Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగం విషయంలో కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయానికి రాలేకపోతోంది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఈ భవనాల వినియోగం విషయంలో ఎందుకో జాప్యం జరుగుతోంది. దీని వినియోగం విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. అయితే వీటి వినియోగం విషయంలో అనేక రకాల ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుకు వచ్చాయి. ఇప్పటికే దీనిపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం పలు సిఫారసులు చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం విశాఖలో సమావేశం కానున్న ఈ కమిటీ తుది నిర్ణయం దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది. వైసిపి హయాంలో అత్యాధునిక హక్కులతో దాదాపు 400 కోట్ల రూపాయలతో రుషికొండ భవనాలు నిర్మితమయ్యాయి. అయితే ఎందుకు నిర్మించారో కూడా జగన్ సర్కార్ బయటకు చెప్పలేక పోయింది. రెండేళ్లు గడుస్తున్నా కూటమి ప్రభుత్వం కూడా ఎలా వినియోగించుకోలా తెలియక సతమతం అవుతోంది.
అప్పట్లో స్పష్టత కరువు..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో రుషికొండలో నిర్మాణాలు తొలగించి.. భారీ భవంతులను నిర్మించారు. కనీసం ఏ నిర్మాణాలు జరుపుతున్నారో కూడా చెప్పలేకపోయారు. వైసిపి ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. పాలనా రాజధానితో పాటు సీఎం క్యాంప్ కార్యాలయం కోసం ఈ భవన నిర్మాణ పనులు జరిపిందన్నది బహిరంగ రహస్యం. కానీ ప్రభుత్వం అధికారికంగా ఈ ప్రకటన కూడా చేయలేకపోయింది. కేవలం అప్పటి మంత్రులు మాత్రం ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. అయితే వైసిపి అధికారం కోల్పోయిన తర్వాత రిషికొండ భవనాల విషయంలో ఎలా ముందుకెళ్లాలో తెలియక సతమతమయింది టిడిపి కూటమి ప్రభుత్వం.
ఏకంగా విక్రయించేందుకు..
పర్యాటకపరంగా రిషికొండ భవనాలను వినియోగించుకోవాలని చూసింది కూటమి ప్రభుత్వం. మరోవైపు ప్రపంచ దిగ్గజ సంస్థలకు లీజులకు ఇవ్వాలని కూడా చూసింది. కానీ వీటితోపాటు అదనపు భూములు కోరుతున్నాయి అంతర్జాతీయ సంస్థలు. మరోవైపు బహిరంగ వేలం ద్వారా.. ఈ భవనాలను విక్రయించాలన్న ప్రతిపాదన కూడా ఉంది. కానీ ఎందుకో ఏ నిర్ణయము తీసుకోలేకపోతోంది. మరోవైపు రుషికొండ భవనాల నిర్వహణ ప్రభుత్వానికి కత్తి మీద సాములా మారుతోంది. ఏడాదికి కోట్లాది రూపాయల వ్యయం అవుతుండడంతో ప్రభుత్వం పై అదనపు భారం పడుతుంది. గతంలో పర్యాటకపరంగా రుషికొండ ద్వారా సంవత్సరానికి 7 కోట్ల వరకు ఆదాయం సమకూరేది. ఇప్పుడు ఆ ఆదాయం పోగా అనవసర ఖర్చు తప్పడం లేదు. భవనాల వినియోగం విషయంలో జరుగుతున్న జాప్యంతో తిరిగి విమర్శలకు గురవుతోంది కూటమి ప్రభుత్వం. అందుకే అంతిమంగా ఒక నిర్ణయానికి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
