TDP seniors angry on BJP: ఏపీలో కూటమి ప్రభుత్వానికి సారథ్యం వహిస్తోంది తెలుగుదేశం. కేంద్ర ప్రభుత్వంలో సైతం కీలక భాగస్వామి. అందుకే రాష్ట్ర ప్రయోజనాల తో పాటు రాజకీయ ప్రయోజనాల విషయంలో రాష్ట్రానికి పెద్ద పీట వేస్తోంది కేంద్రం. అయితే అదే స్థాయిలో ఏపీ నుంచి బిజెపి ప్రాతినిధ్యం కోరడం తెలుగుదేశం పార్టీకి లోటు. తాజాగా రాజ్యసభ పదవులకు సంబంధించిన ఎంపిక విషయంలో బిజెపి పట్టుబడుతుండడంతో టిడిపి సీనియర్లు మదన పడుతున్నారు. మరోసారి ఏపీ నుంచి రాజ్యసభ పదవి కోరుతోంది బిజెపి. కానీ ఆ పదవులపై ఆశలు పెట్టుకున్న తెలుగుదేశం సీనియర్లు పెదవి విరుస్తున్నారు. ఎన్ని రోజులపాటు పార్టీ కోసం కష్టపడితే.. తమకు ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతుందని.. తమకు వచ్చే అవకాశాలను బిజెపి తన్నుకుపోతోందని ఆవేదనతో ఉన్నారు.
పదవుల కోసం ఎదురుచూపు..
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. టిడిపి సీనియర్లు చాలామంది పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో సీట్లు త్యాగం చేసిన వారు ఉన్నారు. టిడిపి ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వారు ఉన్నారు. అయితే ఈ రెండేళ్ల కాలంలో రెండుసార్లు రాజ్యసభ, అదే స్థాయిలో ఎమ్మెల్సీ పదవుల భర్తీ జరిగింది. ఆ సమయంలో బిజెపి ఎంట్రీ ఇస్తోంది. పదవులను తీసుకుంటోంది. రెండుసార్లు రాజ్యసభ పదవి అలానే తీసుకుంది. ఎమ్మెల్సీ పదవులను సైతం కూటమి ఖాతాలో పొందింది. ఇప్పుడు మరోసారి రాజ్యసభ పదవి కోరుతుండడంపై టిడిపి సీనియర్లలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
కేంద్ర పెద్దలతో సఖ్యత..
ఒకసారి బిజెపితో చెడి చాలా రకాలు ఇబ్బందులు పడ్డారు చంద్రబాబు. అందుకే కేంద్ర పెద్దలతో సఖ్యత గా గడుపుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రం నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. ఆ పదవులన్నీ టిడిపి కూటమికి దక్కనున్నాయి. అయితే ఇప్పుడు ఆ నాలుగింటిలో ఒక పదవిని కోరుతోంది బిజెపి. జనసేనకు ఒకటి సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ పార్టీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. అందుకే కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే బిజెపితో పాటు జనసేనకు రెండు పోతే టిడిపికి మిగిలేది కేవలం రెండు మాత్రమే. ఆ రెండింటిలో పదవీ విరమణ చేస్తున్న సానా సతీష్ కు కొనసాగింపు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మిగిలింది ఒకటే. దానికోసం చాలామంది ఆశావహులు ఎదురుచూస్తున్నారు. బిజెపి పోటీలో లేకపోతే.. టిడిపి కి మూడు, జనసేనకు ఒకటి తేలిపోయేది. అలా కాకుండా బిజెపి సైతం ఒక పదవి కోరుతుండడం పై టీడీపీ సీనియర్లు ఆగ్రహంగా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా సర్దుబాటు చేసుకోవాల్సిందని చంద్రబాబు భావిస్తున్నారు. కానీ ఇన్ని రోజులు పార్టీ కోసం పనిచేసిన తమ పరిస్థితి ఏంటి అని టిడిపి సీనియర్లు మదనపడుతున్నారు.