Tirumala laddu controversy : తిరుమల( Tirumala) లడ్డూ వివాదానికి సంబంధించి కీలక పరిణామం ఒకటి జరిగింది. ప్రస్తుతం ఆ వివాదంపై సీబీఐ విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటయింది. గత కొద్ది రోజులుగా విచారణ కొనసాగుతూ వస్తోంది. ఈ తరుణంలో నెయ్యి సరఫరా చేసిన నలుగురు వ్యక్తులను దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ, ఉత్తరప్రదేశ్ కు చెందిన పరాగ్ డెయిరీ, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ సంస్థలకు సంబంధించిన కీలక వ్యక్తులను మూడు రోజులుగా తిరుపతిలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. విచారణకు సహకరించకపోవడంతో పాటు కల్తీ నెయ్యి గతంలో వారి ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం. అందుకే ఆదివారం ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో లడ్డు వివాదంలో ఇదో కీలక మలుపు. మున్ముందు మరిన్ని అరెస్టులు కూడా ఉంటాయని తెలుస్తోంది. అయితే అదుపులోకి తీసుకున్న వారిని సోమవారం కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.
* అదుపులో నలుగురు
ప్రస్తుతం ఏఆర్ డెయిరీకి( AR diary ) సంబంధించి విపిన్ గుప్తా( Vipin Gupta), పోమిల్ జైన్, అపూర్వ చావడ, రాజశేఖర్ ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల కిందట వెలుగు చూసిన లడ్డు వివాదం ప్రకంపనలు రేపింది. లడ్డు తయారీలో జంతు కొవ్వు వాడారు అన్నది ప్రధాన ఆరోపణ. అయితే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఈ సంచలన ఆరోపణలు చేశారు. వైసిపి ప్రభుత్వం పై చేయడంతో ఆ పార్టీకి చెందిన నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి అధికారులను సంయుక్త విచారణ చేపట్టాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఓ అయిదుగురు అధికారుల నేతృత్వంలో ఈ ప్రత్యేక దర్యాప్తు కొనసాగుతోంది. కాగా ఈ విచారణ తుది దశకు వచ్చినట్లు తెలుస్తోంది.
* భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా
ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా( world wise ) ఉన్న శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగింది. హిందుత్వ వాదులు, హిందూ మత సంస్థలు పెద్ద ఎత్తున ఆందోళనలు సైతం చేపట్టాయి. అప్పటి వైసిపి ప్రభుత్వం తీరు కూడా విమర్శలకు గురైంది. అయితే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ ఆరోపణలు అని వైసిపి కొట్టి పారేసింది. అయితే వైసీపీకి భారీ డ్యామేజ్ జరగడంతో ఆ పార్టీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రత్యేక పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. గత కొద్దిరోజులుగా ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం తిరుపతి కేంద్రంగా చేసుకొని విచారణ చేపడుతోంది. ప్రస్తుతం ఈ విచారణ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
* మున్ముందు మరిన్ని అరెస్టులు
అయితే లడ్డు వివాదానికి సంబంధించి ఏకంగా నలుగురిని అరెస్టు చేయడం సంచలనంగా మారింది. మున్ముందు మరిన్ని అరెస్టులు ఉంటాయని తెలుస్తోంది. సిపిఐ( CBI) హైదరాబాద్ డివిజన్ జాయింట్ డైరెక్టర్ వీరేశ్ ప్రభు, విశాఖ సిబిఐ ఎస్పి మురళి రాంబ, విశాఖ డిఐజి గోపీనాథ్ జెట్టి, గుంటూరు ఐజి సర్వ శ్రేష్టు త్రిపాఠి, ఎఫ్ఎస్ఎస్ఐ అధికారి సత్య కుమార్ పాండ్యా ఆధ్వర్యంలో విచారణ శరవేగంగా కొనసాగుతోంది. ఆరు నెలలపాటు ఈ విచారణ గడువు విధించినట్లు అప్పట్లో ప్రచారం నడిచింది. అయితే ఆ సమయం ఆసన్నం కావడంతో ఇప్పుడు అరెస్టుల పర్వం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. మున్ముందు మరిన్ని అరెస్టులు జరుగుతాయని కూడా ప్రచారం నడుస్తోంది.