Saikrishna mystery: ఏపీలో ఒక ఆసక్తికర పరిణామం చుట్టూ ఇప్పుడు వివాదం నడుస్తోంది. గాదే సాయి కృష్ణ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేయడం.. ఆయన అదృశ్యం కావడం పెద్ద మిస్టరీగా మారింది. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన యువకుడు కావడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్త రాజకీయం మొదలు పెట్టింది. ఈ పరిస్థితుల్లో సాయి కృష్ణ తల్లి మీడియా ముందుకు వచ్చి బోరున విలపించింది. తన కుమారుడిని పోలీసులు చంపేశారని.. కనీసం శవాన్ని అయినా ఇవ్వాలని ఆమె ప్రాధేయపడ్డారు. అయితే ఈ అంశంపై గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. సాయి కృష్ణ లాకప్ డెత్ కు గురయ్యారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు అనుకూల మీడియా దీనిపైన ఎక్కువగా ఫోకస్ చేసింది. విజయవాడ మాజీ ఎంపీ కేసినేని నాని అయితే ఏకంగా విజయవాడ పోలీస్ కమిషనర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాల క్రమంలో సింగపూర్ పర్యటన ముగించుకుని అమరావతి వచ్చిన సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు.
విచారణకు అత్యున్నత కమిటీ..
సాయి కృష్ణ వివాదాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం స్పందించింది. ఓ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో విచారణకు ఒక కమిటీని నియమించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సీఐ నాగరాజును ఇప్పటికే విఆర్ కు పంపగా.. ఆయనపై ఏకంగా సస్పెండ్ వేటు వేశారు సీఎం చంద్రబాబు. పోలీసులు బాధ్యతగా వ్యవహరించకపోతే తానే కఠిన నిర్ణయాలు తీసుకుంటానని బిజెపిని హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు సాయి కృష్ణకు భారీ నేరచరిత ఉందని పోలీసులు చెబుతున్నారు. కానీ దీనిని ఒక రాజకీయ అస్త్రంగా మార్చుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందుకే కూటమి ప్రభుత్వం సీరియస్గా స్పందించింది.
నేరచరిత్ర ఉందని..
సాయి కృష్ణ కృష్ణలంకకు చెందిన 25 ఏళ్ల యువకుడు. అతనిపై రౌడీషీట్ కూడా ఉంది. గంజాయితోపాటు డ్రగ్స్ రవాణా కేసులు ఆయన పేరు ఉందని అంటున్నారు పోలీసులు. మహిళలను వేధించిన కేసులతోపాటు జైన్ స్నాచింగ్ కేసులు కూడా ఉన్నట్లు చెప్పుకొస్తున్నారు. ఈ కేసుల విచారణకు సహకరించడం లేదని చెబుతూ సిఐ నాగరాజు సాయి కృష్ణను గత నెలలో మార్కాపురంలో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి సాయి కృష్ణ కనిపించడం లేదని ఆయన తల్లి విజయలక్ష్మి చెబుతున్నారు. అయితే ఏకంగా ఆమె తన కుమారుడిని పోలీసులు చంపేశారు అంటూ ఆరోపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ కేసు హైకోర్టు వరకు వెళ్ళింది. అసలు పోలీసులు అరెస్టు చేశారా లేదా అని ప్రశ్నించింది. అయితే పోలీసుల నుంచి భిన్నమైన వాదన వినిపించడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 29 లోగా సాయి కృష్ణను కోర్టు ముందు హాజరు పరచాలని కూడా ఆదేశించారు. ఈ తరుణంలో పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇంతలోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిని రాజకీయ అస్త్రంగా మార్చుకుంది.. సాయి కృష్ణ కాపు సామాజిక వర్గానికి చెందిన యువకుడు అని.. ఆయన శవాన్ని కూడా మాయం చేశారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే దీనిని రాజకీయ అస్త్రంగా మార్చుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు గుర్తించడంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. అందుకే విచారణకు కమిటీ ఏర్పాటు చేసింది
