Srisailam Prasadam Controversy: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం ఏపీ రాజకీయాలను( AP politics) షేక్ చేస్తోంది. దీనిపై అధికార, విపక్ష గట్టి యుద్ధమే నడుస్తోంది. లడ్డూకు ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని అధికార కూటమి.. జంతు కొవ్వు కలవలేదని సిబిఐ క్లీన్ చీట్ ఇచ్చినట్లు వైసీపీ చెబుతోంది. ఈ నేపథ్యంలో పొలిటికల్ వార్ నెలకొంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఏపీ సీఎం చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. కర్నూలు జిల్లాలో శుక్రవారం పర్యటించిన సీఎం చంద్రబాబు.. తిరుమల లడ్డూ వివాదాన్ని మరోసారి ప్రస్తావించారు. ఈ క్రమంలో శ్రీశైలం దేవస్థానం విషయంలో కూడా సంచలన ప్రకటన చేశారు. గతంలో కూడా టీటీడీ లడ్డూ తయారీకి సంబంధించి నెయ్యిలో జంతు కొవ్వు కలిపారని సీఎం చంద్రబాబు ప్రకటించిన తర్వాత ప్రకంపనలు రేగాయి. ఇప్పుడు కూడా అదే సీఎం చంద్రబాబు శ్రీశైలం విషయంలో సంచలన ప్రకటన చేయడం విశేషం.
టీటీడీ లడ్డూ వివాదం కొనసాగుతుండగా..
గత కొద్ది నెలలుగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం( special investigation team).. విచారణ పూర్తి చేసింది. కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. మరోవైపు దీనిపై సిబిఐ క్లీన్ చీట్ ఇచ్చిందని వైసీపీ చెబుతోంది. జంతు కొవ్వు కలిసిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే ఇప్పుడు సీఎం చంద్రబాబు శ్రీశైలం ప్రసాదం తయారీలో కూడా కల్తీ నెయ్యి వాడారు అన్నది ఒక ఆరోపణ చేశారు. శ్రీశైలం ప్రసాదం తయారీకి సంబంధించి నెయ్యిలో బాత్రూములు శుభ్రం చేసే రసాయనాలతో కల్తీ జరిగిందన్నది చంద్రబాబు ఆరోపణ. ఈ క్రమంలో క్షణాల్లో చంద్రబాబు కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఒక్క తిరుపతిలోనే కాదు.. వైసిపి హయాంలో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకు కల్తీ నెయ్యి సరఫరా చేసారంటూ సంచలన ఆరోపణలు చేశారు చంద్రబాబు. తాను సీఎం అయ్యాక ప్రిన్సిపల్ సెక్రటరీని నియమించామని.. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ను మార్చిన విషయాన్ని గుర్తు చేశారు. తిరుమల లడ్డూ కు సంబంధించి నాణ్యత.. అప్పటికి ఇప్పటికీ మారిన విషయాన్ని ప్రస్తావన చేశారు చంద్రబాబు.
మూడు పార్టీలు ఏకతాటిపైకి..
అయితే కూటమి( allians ) పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. వైసిపి హయాంలో హిందూ మతానికి వ్యతిరేకంగా చాలా రకాలుగా కుట్రలు జరిగాయని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. నిన్ననే మూడు పార్టీల నేతలు సమావేశం అయ్యారు. జగన్మోహన్ రెడ్డి సర్కారు సమయంలో హిందువులకు వ్యతిరేకంగా చాలా రకాల కుట్రలు జరిగాయని.. వాటిని ప్రజల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు. అంతలోనే ఈరోజు సీఎం చంద్రబాబు శ్రీశైలం ప్రసాదం తయారీకి సంబంధించి నెయ్యిలో కూడా కల్తీ జరిగిందని ఆరోపించడం ప్రకంపనలు సృష్టిస్తోంది. మున్ముందు మరింత రాజకీయ దుమారం రేగే అవకాశం ఉంది.
