YCP Formation Day: ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో వైసీపీది ఒక చరిత్ర. ఒక్కడితో మొదలైన ఆ పార్టీ.. కోట్ల మంది కార్యకర్తల సమూహంగా మారింది. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు జగన్ ఒక్కడే. కానీ ఇంతింతై వటుడింతై అన్నంత రేంజ్ లో ఎదిగాడు. పార్టీ పెట్టిన తొమ్మిదేళ్ల తర్వాత అధికారంలోకి తీసుకు రాగలిగారు. దారి పొడవునా ముళ్ళు, రాళ్లు ఉన్నా వెనక్కి తగ్గలేదు. భయపడలేదు. కలిసి వచ్చిన వాళ్లను కలుపుకొని.. వెంట నడిచిన వాళ్లను చేతిన పట్టుకుని ముందుకు నడిచారు జగన్. ముందు ప్రతిపక్షంలోకి వచ్చారు. ప్రజల కష్టాలను తెలుసుకున్నారు. కష్టాలను అధిగమించారు. ప్రజాభిమానంతో అధికారాన్ని అందుకోగలిగారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 14వ వసంతంలోకి అడుగు పెట్టింది. 2011, మార్చి 12న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులు పడి పార్టీని నడిపించారు. ఆటుపోట్లను కష్టాలను ఎదుర్కొని నిలబడ్డారు. రాజకీయ కుట్రలు, కుతంత్రాలను అధిగమించారు. 2014 ఎన్నికల్లో 67స్థానాలతో ప్రధాన ప్రతిపక్ష హోదాను తగ్గించుకున్నారు.2019లో అంతులేని మెజారిటీతో విజయం సాధించారు. ఏకంగా 151 సీట్లతో కనివిని ఎరుగని విజయాన్ని దక్కించుకున్నారు.
అయితే ఒక్క మాట చెప్పగలం. జగన్ ఈ స్థాయికి ముమ్మాటికి వైయస్ రాజశేఖర్ రెడ్డి కారణం. 2004 వరకు జగన్ ఒక సామాన్య కాంగ్రెస్ కార్యకర్త. రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రావడంతో ఆయన పేరు బయటకు వచ్చింది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించారన్న ఆరోపణ ఉంది. ఆ ఆరోపణే జగన్ ను బయట ప్రపంచానికి పరిచయం చేసింది. 2009లోకడప ఎంపీగా ఉన్న జగన్.. రాజశేఖర్ రెడ్డి మరణంతో ఆశాదీపంలా మారిపోయారు. కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా గుర్తింపు పొందారు. రాజశేఖర్ రెడ్డి ప్రజాకర్షక పథకాల ఫలితాలను జగన్ ఒడిసి పట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ విజయం రాజశేఖర్ రెడ్డి రెక్కల కష్టమని ఎక్కువమంది ప్రజలు భావించారు. ఆయన వారసుడిగా జగన్ ను గుర్తించారు. దానిని సద్వినియోగం చేసుకున్నారు జగన్. కష్టాల మాటున సానుభూతిని మరింత పొందగలిగారు. ప్రజా నాయకుడిగా అవతరించారు.
అయితే గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను కోరారు. ప్రజల సైతం ఆయన పిలుపును గౌరవించారు. అంతులేని విజయాన్ని కట్టబెట్టారు. అయితే గత ఎన్నికల మాదిరిగా సానుభూతి ఉందా? మరోసారి ఆ సానుభూతి పనిచేస్తుందా? అంటే ముమ్మాటికి లేదనే సమాధానం వస్తుంది. ఇప్పటికే ఒక ఛాన్స్ ఇచ్చామని ఒకరు.. ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదని మరొకరు.. సంక్షేమం తప్ప అభివృద్ధి జాడలేదని ఇంకొందరు.. ఇలా చాలా వర్గాలు జగన్ కు దూరమయ్యారు. కానీ సంక్షేమనే తారక మంత్రంతో జగన్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాకున్నా.. ఓడిపోయినా.. జగన్ కు ప్రతికూల పరిస్థితులు తప్పవు. మునుపటిలా తండ్రిసానుభూతి వర్కౌట్ కాదు. గతంలో కలిసివచ్చిన ఏ అంశాలు.. ఇప్పుడు కనిపించవు. సో 14 వసంతాల వైసీపీకి ఎన్నికలు అత్యంత కీలకం.