PV Sunil Kumar retirement: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చాలామంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. అటువంటి వారికి కూటమి ప్రభుత్వం వచ్చాక చుక్కలు కనిపించాయి. కొందరు అప్రాధాన్య పోస్టుల్లోకి వెళ్లిపోయారు. మరికొందరిపై అయితే ఏకంగా సస్పెన్షన్ వేటు పడింది. అటువంటి వారిలో ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ ఉన్నారు. మరో వైపు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ఉన్నారు. వీరిద్దరూ ఈనెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఇంతలో శ్రీలక్ష్మి పై ఉన్న సస్పెన్షన్ వేటును తొలగించింది ప్రభుత్వం. కానీ పీవీ సునీల్ కుమార్ పై మాత్రం సస్పెన్షన్ తొలగించలేదు. మరో ఐపిఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ కూడా ఈ నెల చివర్లోనే పదవీ విరమణ చేయనున్నారు. అయితే ఆయన ప్రస్తుతం ఏపీ రోడ్డు భద్రత అథారిటీ చైర్మన్ గా ఉన్నారు. ఆయనపై ఎటువంటి కేసులు లేవు. దీంతో స్వేచ్ఛగా అయిన పదవీ విరమణ చేస్తారు.
శ్రీలక్ష్మి పై వేటు..
ఓబులాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారిగా ఉన్న శ్రీలక్ష్మి పై అభియోగాలు ఉన్నాయి. ఆమె గతంలో కూడా అరెస్టయ్యారు. ఆమెపై సస్పెన్షన్ వేటు పడింది. కానీ ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక తెలంగాణ నుంచి ఏపీ క్యాడర్ కుమారి ఆమెకు పోస్టింగ్ ఇచ్చారు. అయితే మళ్లీ టిడిపిని ఆమె టార్గెట్ చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను అప్రధాన్య పోస్టులోకి పంపించారు. తరువాత సస్పెన్షన్ వేటు వేశారు. కానీ ఈ నెల 30న పదవీ విరమణ చేస్తారు అనగా.. ఆమెపై ఉన్న సస్పెన్షన్ తొలగించారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ సెక్రటరీగా అవకాశం ఇచ్చారు. దీంతో గౌరవప్రదంగా ఆమె పదవి విరమణకు మార్గం దొరికింది. కానీ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ విషయంలో మాత్రం ప్రభుత్వం ఈ మినహాయింపు ఇవ్వలేదు.
అనేక అభియోగాలు..
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లో పీవీ సునీల్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టిడిపి నేతలను ఇబ్బంది పెట్టారన్నది ఆయనపై ఉన్న అభియోగం. ప్రధానంగా రఘురామకృష్ణం రాజు పై కస్టోడియల్ టార్చర్ చేశారన్నది ప్రధాన ఆరోపణ. అప్పట్లో శాఖా పరంగా ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారని.. అగ్రిగోల్డ్ కేసు విచారణలో నిధులను గోల్మాల్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే గతంలో ఐబి వెంకటేశ్వరరావు ఇదే మాదిరిగా వైసిపి ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ న్యాయ పోరాటం చేసి తనపై ఉన్న సస్పెన్షన్ను పదవీ విరమణ రోజే ఎత్తించుకున్నారు. దీంతో గౌరవంగా ఆయన రిటైర్మెంట్ అయ్యారు. అదే పరిస్థితిలో పీవీ సునీల్ కుమార్ ఉన్నారు కానీ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించలేదు.
ముందే ఊహించిన వైనం..
పీవీ సునీల్ కుమార్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఐపీఎస్ నిబంధనల ప్రకారం సస్పెన్షన్ లో ఉన్నప్పుడు పదవీ విరమణ చేస్తే ఎటువంటి ఉద్యోగ ప్రయోజనాలు ఉండవు. ప్రభుత్వం నుంచి ఆర్థిక ప్రయోజనాలు వదులుకోవాల్సి ఉంటుంది. ఈ విషయం తెలిసి కూడా పీవీ సునీల్ కుమార్ ఈ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఎందుకంటే ఆయనకు రాజకీయ అజెండా ఉంది. అంబేద్కర్ మిషన్ ద్వారా భారీగా ఒక వేదికను నడుపుతున్నారు. ఇలా పదవీ విరమణ చేసిన వెంటనే దానిని మరింత అభివృద్ధి చేసి వైసీపీ వైపు అడుగులు వేస్తారన్నది ఒక అంచనా. అందుకే ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించలేదని తెలుస్తోంది. మొత్తానికైతే వైసీపీ అస్మదీయ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఈ నెలలో పదవీ విరమణ చేస్తుండడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది.
