Rajdhani Files: ఏపీలో సినిమా ప్రదర్శనను నిలిపివేసిన పోలీసులు.. ప్రేక్షకులు షాక్

ఏపీ రాజధాని అమరావతి, ఆ ప్రాంత రైతుల కథాంశంతో రూపొందించిన రాజధాని ఫైల్స్ చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలకు నిర్ణయించారు.

Written By: Dharma, Updated On : February 15, 2024 6:57 pm
Follow us on

Rajdhani Files: ఏపీలో వివాదాస్పద సినిమాల విడుదలకు కోర్టులు బ్రేక్ చెబుతున్నాయి. నిన్నటి వరకు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమాకు న్యాయచిక్కులు ఎదురైన సంగతి తెలిసిందే. సరిగ్గా ఇప్పుడు రాజధాని ఫైల్స్ చిత్రానికి కూడా అదే పరిస్థితి ఎదురైంది. శుక్రవారం వరకు సినిమాను విడుదల చేయొద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సినిమాకు సంబంధించి పూర్తి రికార్డులను అందించాలని ఆదేశించింది. అయితే ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో సినిమాను ప్రదర్శించారు. హైకోర్టు ఆదేశాలతో ఉన్నఫలంగా నిలిపివేశారు. దీంతో ఇది రచ్చగా మారింది.

ఏపీ రాజధాని అమరావతి, ఆ ప్రాంత రైతుల కథాంశంతో రూపొందించిన రాజధాని ఫైల్స్ చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలకు నిర్ణయించారు. అయితే వైసిపి ప్రభుత్వానికి అప్రతిష్ట పాలు చేసేలా సినిమాను నిర్మించారని ఆరోపిస్తూ వైసిపి నేతలు కోర్టుకు ఎక్కారు. వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం సినిమా విడుదలను శుక్రవారం వరకు వాయిదా వేయాలని సూచించింది. ఆ సినిమాకు సంబంధించిన రికార్డులను కోర్టు ముందు ఉంచాలని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సినిమాను మధ్యలో నిలిపివేశారు. దీంతో ప్రేక్షకులు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఎక్కడికక్కడే పోలీసులు సముదాయించారు. కోర్టు ఆదేశాలతో నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

సినిమా మధ్యలో నిలిపివేయడంతో ప్రేక్షకులు ఎక్కడికక్కడే నిరసన గళం వినిపించారు. విజయవాడలోని ఓ ధియేటర్ వద్ద సినిమాను నిలిపివేయడంతో రైతులు, టిడిపి నేతలు నిరసనకు దిగారు. ఉండవల్లి లో అమరావతి రైతులు ధర్నా చేశారు. విజయవాడలోని ట్రెండ్ సెట్ మాల్ లోను సినిమాను నిలిపివేయడంతో ప్రేక్షకులు నిరాశతో వెనుతిరిగారు. మొత్తానికైతే ఎన్నికల ముంగిట రాజకీయ నేపథ్యమున్న చిత్రాలకు న్యాయచిక్కులు ఎదురవుతుండడం విశేషం.