Ramoji Rao Passed Away: రామోజీరావు మీడియా రంగంలో అడుగు పెట్టారు. కానీ అది ఈనాడు ద్వారా కాదు. 1969 లో అన్నదాత మాసపత్రిక ద్వారా. మీడియా అంటే ఒక వ్యాపారం కాదు సమాజాన్ని జాగృతం చేసే సామాజిక మాధ్యమం అని రామోజీ బలంగా నమ్మారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఆయన.. అదే కర్షక లోకానికి మేలు చేయాలన్న ఉద్దేశంతో ప్రారంభించినది అన్నదాత. సేద్యంలో అధునాతన విధానాలు, సాంకేతిక పద్ధతులు, కొత్త యంత్రాలపై సమాచారం అందించారు. ఒక్క ఈనాడు కాదు.. సినీ అభిమానుల కోసం ఈనాడుకు అనుబంధంగా సితార సినిమా వారపత్రికను కూడా రామోజీరావు అందించారు.
సినిమా విశేషాల సమాహారంగా సితార వారపత్రికను 1976 అక్టోబర్ 3న ప్రారంభించారు రామోజీ. కేవలం వార్తలు, కథనాలు అందించేందుకే పరిమితం కాకుండా.. విలువలు ఉన్న చిత్రాలని ప్రోత్సహించే దిశగా సితారను తీర్చిదిద్దారు రామోజీ. 1980 నుంచి మూడేళ్ల పాటు సితార అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతిభావంతులైన నటులు, సాంకేతిక నిపుణులను సన్మానించారు. తెలుగు సినీ పరిశ్రమ వార్తలను అందించడంలో సితార సక్సెస్ అయ్యింది. ఈనాడుకు సమాంతరంగా నడిచిన ఈ వార పత్రిక సెన్సేషన్ క్రియేట్ చేసింది.
తెలుగు ప్రజలకు సమాచారం అందించడంలో ఈనాడు సక్సెస్ అయ్యింది. ఇంతింతై వటుడింతై అన్న చందంగా అనతి కాలంలోనే ఈనాడు సర్క్యులేషన్ పెరిగింది. సితార సినీ వార పత్రికకు ఆదరణ పెరిగింది. ఇక సాహితీ ప్రియుల కోసం చతుర, విపుల మాసపత్రికలను ప్రారంభించారు రామోజీ. ఈ రెండు మాసపత్రికలు 1978లో పురుడు పోసుకున్నాయి. నెలకో నవలతో చతుర, వివిధ భాషా కథల సమాహారంగా తెచ్చిన విపుల సాహిత్య రంగంలో వినూత్నప్రయోగం. ఎందరో అసాధ్యమని భావించే సాహిత్య పత్రికలను నాలుగు దశాబ్దాల పాటు నిరాటంకంగా నడిపారు రామోజీరావు. అయితే ప్రతిరోజు నిత్య నూతనంగా పత్రికలను పాఠకులకు అందించడం రామోజీరావుకి చెల్లింది. ఆయన ఈ లోకం నుంచి భౌతికంగా దూరమైనా.. ఆయన స్థాపించిన పత్రికలు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతాయి. అంతలా పునాదులు వేశారు రామోజీ.