Prakash Raj Controversy: నటుడు ప్రకాష్ రాజ్ లేనిపోని వివాదాల్లో వేలు పెడుతున్నారు. అనవసరంగా వివాదాలు కొనితెచ్చుకుంటున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా రాజకీయాల్లోనూ కూడా వివాదాస్పద ముద్ర వేసుకుంటున్నారు. తనకు తాను మేధావి అని భావించుకునే ప్రకాష్ రాజ్ ఆలోచింపజేసే పోస్టులు సోషల్ మీడియాలో పెడుతుంటారు. కానీ మెగా బ్రదర్ నాగబాబు పెట్టిన పోస్ట్ పై తాజాగా ఆయనకు సంబంధం లేకపోయినా.. వేలు పెట్టడం విమర్శలకు తావిస్తోంది. అసలు నాగబాబు ఆ పోస్ట్ ఏ సందర్భంలో పెట్టారు? దాని వెనుక జనసేన అంతర్గత క్రమశిక్షణ గురించి అయినా.. అదేదో తన గురించి నాగబాబు అన్నట్టు భావించి వెంటనే కౌంటర్ ఇవ్వడం తో అడ్డంగా బుక్కయ్యారు.
* నాగబాబు ట్వీట్ పై..
ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికల సీజన్ నడుస్తోంది. జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును ఖరారు చేశారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో పార్టీలో భిన్న స్వరం వినిపిస్తోంది. సామాజిక వర్గాలను తెరపైకి తీసుకొస్తూ కొందరు అతిగా వ్యవహరిస్తున్నారు. అటువంటివారిని ఉద్దేశించి నాగబాబు తన అధికారిక అకౌంట్లో ఒక పోస్ట్ చేశారు. అనుమానాలను పక్కన పెట్టండి.. ఎలాంటి ప్రశ్నలు లేకుండా అధినేతను అనుసరించండి అంటూ ఒక ఇంగ్లీష్ కొటేషన్ షేర్ చేశారు. కేవలం జనసేన అంతర్గత క్రమశిక్షణ పై మాత్రమే నాగబాబు ఈ పోస్ట్ చేశారు. దీనికి వెంటనే ప్రకాష్ రాజ్ స్పందించారు. నాగబాబు గారు.. ప్రశ్నించడం మా హక్కు ఏ నాయకుడైనా, నేనే నాయకుడిని అనుకున్నవాడైనా సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. అర్థం అయ్యిందా? మేం గొర్రెలం కాదు.. బానిస బతుకులు బతకడానికి.. ఈ బెదిరింపులు వద్దు అంటూ ట్వీట్ చేశారు.
* రాజకీయ అభిమానం..
అయితే ఎందుకో ప్రకాష్ రాజ్ క్రమేపి కట్టు దాటుతున్నారు. రాజకీయ ప్రేరేపిత ట్వీట్లు అన్నట్టు ముందుకు సాగుతున్నారు. ఆయనకు నచ్చిన భారత రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, డీఎంకే, వామపక్షాలు ఓటమి దిశగా వెళ్లడంతో ఆయన భారతీయ జనతా పార్టీ పై పడ్డారు. ఆ పార్టీకి మద్దతుగా నిలుస్తున్న పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నారు. పెద్ద అభ్యుదయ వాదినని అనిపించుకునేందుకు పరితపిస్తున్నారు. ఇప్పటివరకు ప్రజాస్వామ్య బద్దంగా ఆయన ప్రశ్నించడంతో కొంతవరకు గౌరవం దక్కింది. కానీ ఇప్పుడు ఒక పార్టీ లైన్ లేదా అంతర్గత క్రమశిక్షణకు సంబంధించిన విషయాల్లో కూడా దూరిపోయి మైలేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నారు. ఇప్పటివరకు ఆయనపై ఉన్న క్రెడిబిలిటీ పోతుంది. ఇప్పటివరకు ఒక పద్ధతి ప్రకారం మాత్రమే ఆయన పోస్టులు పెడుతున్నట్లు అంతా భావించారు. కానీ ఒక ఉద్దేశపూర్వకంగా పెడుతున్నారని ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. అయితే ప్రకాష్ రాజ్ పోస్టులను పట్టించుకోకపోవడం మేలు అనే నిర్ణయానికి వచ్చారు నెటిజన్లు.
