Telangana TDP Future 2026: తెలంగాణలో( Telangana) తెలుగుదేశం పార్టీని క్లోజ్ చేసినట్టేనా? ఆ పార్టీని పునరుద్ధరించే అవకాశం లేదా? అనే బలమైన చర్చ నడుస్తోంది. నిన్ననే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కీలక నియామకాలు జరిగాయి. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ నియమితులయ్యారు. సీనియర్లతో పాటు జూనియర్లతో కలిపి పార్టీ పొలిట్ బ్యూరోను ప్రకటించారు. ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధులు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, ఉపాధ్యక్షులు, అనుబంధ విభాగాల నియామకాల అన్నింటినీ పూర్తి చేశారు. కానీ తెలంగాణ పార్టీ విభాగం నియామకం జరపలేదు. ఒకరిద్దరు నేతలను పొలిట్ బ్యూరోలో నియమించారు. అయితే తెలంగాణ రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించకపోవడంపై అక్కడి టిడిపి నేతలు తీవ్ర నిరాశకు గురయ్యారు. మరోవైపు తెలంగాణలో పార్టీ అభివృద్ధిపై చంద్రబాబు ఫోకస్ పెట్టకపోవడంపై రకరకాల విశ్లేషణలు ఉన్నాయి.
* అక్కడే బలం ఎక్కువ..
ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం తెలుగుదేశం( Telugu Desam) పార్టీ రాణించింది. వాస్తవానికి కోస్తాంధ్రతో పాటు రాయలసీమ కంటే తెలంగాణలోనే తెలుగుదేశం పార్టీకి బలం ఎక్కువ. అక్కడి నుంచి ఎంతోమంది తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 1983, 1985, 1994, 1999 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలోనే అత్యధిక స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చింది. అటువంటి తెలుగుదేశం 2014 ఎన్నికల నుంచి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటూ వచ్చింది తెలంగాణలో. తెలంగాణ తొలి ఎన్నికల్లో 15 సీట్లతో గౌరవప్రదమైన స్థానాలను తెచ్చుకుంది. కానీ 2018 ఎన్నికలకు వచ్చేసరికి పూర్తిగా సీన్ మారిపోయింది. కనీసం ఉనికి చాటుకునేందుకు కూడా ఇబ్బంది పడింది. చాలామంది పార్టీ నేతలు బయటకు వెళ్లిపోయారు. ఇటువంటి సమయంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా పోటీ చేయలేదు. అంతకుముందు బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ తెలుగుదేశం పార్టీలో చేరడంతో ఆయనకు తెలంగాణ పగ్గాలు అప్పగించారు చంద్రబాబు. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏపీలో చంద్రబాబు అరెస్టయ్యారు. ఆ సమయంలో ఎన్నికలకు వెళ్తే బాగుండదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాసాని జ్ఞానేశ్వర్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అప్పటినుంచి తెలంగాణ టిడిపి అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది.
* ఎన్నెన్నో ఆశలు..
ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో చంద్రబాబు( CM Chandrababu) తెలంగాణ పై ఫోకస్ పెడతారని అంతా భావించారు. మొన్న ఆ మధ్యన తెలంగాణలోని ఎన్టీఆర్ భవన్ కు వెళ్లి అక్కడి నేతలను కలుసుకున్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామని. కానీ అదిగో ఇదిగో అంటూ కాలయాపన జరిగింది. తీరా ఇప్పుడు కమిటీలు ప్రకటించారు కానీ.. తెలంగాణ విషయంలో మాత్రం ఎటువంటి ప్రకటన లేదు. అయితే దీనిపై రకరకాల విశ్లేషణలు ఉన్నాయి. తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటుంది భారతీయ జనతా పార్టీ. తెలుగుదేశం పార్టీని పునరుద్ధరిస్తే అక్కడ ఆ పార్టీకి గండి పడటం ఖాయం. మొన్నటి ఎన్నికల్లో టిడిపి పోటీ చేయకపోవడంతో ఆ పార్టీ క్యాడర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపింది. ఒకవేళ తెలుగుదేశం పార్టీ పోటీ చేసి ఉంటే ఓట్ల చీలిక వచ్చి గులాబీ పార్టీకి లాభం చేకూరేది. అందుకే సైలెంట్ గా ఉంటేనే పార్టీకి వర్కౌట్ అవుతుందని.. లేకుంటే చంద్రబాబుపై తెలంగాణ వ్యతిరేక ముద్ర వేసి లాభం పొందే ప్రయత్నం చేస్తున్నారు అన్నది ఒక విశ్లేషణ. కానీ తెలంగాణ కమిటీని ప్రకటించకపోవడంతో అక్కడ ఉన్న కొద్దిపాటి నేతలు తీవ్ర నిరాశకు గురయ్యారు.
