Yanamala Ramakrishnudu: తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్ నేతల్లో ఒకరు యనమల రామకృష్ణుడు. టిడిపి ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నారు. రాష్ట్రంలో ఆయన చేయని పదవి అంటూ లేదు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, పీఏసీ చైర్మన్ గా ఇలా చాలా పదవులు చేపట్టారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఎక్కువసార్లు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఆయన జీవితంలో ఒక లోటు ఉంది. అదే కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లడం. ఎంపీగా పెద్దల సభకు వెళ్లాలన్నది ఆయన ఆలోచన. కానీ అది కార్యరూపం దాల్చడం లేదు. తాజా రాజ్యసభ పదవుల్లో సైతం ఆయనకు ఛాన్స్ లేదని ప్రచారం నడుస్తోంది. దీంతో ఈ సీనియర్ నేత కాస్త ఆవేదనతో ఉన్నట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం ఉంది.
* పార్టీ ఆవిర్భావం నుంచి..
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నారు యనమల రామకృష్ణుడు. 1983 నుంచి 1999 వరకు తుని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. మధ్యలో ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చినా.. ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా టిడిపిలో కొనసాగారే తప్ప.. మరో పార్టీ వైపు చూడలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఆయనకు మంత్రి పదవి దక్కుతూ వచ్చింది. 1983లో తొలిసారిగా గెలిచేసరికి ఎన్టీఆర్ తన క్యాబినెట్లోకి తీసుకున్నారు. 1989లో టిడిపి అధికారంలోకి రాలేదు. 1994లో టిడిపి అధికారంలోకి రాగా యనమల రామకృష్ణుడు కు స్పీకర్ పదవి ఇచ్చారు నందమూరి తారక రామారావు. కానీ 1995 టీడీపీ సంక్షోభ సమయంలో యనమల రామకృష్ణుడు స్థితప్రజ్ఞత ప్రదర్శించారు. చంద్రబాబుకు అవకాశం ఇచ్చారు సభలో. తన బలాన్ని నిరూపించుకున్నారు చంద్రబాబు. తన పొలిటికల్ లైఫ్ లో అదో టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. నాడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు అవకాశం ఇవ్వకుంటే.. చంద్రబాబుకు ఈ తరహా గౌరవం ఉండేది కాదు. అందుకే యనమల రామకృష్ణుడు విషయంలో చాలా గౌరవభావంతో ఉంటారు చంద్రబాబు. 1999లో గెలిచేసరికి ఆర్థిక శాఖ కట్టబెట్టారు. 2004లో పార్టీ ఓడిపోయింది కానీ యనమలకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తూ వచ్చారు. 2014లో ఎమ్మెల్సీగా ఉన్న యనమలను మంత్రివర్గంలోకి తీసుకొని తన ప్రత్యేకత చాటుకున్నారు. కానీ 2024 లో మాత్రం ఎమ్మెల్సీగా ఉన్న యనమల ను రెన్యువల్ చేయలేదు. మంత్రివర్గంలోకి తీసుకోలేదు.
* పెద్దల సభ ఆశ..
యనమల రామకృష్ణుడు పెద్దల సభకు వెళ్లాలన్న ఆశతో ఉన్నారు. ఒకసారి రాజ్యసభకు ఎంపికై గౌరవంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారు. తన మనసులో ఉన్న మాటను చంద్రబాబు చెవిలో వేశారు. కానీ ఇప్పుడు నాలుగు రాజ్యసభ పదవుల ఎంపికలో యనమల రామకృష్ణుడు పేరును ప్రతిపాదనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. అయితే మరో మూడేళ్లలో రాజ్యసభ పదవులు ఖాళీ కానున్నాయి. అప్పుడు ఛాన్స్ ఇస్తామని యనమలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే యనమల కుమార్తె ఎమ్మెల్యే గా ఉండగా.. అల్లుడు లోక్సభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. బహుశా ఈ కారణాల వల్లే ఈసారి యనమలకు అవకాశం లేనట్లు తెలుస్తోంది. అయితే పెద్దల సభకు వెళ్లాలన్న యనమల కోరిక తీరకపోవడం ఆయనకు పెద్ద లోటు.
