Chandrababu: కుప్పంలో పెద్దిరెడ్డి పోలీస్ భజనకు గట్టి షాక్ ఇఛ్చిన సీఎం చంద్రబాబు

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటేనే రాయలసీమలో హడల్. నాటి సీఎం జగన్ రాయలసీమను అతనికి రాసిచ్చారన్న రీతిలో పరిస్థితి ఉండేది. కుప్పంలో చంద్రబాబు, హిందూపురంలో నందమూరి బాలకృష్ణను ఓడించేందుకు పెద్దిరెడ్డి పెద్ద ప్రయత్నాలే చేశారు.

Written By: Dharma, Updated On : June 26, 2024 6:13 pm

Chandrababu

Follow us on

Chandrababu: కుప్పంలో చంద్రబాబుకు చుక్కలు చూపించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ ఐదేళ్ల కాలంలో చంద్రబాబును తీవ్రంగా అవమానించారు. కుప్పంలోనే ఓడిస్తామని శపధం చేశారు. చివరకు ఓ మాజీ ముఖ్యమంత్రి హోదాలో సొంత నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆయన సమక్షంలోనే అల్లరి చేశారు. చివరకు రాళ్లు విసిరేందుకు కూడా ప్రయత్నించారు. ఈ అల్లరి మూకల వెనుక పెద్దిరెడ్డి ఉన్నారన్నది బహిరంగ రహస్యం. కుప్పంలోనే నిన్ను ఓడిస్తానని పెద్దిరెడ్డి సవాల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే గత ఐదు సంవత్సరాలుగా కుప్పంలో వ్యవస్థలను వాడుకొని టిడిపిని నిర్వీర్యం చేయాలని పెద్దిరెడ్డి చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే నాడు పెద్దిరెడ్డి ఆదేశాలను తూచా తప్పకుండా పాటించిన పోలీస్ అధికారులు, సిబ్బంది ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటేనే రాయలసీమలో హడల్. నాటి సీఎం జగన్ రాయలసీమను అతనికి రాసిచ్చారన్న రీతిలో పరిస్థితి ఉండేది. కుప్పంలో చంద్రబాబు, హిందూపురంలో నందమూరి బాలకృష్ణను ఓడించేందుకు పెద్దిరెడ్డి పెద్ద ప్రయత్నాలే చేశారు. తన సొంత నియోజకవర్గం పుంగనూరు కంటే.. ఆ రెండు నియోజకవర్గాల పైనే ఎక్కువ దృష్టి పెట్టారు. అయితే చావు తప్పి కన్ను లొట్టబోయిన విధంగా పుంగనూరులో బయటపడ్డారు పెద్దిరెడ్డి. గత ఐదేళ్లుగా చేసిన తప్పిదాలే పెద్దిరెడ్డికి చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. ఆయనపై టిడిపి ప్రభుత్వం ఉక్కు పాదం మోపడం ఖాయం. అందుకే వైసీపీ శ్రేణులు సైతం భయపడుతున్నాయి. అయితే అంతకంటే ముందే పెద్దిరెడ్డి ఆదేశాలను పాటించిన ప్రభుత్వ వ్యవస్థల్లో ఉన్న అధికారులు, ఉద్యోగులు ముచ్చమటలు పడుతున్నారు. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో పెద్దిరెడ్డి ఆదేశాలు పాటించిన పోలీస్ అధికారులకు ఇప్పుడు ఎక్కడా పోస్టింగులు లేకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు.

తాజాగా కుప్పం నియోజకవర్గంలో పోలీస్ అధికారులపై విఆర్ వేటు వేస్తూ అనంతపురం రేంజ్ డిఐజి షేముషి బాజ్ పాయ్ ఆదేశాలు జారీ చేశారు. కుప్పం అర్బన్ సిఐ గా ఎన్వి రమణ, కుప్పం రూరల్ సీఐ ఈశ్వర్ రెడ్డి, రామకుప్పం ఎస్సై శివకుమార్, రాళ్ల బూదుగూరు ఎస్సై సుమన్, కుప్పం అర్బన్ ఎస్ఐ సుబ్బారెడ్డి, గుడుపల్లె ఎస్సై లక్ష్మీకాంత్ ను ఒకేసారి విఆర్ కు పంపిస్తూ డి ఐ జి ఆదేశాలు ఇచ్చారు. వీరంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో పాటు కుప్పం వైసీపీ ఇన్చార్జ్, ఎమ్మెల్సీ భరత్ ఆదేశాలు పాటించేవారని విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు వారంతా మూల్యం చెల్లించుకోవడంతో.. అధికార వర్గాల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.