Anna canteen opening : రిబ్బన్ కటింగ్ కోసం కొట్టుకున్న టీడీపీ నాయకులు

టిడిపి నేతల మధ్య విభేదాలు నివురు గప్పిన నిప్పులా మారాయి. గత కొంతకాలంగా ఇద్దరు నేతల మధ్య ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఇందుకు అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం వేదిక కావడం విశేషం.

Written By: Dharma, Updated On : September 20, 2024 1:06 pm

Anna canteen opening

Follow us on

Anna canteen opening: పేదలకు పట్టెడు అన్నం కోసం కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ క్యాంటీన్లను పునరుద్ధరించింది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం.. రూ. 15 కే అందిస్తూ వచ్చింది. తొలివిడతగా రాష్ట్రవ్యాప్తంగా 100 క్యాంటీన్లను ప్రారంభించగా.. నిన్న మళ్ళీ విడతగా మరో 75 క్యాంటీన్లు తెరుచుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమంలో ఈ క్యాంటీన్ల ప్రారంభోత్సవం చేశారు. అయితే ఇలా మంచి ఉద్దేశంతో ఏర్పాటుచేసిన ఈ క్యాంటీన్ల ప్రారంభోత్సవం రాజంపేటలో తెలుగు తమ్ముళ్ల మధ్య పోరాటానికి వేదికైంది.ఇద్దరు టిడిపి నేతలు క్యాంటీన్ ప్రారంభించేందుకు కత్తెర కోసం కొట్టుకున్నంత పని చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే సర్క్యూలేట్ అవుతోంది.

* బలవంతంగా కత్తెర తీసుకుని
అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి టిడిపి సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం తన వర్గీయులతో వచ్చారు. తరువాత అక్కడకు టిడిపి జిల్లా అధ్యక్షుడు చామర్తి జగన్మోహన్ రాజు వచ్చారు. ఆయన రావడంతోనే వివాదం మొదలైంది. చివరకు పోటా పోటీగా రిబ్బన్ కటింగ్ కు దిగారు. ముందుగా అన్న క్యాంటీన్ ప్రారంభించడానికి జగన్మోహన్ ప్రయత్నించారు. అయితే తాను రిబ్బన్ కట్ చేస్తానంటూ ముందుకు వచ్చారు సుగవాసి సుబ్రహ్మణ్యం. ఈ వాదన జరుగుతున్న సమయంలో జగన్మోహన్ రాజు చేతిలో ఉన్న కత్తెరను బాలసుబ్రమణ్యం లాక్కున్నారు. క్షణాల్లోనే రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరికొకరు పోసుకుంటూ నినాదాలు చేసుకున్నారు.

* సోషల్ మీడియాలో వైరల్
ఏకంగా అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో ఇద్దరు నేతలు కొట్లాటకు దిగడం హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైసీపీ శ్రేణులు తెగ ట్రోల్ చేస్తున్నాయి.ఇద్దరు అనుచరుల మధ్య తోపులాట జరిగింది. గట్టిగా కేకలు వేస్తూ కొట్టుకోవడంతో అన్న క్యాంటీన్ ప్రాంగణం రచ్చరచ్చగా మారింది. అధికార పార్టీ వారు కావడంతో పోలీసులు ప్రేక్షక పాత్రకు పరిమితం కావాల్సి వచ్చింది.

* ఏకంగా ఇంటి పై దాడి
అయితే ఈ వివాదం ఇంతటితో ఆగలేదు. రాయచోటిలో జగన్మోహన్ రాజు ఇంటిపై టిడిపి అనుబంధ విద్యార్థి సంఘం నాయకుడు ఒకడు రాయి విసిరారు. ఈ ఇద్దరు నేతల మధ్య వివాదం సామాజిక వర్గాల మధ్య పోరాటానికి ఆజ్యం పోసింది. రాజు, బలిజ సామాజిక వర్గాల మధ్య గొడవకు కారణం అవుతోంది. ఈ వ్యవహారంపై టీడీపీ హై కమాండ్ ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.