Sai Krishna Case Update: ఏపీలో రౌడీ షీటర్ గాదె సాయి కృష్ణ అదృశ్యం మిస్టరీ వీడడం లేదు. అయితే దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంత రాజకీయం చేయాలో అంతలా చేసేసింది. ఒక నేరస్తుడు అని గుర్తించకుండా కాపు యువకుడు అన్నదాన్నిపై హైలైట్ చేస్తోంది. మరోవైపు ఈ యువకుడి అదృశ్యం విషయంలో పోలీసుల తప్పిదాలు కూడా ఉన్నాయి. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుంటే.. కచ్చితంగా నేరాలు, అభియోగాలు మోపి కోర్టులో హాజరు పరచాలి. కానీ అలా చేయలేదు. ఆపై ఆ యువకుడి ఆచూకీ లేదు. దీనికి ముమ్మాటికీ పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజు అడ్డంగా బుక్కయ్యారు. ఆయనపై తొలుత వి ఆర్ వేటు పడింది. తరువాత సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆయనను సస్పెండ్ చేశారు. ఇప్పుడు తాజాగా క్రిమినల్ కేసు నమోదయింది. కేవలం పోలీస్ కేసు, అరెస్టులు, నేరం దర్యాప్తులో భాగంగానే ఈ ప్రక్రియ జరిగింది. అయితే నిందితుడిని అరెస్టు చేసినప్పుడు కచ్చితంగా కోర్టులో హాజరు పరచాలి. కోర్టులో హాజరు పరచకపోగా ఆ నిందితుడు ఇప్పుడు అదృశ్యం కావడంతో పోలీసుల మెడకు చుట్టుకుంది. అయితే కాపు యువకుడు అని వైసిపి బయటకు తీసుకురావడం వెనుక రాజకీయ లబ్ధి ఆశించడం స్పష్టంగా కనిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ ఉద్దేశ్యంతో చేసిన ఈ ఇష్యూ మాత్రం పెరిగింది. కానీ అక్కడే తప్పులో కాలేసారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.
వెనుకేసుకొచ్చిన జగన్..
వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి ఏకంగా ఆ కుటుంబాన్ని పరామర్శించేశారు. చిన్న కుర్రాడు తప్పు చేస్తే ఏంటి అని అర్థం వచ్చేలా మాట్లాడారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో సాయి కృష్ణ నేరాలు హైలెట్ అవుతున్నాయి. ఆయన అదృశ్యం వెనుక పోలీసులు ఉంటే ఓకే. ఆ తీరును తప్పు పట్టాలి కానీ ఒక నేరస్తుడిని వెనకేసుకు రావడం ఏంటి అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చుట్టూ జరుగుతున్న ప్రచారం. పైగా అంబటి రాంబాబు ఒక ఫోటోను తీసుకొచ్చి మీడియాకు చూపించారు. గాయాలతో కనిపిస్తున్న యువకుడు సాయి కృష్ణ అని చెప్పుకొచ్చారు. కానీ అందులో ఉన్నది సాయి కృష్ణ కాదు నవీన్ రెడ్డి అని బయటకు వచ్చేసింది. అది కూడా సాయి కృష్ణ చేతిలో నవీన్ రెడ్డి హత్యకు గురైన అంశం కూడా సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభమైంది. అప్పటినుంచి ఈ అంశం కొత్తదారి పట్టింది.
వ్యతిరేక కామెంట్స్..
అంబటి రాంబాబు నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు ఒక నేరస్తుడు గురించి ఇంతలా బాధపడుతున్నారు ఏంటి అని చాలామంది ప్రశ్నించడం ప్రారంభించారు. గతంలో ఇదే సాయి కృష్ణ గురించి సమీప బంధువులు యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. మామ వరుస అయ్యే వ్యక్తి.. ఇలాంటి వాడిని ఎన్కౌంటర్ చేస్తే తప్పు ఏంటి అని మాట్లాడారు. ఇప్పుడు తాజాగా అదే వ్యక్తి మాట మార్చిన తీరు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. మరోవైపు సాయి కృష్ణను హత్య చేశారని, లాకప్ డెత్ చేసేసారని, అంత్యక్రియల్లో ఆనవాళ్లు లేకుండా చేశారని వైసీపీ నేతలు ఆరోపించడం ప్రారంభించారు. సాక్షి మీడియా సైతం దానిని హైలెట్ చేయడం మొదలుపెట్టింది. ఇంకా ఈ మిస్టరీ వీడక ముందే హత్య, చనిపోయాడంటూ నిర్ధారించడం ఏంటి అనేది కొత్తగా పుట్టుకొస్తున్న ప్రశ్న. ఈ మొత్తం ఎపిసోడ్లో రోజురోజుకు ఒక్కో మలుపు కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే ఈ కేసులో సీఐ నాగరాజు అడ్డంగా బుక్కయ్యారు. చివరకు వైసీపీ బుక్ అవుతుందా అన్న అనుమానం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
