Raghurama Krishnam Raju: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజును ఇద్దరు వ్యక్తులు టార్గెట్ చేసుకుంటున్నారు. ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్, న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ ఉన్నారు. ఇటీవల ఓ ఆలయ నిర్మాణం విషయంలో జడ శ్రావణ్ వర్సెస్ రఘురామకృష్ణంరాజు అన్నట్టు ఉంది. మరోవైపు పాత కేసుల విషయంలో రఘురామకృష్ణం రాజుతో తలపడుతున్నారు పీవీ సునీల్ కుమార్. దళిత కార్డును ప్రయోగిస్తూ పక్కా పొలిటికల్ స్కెచ్ వేశారన్నది బహిరంగ రహస్యం. అదే సమయంలో లేనిపోని వివాదాలతో రఘురామకృష్ణం రాజు కూటమికి ఇబ్బందులు తెచ్చి పెడుతున్నారు అని సొంత పార్టీ వారే వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇప్పటికే జడ శ్రావణ్ కుమార్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే పనిచేస్తున్నారు. కానీ పీవీ సునీల్ కుమార్ మాత్రం ఈనెలాఖరులో ఐపీఎస్ గా రిటైర్డ్ కానున్నారు. ఆయన మాత్రం రాజకీయ ప్రకటనలు చేస్తూ.. రఘురామకృష్ణం రాజు ఇష్యూతో పొలిటికల్ గేమ్ ఆడుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
* కూటమికి వ్యతిరేక పిలుపు..
ఏపీలో కాపులు, దళితులు, బీసీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు సునీల్ కుమార్. అప్పుడే రాజ్యాధికారం వీలు అవుతుందని అభిప్రాయపడ్డారు. కూటమి వైపు కాపులు ఉండడంతో వారిని టర్న్ చేసే విధంగా పివి సునీల్ కుమార్ కామెంట్స్ ఉన్నాయి. అయితే వైసిపి హయాంలో సిఐడి చీఫ్ గా ఉండేవారు. ఆ సమయంలోనే రఘురామకృష్ణం రాజును కస్టోడియల్ టార్చర్ పెట్టారు అనేది ప్రధాన ఆరోపణ. ఇప్పుడు అదే కేసుతో ఎటువంటి పోస్టింగ్ లేకుండా ఉన్నారు సునీల్ కుమార్. ఈ నెల చివర్లో ఆయన పదవీ విరమణ చేస్తారు. ప్రస్తుతం ఆయన సర్వీసులో ఉన్నారు కానీ రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా భీమవరం వేదికగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజుకు సవాల్ చేశారు. ఆయన రాజీనామా చేస్తే జరిగే ఉప ఎన్నికల్లో రఘురామకృష్ణం రాజు పై తాను పోటీ చేస్తానని… వెయ్యి ఓట్ల మెజారిటీతో గెలుస్తానని సవాల్ చేశారు. అయితే రఘురామకృష్ణంరాజు రాజీనామా చేసేది లేదు. ఉప ఎన్నికలు వచ్చేది లేదు. ఐపీఎస్ సునీల్ కుమార్ పోటీ చేసేది లేదు.
* వరుసగా రాజకీయ ప్రకటనలు..
వాస్తవానికి ప్రస్తుతం సర్వీస్ లో ఉన్నారు పివి సునీల్ కుమార్. కానీ రాజకీయ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. అయితే వైసిపి హయాంలో అనుకూల అధికారిగా పేరు ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు టార్గెట్ చేసుకున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన వైసీపీలో చేరడం ఖాయమని ప్రచారం నడుస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డి పివి సునీల్ కుమార్ ను చేర్పించుకుంటారా? అన్నది వేచి చూడాలి.
