TDP Politburo Changes 2026: తెలుగుదేశం( Telugu Desam) పార్టీలో అత్యంత విధానపరమైన నిర్ణయాలు తీసుకునేది పొలిట్ బ్యూరో. అటువంటి కమిటీలో సీనియర్లకు అగ్రతాంబూలం ఉండేది. కానీ తెలుగుదేశం పార్టీకి మరో నాలుగు దశాబ్దాల పాటు ముందుకు తీసుకెళ్లాలంటే యువ రక్తం అవసరం. అందుకే ఈసారి యువతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఒకరిద్దరు సీనియర్లు తప్ప ఈసారి కొత్తవారు ఆ కమిటీలో కనిపించారు. అయితే సీనియర్ నేతల పిల్లలకు ఈసారి అవకాశాలు కల్పించారు తెలుగుదేశం పార్టీ కమిటీలు. కానీ పొలిట్ బ్యూరోలో మాత్రం సీనియర్లు లేకుండా పోయారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, యనమల రామకృష్ణుడు, జ్యోతుల నెహ్రూ, వర్ల రామయ్య, పితాని సత్యనారాయణ లాంటి కొద్ది మంది నేతలను మాత్రమే కొనసాగించారు.
* ఆ సీనియర్లకు నిత్యం చాన్స్..
చంద్రబాబు చేతికి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత పొలిట్ బ్యూరో సభ్యులు అంటే అశోక్ గజపతిరాజు, దేవేందర్ గౌడ్, కెఈ కృష్ణమూర్తి, చింతకాయల అయ్యన్నపాత్రుడు, ప్రతిభా భారతి, లాల్ జాన్ బాషా వంటి వారి పేర్లు ఎక్కువగా ఉండేవి. ఎక్కువగా ఉత్తరాంధ్ర నుంచి ప్రాతినిధ్యం ఉండేది.. కానీ ఈసారి సీనియర్లను దాదాపు పక్కన పెట్టారు. పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న కొద్దిమంది మాత్రమే కొనసాగుతూ వచ్చారు. ముఖ్యంగా ఈసారి సీనియర్లకు బదులు నడివయస్కులను తీసుకున్నారు. ఎక్కువగా 50 ఏళ్ల వయసు లోపు ఉన్న వారిని ఈ పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. అయితే ఈసారి ఉత్తరాంధ్ర నుంచి బాగా ప్రాతినిధ్యం తగ్గిపోయింది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి.
* ఈసారి ఆ ఇద్దరికి మాత్రమే..
గతంలో ఉత్తరాంధ్ర నుంచి పొలిట్ బ్యూరోలోకి విజయనగరం నుంచి పూసపాటి అశోక్ గజపతిరాజు, విశాఖ జిల్లా నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడు తప్పనిసరిగా ఉండేవారు. అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్గా నియమితులయ్యారు. అయ్యన్నపాత్రుడు స్పీకర్ గా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు. అందుకే ఈసారి తీసుకోలేదు. విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఇంతవరకు పొలిట్ బ్యూరోలోకి తీసుకోలేదు. ఈసారి కూడా ఆయనకు ఛాన్స్ దక్కలేదు. మాజీ మంత్రులు దాడి వీరభద్రరావు, బండారు సత్యనారాయణ మూర్తులు ఉన్న.. వారికి సైతం ఛాన్స్ లభించలేదు. దశాబ్దాలుగా పొలిట్ బ్యూరోలో కొనసాగుతూ వస్తున్న కళా వెంకట్రావును తప్పించారు. ప్రతిభా భారతిని పక్కన పెట్టారు. అయితే సీనియర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కళా వెంకట్రావుకు చాన్స్ ఇస్తూనే ఆయన కుమారుడు రామ్ మల్లిక్ నాయుడును రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకున్నారు. అయితే ఉత్తరాంధ్ర నుంచి మాత్రం కింజరాపు అచ్చెనాయుడు, గుమ్మిడి సంధ్యారాణిని కొనసాగిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం విశేషం.