IAS Officer Sri Lakshmi: సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి( senior IAS officer Sri Lakshmi ). రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉండాల్సిన ఆమె చేజేతులా తన కెరీర్ ను నాశనం చేసుకున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమస్తులు , గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన ఓబులాపురం మైనింగ్ కేసుల్లో చిక్కుకున్నారు. తాజాగా సుప్రీంకోర్టులో ఆమెకు భారీ షాక్ తగిలింది. ఆ రెండు కేసుల నుంచి తన పేరును తొలగించాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో ఈ పిటిషన్లు దాఖలు చేయగా తిరస్కరణకు గురయ్యాయి. ఇప్పుడు సుప్రీంకోర్టులో సైతం అదే పరిస్థితి ఎదురు కావడంతో.. ఆమెకు జైలు శిక్ష తప్పదు అని ప్రచారం నడుస్తోంది.
* సుప్రీంకోర్టులో పిటిషన్ డిస్మిస్..
ఓబులాపురం మైనింగ్ తో పాటు జగన్ అక్రమాస్తుల కేసుల్లో చిక్కుకున్నారు శ్రీలక్ష్మి. అయితే కేవలం ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే అప్పట్లో తాను విధులు నిర్వహించానని.. ఇందులో ఎటువంటి వ్యక్తి గత ప్రయోజనం లేదని ఆమె పేర్కొన్నారు. అయితే సిబిఐ తరపు న్యాయవాదులు గట్టి వాదనలు వినిపించారు. అప్పట్లో ఓబులాపురం మైనింగ్ లీజుల కేటాయింపులో.. క్విడ్ ప్రోకో వ్యవహారాల్లో శ్రీలక్ష్మి కీలక పాత్ర పోషించారని కోర్టుకు వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం.. కేసు ఈ దశలో ఉన్నప్పుడు ఆమె పేరు తొలగింపు అసాధ్యమని తేల్చి చెప్పింది. సిబిఐ చూపిన అభియోగాలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నందున. ట్రయల్ కోర్టులో విచారణ ఎదుర్కోవాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి చిక్కులు తప్పేలా లేవు.
* నిందితులందరికీ జైలు శిక్ష..
ఓబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించి సిబిఐ ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగింది. ఇప్పటికే ఈ కేసులో నిందితులందరికీ జైలు శిక్ష ఖరారు అయ్యింది. ఒక్క శ్రీ లక్ష్మీ గతంలో హైకోర్టు నుంచి డిశ్చార్జ్ ఉత్తర్వులు తెచ్చుకున్నందున ఆమెపై విచారణ జరగలేదు. అయితే తాజాగా ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ ను కొట్టివేయడంతో ఆమెకు సైతం శిక్ష తప్పదని ప్రచారం నడుస్తోంది. వాస్తవానికి చాలా రోజులపాటు ఆమె రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తెలంగాణ నుంచి ఏపీకి వచ్చారు. ఆమెకు అప్పట్లో జగన్ సర్కార్ ప్రాధాన్యమిచ్చింది. టిడిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఆమెకు పోస్టింగ్ దక్కలేదు.