TDP MLC Seats: తెలుగుదేశం పార్టీలో యువరక్తం ఎక్కించారు. పార్టీలోని అన్ని విభాగాల్లో యువతకు ప్రాధాన్యం ఇచ్చారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ నియమితులయ్యారు . పొలిట్ బ్యూరోలో కొత్తవారిని నియమించారు. ముఖ్యంగా పార్టీలో యువ, మహిళా నాయకత్వం పెరుగుతూ వస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న వారు, 60 సంవత్సరాలు పైబడిన వారు తమ వారసులకు అవకాశం ఇస్తున్నారు. అయితే సీనియర్ల సేవలను సైతం తెలుగుదేశం పార్టీ వినియోగించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా సీనియర్లను శాసనమండలికి పంపించడం అనేది ఒక సంప్రదాయంగా టిడిపి మార్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే అనుభవజ్ఞుల సలహాలు రాజకీయంగాను, రాష్ట్ర ప్రయోజనాలపరంగా కీలకం. అందుకే ఇక్కడ నుంచి ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ సీట్లలో సీనియర్లతోనే భర్తీ చేసేందుకు దాదాపు టిడిపి నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
* ఆమోదించని రాజీనామాలు..
సాధారణంగా శాసనమండలిలో 58 మంది సభ్యులు ఉంటారు. ప్రస్తుతం కూటమి బలం అక్కడ పదిమంది వరకు ఉంది. వైసిపి అధికారానికి దూరమయ్యే సమయంలో అక్కడ వైసిపి బలం దాదాపు 40 గా ఉండేది. క్రమేపి ఎమ్మెల్సీల రాజీనామాతో అది తగ్గుముఖం పడుతూ వస్తోంది. అయితే దాదాపు ఓ ఏడుగురు ఎమ్మెల్సీల రాజీనామాను ఆమోదించలేదు మండలి చైర్మన్. చివరకు కోర్టు ఆదేశాలు జారీ చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే వారి రాజీనామాతో ఖాళీలు ఏర్పడితే కూటమి నేతలు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే మండలిలో వైసీపీ బలం తగ్గి కూటమి బలం పెరుగుతుంది. అందుకే రాజీనామాలను ఆమోదించడం లేదు. ఈ రాజీనామాలను ఆమోదించిన మరుక్షణం పార్టీలో సీనియర్లకు ఎమ్మెల్సీలుగా ఛాన్స్ ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
* భారీగా ఖాళీలు..
2027- 28లో 25 మందికి పైగా వైసీపీ సభ్యులు పదవీ విరమణ చేసే అవకాశం ఉంది. శాసనమండలి చైర్మన్ మోసేన్ రాజు ఆ జాబితాలో ఉన్నారు.వారి స్థానంలో కొత్త వారి ఎంపిక అనివార్యం. అందుకే ఎమ్మెల్సీ పదవులు ఈసారి సీనియర్ల కి ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య పెంపు ఖాయం. ఎమ్మెల్యేలుగా జూనియర్ నేతలకు, వారసులకు ఛాన్స్ ఇచ్చి.. ఎమ్మెల్సీలుగా సీనియర్లకు అవకాశం కల్పించాలన్నది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది.
