TDP Second List: టిడిపిలో టిక్కెట్ల చిచ్చు

ముఖ్యంగా విశాఖ జిల్లాలో అసంతృప్తులు ఎక్కువగా బయటపడ్డాయి. పెందుర్తి,ఎలమంచిలి స్థానాలు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంతో.. అక్కడ టిక్కెట్లు ఆశించిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, నాగేశ్వరరావు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.

Written By: Dharma, Updated On : March 14, 2024 6:13 pm

TDP Second List

Follow us on

TDP Second List: టిడిపిలో టిక్కెట్ల చిచ్చు రగులుతోంది. టిక్కెట్లు దక్కని సీనియర్లు అసంతృప్తితో రగిలిపోతున్నారు. వారి అనుచరులు ఆందోళనకు దిగుతున్నారు. చివరికి పవన్ పోటీ చేయబోయే పిఠాపురంలో సైతం టిడిపి నేత వర్మ అనుచరులు ఆందోళన బాట పట్టారు. పార్టీ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకించారు. దాదాపు అన్ని జిల్లాల్లో అసంతృప్తులు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా తొలి జాబితాలో టిక్కెట్లు దక్కని ముఖ్య నేతలకు.. రెండో జాబితాలో సైతం చుక్కెదురు అయ్యింది.

ముఖ్యంగా విశాఖ జిల్లాలో అసంతృప్తులు ఎక్కువగా బయటపడ్డాయి. పెందుర్తి,ఎలమంచిలి స్థానాలు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంతో.. అక్కడ టిక్కెట్లు ఆశించిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, నాగేశ్వరరావు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. తమ అనుచర వర్గంతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. విశాఖ దక్షిణం సీటు ఆశించిన ఇన్చార్జి గండి బాబ్జి టిడిపికి రాజీనామా చేశారు. భీమిలికి చెందిన మరో నేత పాసర్ల ప్రసాద్ ఇప్పటికే తన రాజీనామాను ప్రకటించారు.ఇక మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రిషికొండలో తన అనుచరులతో సమావేశం అయ్యారు. గంటా శ్రీనివాసరావు భీమిలి టిక్కెట్ ను ఆశించారు. కానీ చంద్రబాబు ఆయనను చీపురుపల్లి వెళ్లాలని సూచించారు. దీంతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించడానికి అనుచరులతో భేటీ అయ్యారు.

పశ్చిమగోదావరి జిల్లాలో పార్టీలో ముళ్ళపూడి రేణుక పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో ఆమె బిజెపిలో చేరాలని నిర్ణయించారు. కృష్ణాజిల్లాలో సైతం సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. మైలవరం సీటును వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్ కు కేటాయించారు. ఈ సీటు పై టిడిపి నేతలు దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఉమాకు పెనమలూరు సీటు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే అక్కడ బోడే ప్రసాద్ టిక్కెట్ ఆశిస్తున్నారు. ఆయనకు చంద్రబాబు సన్నిహిత వ్యక్తులు బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తొలి జాబితాలో ఇటువంటివి కనిపించలేదు. కానీ రెండో జాబితా ప్రకటించేసరికి రాష్ట్రవ్యాప్తంగా టిడిపిలోని సీనియర్లు ఆందోళన బాట పట్టడం పార్టీ వర్గాల్లో ఒక రకమైన కలవరం కనిపిస్తోంది. అయితే టిడిపి హై కమాండ్ మాత్రం అసంతృప్త నేతలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.