Prathipati Pulla Rao : పల్నాడు టీడీపీలో రగడ.. హైకమాండ్ పై ప్రత్తిపాటి ఫైర్

చిలకలూరిపేటలో తనకు ప్రత్యామ్నాయంగా  ప్రవీణ్ అనే నాయకుడ్ని తెరపైకి తేవడంపై ప్రత్తిపాటి పుల్లారావు ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే రాయపాటి రూపంలో అలక, అసంతృప్తిలు ఉండగా.. ఇప్పుడు ఆ రెండు నియోజకవర్గాల్లో అసంతృప్తులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి.

Written By: Dharma, Updated On : June 3, 2023 4:46 pm
Follow us on

Prathipati Pulla Rao :  ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీలో వర్గాలు బయటపడుతున్నాయి. అనుచిత వ్యాఖ్యలతో నేతలు రచ్చకెక్కుతున్నారు. సత్తెనపల్లి సీటు విషయంలో సిగపాట్లు పడుతుండగా.. ఇప్పుడు చిలకలూరిపేట తెరపైకి వచ్చింది. కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి బాధ్యతలు అప్పగించడంపై కోడెల శివరామ్ బాహటంగానే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చిలకలూరిపేటలో తనకు ప్రత్యామ్నాయంగా  ప్రవీణ్ అనే నాయకుడ్ని తెరపైకి తేవడంపై ప్రత్తిపాటి పుల్లారావు ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే రాయపాటి రూపంలో అలక, అసంతృప్తిలు ఉండగా.. ఇప్పుడు ఆ రెండు నియోజకవర్గాల్లో అసంతృప్తులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి.

గత ఎన్నికల్లో ఓటమి తరువాత ప్రత్తిపాటి పుల్లారావు నియోజకవర్గానికి దూరమైనట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో  టీడీపీ అభ్యర్ధిగా గత కొంతకాలం నుంచి భాష్యం ప్రవీణ్ పేరు వినిపిస్తోంది. నిజానికి చిలకలూరిపేట పుల్లారావుకు కంచుకోట. గతంలో పలుమార్లు ఎమ్మెల్యేగా ఆయన ఇక్కడి నుంచే గెలుపొందారు. గత ఎన్నికల్లో తన శిష్యురాలు విడదల రజనీ చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి పుల్లారావు నియోజకవర్గానికి దూరంగా హైదరాబాద్‌లోనే గడుపుతున్నారంటూ ప్రచారం జరిగింది. అందుకే ఈసారి హైకమాండ్ భాష్యం ప్రవీణ్‌ను రంగంలోకి దించిందంటూ ఊహాగానాలు వినిపించాయి. దీనిపై ప్రత్తిపాటి పుల్లారావు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.

ఇటీవల ప్రవీణ్ పేరు చిలకలూరిపేటలో మార్మోగిపోతోంది. చంద్రబాబు 73వ పుట్టిన రోజు సందర్భంగా 73 లక్షల రూపాయిలు విరాళంగా అందజేశారు. అంతేకాదు.. భాష్యం ప్రవీణ్ పేరిట చారిటబుల్ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో స్వయం ఉపాధికి సాయం చేయడం, వీధి వ్యాపారులకు టిఫిన్, తోపుడు బండ్లు పంపిణీ చేయడం, దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేయడం, అమరావతి రైతులకు విరాళం ఇవ్వడం ఇలా ఒకటా రెండా చాలా పనులే ప్రవీణ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే రానున్న ఎన్నికల్లో చిలకలూరిపేట ఎమ్మెల్యే టికెట్‌ను ప్రవీణ్ ఆశిస్తున్నారో లేదో బయటపెట్టడం లేదు.

ఇప్పుడు పరిణామాలపై పుల్లారావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రవీణ్ లోకేష్ పేరు వినియోగిస్తుండడంతో ఆయన బ్యాచ్ గా చెప్పుకుంటున్నారు. దీంతో కలవరపాటుకు గురైన పుల్లారావు చంద్రబాబుకు సైతం ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ట్రస్టులు, డబ్బుల పేరిట హడావుడి చేస్తే ఎలా అని పుల్లారావు ప్రశ్నిస్తున్నారు. ప్రవీణ్ కు ఇక్కడ కనీసం ఓటు హక్కు కూడా లేదని దుయ్యబట్టారు. ఫౌండేషన్, ట్రస్టుల పేర్లతో వచ్చే వారిని ఎంటర్‌టైన్ చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇప్పుడెదో రూ.కోటితో హడావుడి చేస్తారని.. తర్వాత చేతులెత్తేస్తారని కూడా తేల్చిచెప్పారు. ఇప్పుడు ఈ కామెంట్స్ మాత్రం ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. మొత్తానికైతే పల్నాడు జిల్లా టీడీపీలో జరుగుతున్న పరిణామాలు శ్రేణులకు కలవరపాటుకు గురిచేస్తున్నాయి.