Homeఆంధ్రప్రదేశ్‌Srilakshmi IAS: శ్రీలక్ష్మీ లక్కీ.. ఇలాంటి ఛాన్స్ ఏ ఐఏఎస్ కు రాదంతే..

Srilakshmi IAS: శ్రీలక్ష్మీ లక్కీ.. ఇలాంటి ఛాన్స్ ఏ ఐఏఎస్ కు రాదంతే..

Srilakshmi IAS: భారతదేశంలో బ్యూరోక్రసీ వ్యవస్థకు చాలా గౌరవం ఉంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు లేకుంటే అస్సలు పాలన నడవదు. అటువంటి అధికార గణం ఇప్పుడు రాజకీయ చట్రంలో ఇరుక్కుపోతోంది. వారి అడుగులకు మడుగులు ఒత్తి తమ కెరీర్ కి మాయని మచ్చ తెచ్చుకుంటున్నారు చాలామంది. అటువంటి వారిలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీ లక్ష్మీ ఒకరు. ఈనెల 30న ఆమె పదవి విరమణ చేయనున్నారు. ఈ రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో పదవీ విరమణ చేయాల్సిన శ్రీలక్ష్మి.. ఒక సాధారణ అధికారిణి గానే పదవీ విరమణ చేస్తుండడం నిజంగా దురదృష్టకరం. ఆమె స్వయంకృతాపం కూడా. అది కూడా పదవీ విరమణకు నాలుగు రోజుల ముందు ఆమెపై ఉన్న సస్పెన్షన్ తొలగించడం ఉపశమనం కలిగించే విషయం.

Also Read: జగన్ రాజకీయంలో ‘ముద్రగడ’ కుటుంబం!

* అప్పట్లో ఏబీ వెంకటేశ్వరరావు..
శ్రీ లక్ష్మీ మాదిరిగానే ఈ రాష్ట్రానికి డిజిపిగా వ్యవహరించాల్సిన ఐపీఎస్ అధికారి ఏబీవీ వెంకటేశ్వరరావు సాధారణ పోస్టులోనే పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. అయితే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఆయనను వెంటాడింది. వేటాడినంత పని చేసింది. కానీ తాను ఏ తప్పు చేయలేదని భావించిన వెంకటేశ్వరరావు రిటైర్మెంట్ రోజు పోస్టింగ్ తెచ్చుకొని అదే రోజు రిటైర్ అయ్యారు. ఐదేళ్లపాటు న్యాయపోరాటం చేశారు. కానీ జగన్ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఐపీఎస్ అధికారులు మాత్రం ఆ పని చేయలేకపోతున్నారు. సస్పెన్షన్ లోనే రిటైర్ కాబోతున్నారు. అంతలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ఇప్పటికీ వారు వైసీపీ వీర విధేయత చాటుకుంటున్నారు.

* మానవతా దృక్పథంతో..
ఏపీలో సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నారు శ్రీలక్ష్మి. ఓబులాపురం మైనింగ్ కేసులో ఆమె నిందితురాలు. జైలుకు కూడా వెళ్లి వచ్చారు. అయితే ఇదంతా ఎవరికోసమో అనేది అందరికీ తెలుసు. పైగా 2019 నుంచి 2024 మధ్య ఏపీకి అధికారిగా వచ్చిన ఆమె నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే 2024 జూన్ పది నుంచి ఎలాంటి పోస్టింగ్ లేకుండా జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో గడిపారు. కానీ ఆమె విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించింది కూటమి ప్రభుత్వం. ఎలాంటి సస్పెన్షన్ వేటు వేయలేదు. సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం సస్పెన్షన్ లో లేని ఏ అధికారికైనా.. రిటైర్మెంట్ అయ్యేలోపు ఏదో ఒక పోస్టింగ్ ఇచ్చి.. గౌరవప్రదంగా రిటైర్ చేయాల్సి ఉంటుంది. దీని ప్రకారం ప్రభుత్వం ఆమెకు సాంకేతికంగా ఒక పోస్టింగ్ ఇచ్చి పదవీ విరమణకు అనుమతి ఇచ్చింది. దీంతో వివాదాలు ఉన్నప్పటికీ శ్రీలక్ష్మి గౌరవప్రదమైన రిటైర్మెంట్ దక్కించుకున్నట్లు అయింది.

* వారిద్దరికీ నో ఛాన్స్..
జగన్ సర్కార్ హయాంలో ఐపీఎస్ అధికారులుగా ఉన్న పీవీ సునీల్ కుమార్, సీతారామాంజనేయులపై అనేక రకాల కేసులు ఉన్నాయి. గత ప్రభుత్వంలో సిఐడి చీఫ్ గా ఉంటూ రఘురామకృష్ణం రాజును అరెస్టు చేసి కస్టోడియల్ టార్చర్ పెట్టారు అనేది పీవీ సునీల్ కుమార్ పై ఉన్న ఆరోపణ. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్ లో ఉన్నారు. కానీ ఈయన రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేస్తున్నారని అనుమానాలు ఉన్నాయి. అందుకే కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. సస్పెన్షన్ లోనే ఈయన రిటైర్ కానున్నారు. అదే జరిగితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవు. అటు వివాదాస్పద ఐపిఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ సీతారామాంజనేయుల పరిస్థితి కూడా అదే. ముంబై నటి కేసులో ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అందుకే కూటమి ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. కానీ ఈయన ఆగస్టు లో పదవీ విరమణ చేయనున్నారు. పీవీ సునీల్ కుమార్ మాదిరిగానే సీతారామాంజనేయులు పై కూడా సస్పెన్షన్ లో ఉంచి రిటైర్మెంట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనీసం న్యాయస్థానానికి వెళ్లి ఉపశమనం పొందవచ్చు తమ తప్పు లేదని భావిస్తే. కానీ వీరు వెళ్ళకపోవడం మాత్రం గమనించదగ్గ విషయం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version