Home Minister Anitha: తెలుగుదేశం పార్టీ అంటేనే పసుపు సైన్యం. మొండి పట్టుదలతో పాటు అనుకున్నది సాధించే వరకు పోరాటం చేసే తత్వం వారిది. చివరకు రాజకీయ ప్రత్యర్థులపై సైతం అదే స్థాయిలో ఉంటుంది పసుపు సైన్యం. పార్టీ ఓడిపోయిన ప్రతిసారి పసుపు సైన్యం చేసే ప్రయత్నం తోనే మళ్లీ అధికారం సొంతం అవుతూ వస్తోంది. అటువంటి పసుపు సైన్యం ఒక్కోసారి సొంత పార్టీతో పాటు ప్రభుత్వంతోనూ పోరాటం చేస్తుంది. అటువంటి ఘటన శ్రీకాకుళం జిల్లా పలాసలో కనిపించింది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో తమను ఇబ్బంది పెట్టిన ఓ సి ఐ కు విఆర్ కు పంపించే వరకు విశ్రమించలేదు. గత కొద్దిరోజులుగా పోస్టింగ్ లో లేని ఆయన ఏకంగా హోంమంత్రి వంగలపూడి అనిత ఇలాకాలో నియమితులయ్యారు. దీన్ని సహించుకోలేకపోయారు టిడిపి శ్రేణులు. దీంతో హోంశాఖ మంత్రి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. తిరిగి ఆ సీఐను విశాఖ రేంజ్ కు వీఆర్లోకి పంపించారు.
* రాజకీయ వివాదాలు..
శ్రీకాకుళం జిల్లాలో రాజకీయంగా కీలక నియోజకవర్గం పలాస. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో నిత్యం రావణకాష్టంలా ఉండేది. దానికి కారణం అక్కడ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రి అయిన డాక్టర్ సిదిరి అప్పలరాజు. ఆయనకు ప్రత్యర్థిగా టిడిపి నుంచి గౌతు లచ్చన్న మనుమరాలు శిరీష ఉండేవారు. అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దూకుడుగా ఉండేవి. వారికి ధీటుగా టిడిపి నిలిచేది. ఈ క్రమంలో తరచూ వివాదాలు, వివాదాస్పద ఘటనలు జరిగేవి. అప్పట్లో సిఐ గా ఉండే సాకేటి శంకరరావు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తొత్తులా పనిచేసేవారు. టిడిపి శ్రేణులపై సైతం విరుచుకుపడేవారు. చివరకు గౌతు శిరీష తనపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వ్యక్తిగత దాడిని కూడా సిఐ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేశారు. దానిని జీర్ణించుకోలేకపోయారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు. అప్పట్లో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన సీఐ శంకర్రావు పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
* విశాఖ రేంజ్ కు..
2024 ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కూటమి అధికారంలోకి వచ్చింది. పలాస ఎమ్మెల్యేగా టిడిపి అభ్యర్థి గౌతు శిరీష గెలిచారు. తమను ఎంతగానో ఇబ్బంది పెట్టిన సిఐ శంకర్రావును వీఆర్లోకి పంపించారు. గత రెండేళ్లుగా ఆయనకు ఎక్కడా పోస్టింగ్ కూడా లేదు. ఈ పరిస్థితుల్లో రెండు రోజుల కిందట ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు. ఏకంగా హోం మంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేటలో అవకాశం కల్పించారు. ఈ విషయం పలాస టిడిపి శ్రేణులకు తెలిసింది. తమను అంతగా ఇబ్బంది పెట్టిన సిఐ శంకర్రావును మళ్లీ పోస్టింగ్ ఇస్తారా అంటూ గత రెండు రోజులుగా రగిలిపోతున్నారు టిడిపి శ్రేణులు. సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ హై కమాండ్ వరకు ఈ విషయం వెళ్లినట్లు తెలుస్తోంది. పాయకరావుపేటలో పోస్టింగ్ ఇచ్చిన శంకర్రావు ను తిరిగి విశాఖ రేంజ్ కు వీఆర్లోకి పంపిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు. పలాస టిడిపి శ్రేణుల ఉడుం పట్టు ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.
