Jagan: జగన్ లో ఎంత మార్పు!

గత ఐదు సంవత్సరాలు ఒక ఎత్తు.. ఇప్పుడు ఒక ఎత్తు. అప్పట్లో వైసీపీ బలం 151 స్థానాలు. ఇప్పుడు కేవలం 11 స్థానాలు మాత్రమే. ప్రతిపక్ష హోదా కూడా లేదు. అందుకే జగన్ లో మార్పు వచ్చింది.

Written By: Dharma, Updated On : July 6, 2024 1:15 pm

Jagan

Follow us on

Jagan: వైసీపీ అధినేత జగన్ లో విచిత్ర మార్పులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు సైతం ఆయన అపాయింట్మెంట్ లభించేది కాదు. చివరకు అత్యంత సన్నిహితుడైన బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటివారు సైతం జగన్ ను కలవాలంటే పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. ప్రకాశం జిల్లాలో తనకు ఎదురైన అవమానాలను చెప్పుకునేందుకు బాలినేని వచ్చినా సీఎంవో ధనుంజయ రెడ్డి అడ్డుకునేవారు. సజ్జల రామకృష్ణారెడ్డికి తన వెర్షన్ చెప్పుకునేవారు. ఇక వైసీపీ ఎమ్మెల్యేలు కలవాలంటే గగనమే. కానీ ఓటమితో ఇప్పుడు సీన్ మారింది. ఎవరు జగన్ ను కలవాలన్న నేరుగా తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకోవచ్చు. ఇట్టే కలవవచ్చు.

అయితే జగన్ లో ఈ తరహా మార్పు చూస్తున్న వైసీపీ శ్రేణులు ఆశ్చర్యపోతున్నారు. అదేదో గత ఐదేళ్ల కాలంలో ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని చెప్పుకొస్తున్నారు. కనీసం వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను కలిసేందుకు ఇష్టపడలేదు. కనీసం మంత్రులకు కూడా జగన్ తన సమయాన్ని కేటాయించలేదు. ఏదైనా చెప్పాలనుకున్నా.. చేయాలనుకున్నా.. ఆ నలుగురితోనే. ప్యాలెస్ లో జగన్ దర్శనం చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం.. ప్యాలెస్ గేటు ముందు ఆయన అనుమతి వచ్చేవరకు చేతులు కట్టుకొని ఉండాల్సిందే. తమ నియోజకవర్గం సమస్యలు చెప్పుకోవడానికి, తమ మంత్రిత్వ శాఖల మీద అనుసరించాల్సిన వ్యూహాలను తెలుసుకోవడానికి అయినా తాడేపల్లి ప్యాలెస్ తలుపు తడితే తీసే వారే లేకుండా పోయారు. అయితే ఈ ఓటమికి జగన్ నిర్లక్ష్యం చేయడమే కారణమని పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న మాట.

అయితే గత ఐదు సంవత్సరాలు ఒక ఎత్తు.. ఇప్పుడు ఒక ఎత్తు. అప్పట్లో వైసీపీ బలం 151 స్థానాలు. ఇప్పుడు కేవలం 11 స్థానాలు మాత్రమే. ప్రతిపక్ష హోదా కూడా లేదు. అందుకే జగన్ లో మార్పు వచ్చింది. జగన్ వ్యవహార శైలిలో స్పష్టమైన మార్పు కనిపించింది. అందుకే ఇప్పుడు పార్టీ నేతలు గుర్తుకొచ్చారు. అందుకే ముద్రగడ పద్మనాభ రెడ్డి, కాసు మహేష్ రెడ్డి సీనియర్ నాయకులను తన వద్దకు రప్పించుకుంటున్నారు జగన్. పార్టీ పరిస్థితి ఏంటి? ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? మీ సలహాలు ఏంటి? మీ సూచనలు ఏంటి? అని అధినేత అడిగేసరికి వైసీపీ నేతలు ఆశ్చర్యపోతున్నారు. క్షవరం అయితే గానీ వివరం రాలేదా? అంటూ సెటైర్లు వేస్తున్నారు.