్థ.. ఇప్పుడు ఆయనకు అండగా నిలిచింది. కష్టకాలంలో ఆశాదీపంగా కనిపిస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. 175 అసెంబ్లీ స్థానాలకు గాను.. ఆ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. ఇటువంటి కష్ట కాలంలో జగన్ శాసనమండలి పై ఆశలు పెట్టుకున్నారు.

2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. కానీ అంతకంటే ముందే టిడిపి అధికారంలో ఉండడంతో.. ఏకపక్షంగా ఎమ్మెల్సీలను దక్కించుకుంది. వైసీపీ అధికారంలోకి వచ్చినా శాసనమండలిలో మాత్రం ఆ పార్టీకి మెజారిటీ లేకుండా పోయింది. ఈ కారణంగానే రాజధాని వంటి కీలక బిల్లులు పాస్ కాలేదు. దీంతో ఆ బిల్లులన్నీ సెలెక్ట్ కమిటీకి వెళ్లాయి. ఈ నేపథ్యంలో మొత్తం శాసనమండలిని రద్దు చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. కేవలం టిడిపి సభ్యులు అధికంగా ఉండడం, శాసనమండలి వ్యవస్థతో ఆర్థిక భారం పడుతుందన్న నెపంతో పూర్తిగా రద్దు చేయాలని చూశారు. కేంద్ర ఆమోదానికి పంపారు. కానీ కేంద్రం నుంచి సానుకూలత రాలేదు. దీంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. రాను రాను టిడిపి సభ్యులు పదవీ విరమణ చేయడం, ఆ స్థానాలను వైసిపి భర్తీ చేసుకోవడం, గవర్నర్ కోటా తోవైసిపి సభ్యులను పెంచుకోవడం జరిగిపోయింది. ప్రస్తుతం వైసీపీ శాసనమండలిలో సంపూర్ణ మెజారిటీతో ఉంది.

శాసనమండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58. కానీ వైసీపీకి 38 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. టిడిపికి కేవలం ఎనిమిది మంది ఎమ్మెల్సీలు మాత్రమే ఉన్నారు. మరో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతానికి శాసనసభలో ప్రతిపక్ష హోదా దక్కని స్థితిలో వైసిపి ఉంది. ఇటువంటి తరుణంలో జగన్ శాసనమండలి పై ఆశలు పెట్టుకున్నారు. టిడిపి కూటమి ప్రభుత్వ దూకుడును అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్సీలతో సమావేశమైన జగన్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు చేసే తప్పులను శిశుపాలుడు తప్పుల్లా లెక్కిద్దామని అన్నారు. సీట్లు తక్కువ వచ్చిన 40 శాతం మంది ప్రజలు మన వైపు ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని జగన్ కోరారు. శాసనమండలిలో వైసీపీకి ఉన్న మెజారిటీని సద్వినియోగం చేసుకుందామని పిలుపునిచ్చారు. అయితే ఎన్నికలకు ముందు ఓ ఐదుగురు ఎమ్మెల్సీలు టిడిపిలో చేరిపోయారు. ఇంకొందరిపై అనర్హత వేటు వేశారు. ఇప్పుడు ఈ ఉన్న వారిలో ఎంతమంది మిగులుతారో తెలియదు. అయితే మాత్రం ఏ ఎమ్మెల్సీ వ్యవస్థను రద్దు చేస్తానని జగన్ చెప్పారో.. ఇప్పుడు అదే వ్యవస్థ అండగా నిలిచింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version