Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సంబంధించి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. విభజన హామీల్లో భాగంగా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది తెలుగుదేశం. అదే ప్రభుత్వ హయాంలో ఇప్పుడు పూర్తి కావడంతో ప్రారంభోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా చేయాలని భావిస్తోంది. సీఎం చంద్రబాబు నేరుగా ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన షెడ్యూల్ను సమీక్షించి అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు ఇస్తున్నారు. ప్రధాని పర్యటనను జయప్రదం చేసేందుకు మంత్రులకు బాధ్యతలు కేటాయిస్తున్నారు. ఒక వేడుకలా ఈ కార్యక్రమాన్ని జరిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికలు వేస్తున్నారు.
* ఒక విజయోత్సహంలా..
కేంద్రంలో ఎన్డీఏ, ఏపీలో కూటమి ఈ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని ఒక విజయోత్సవంలా నిర్వహించాలని చూస్తున్నాయి. ప్రధాని రెండు గంటల సమయం ప్రారంభోత్సవానికి కేటాయిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒక భారీ రాజకీయ, సంక్షేమ విజయోత్సాహంగా మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రెండు గంటల షెడ్యూల్ లో ప్రధాని మోదీ సుమారు 22 నిమిషాల పాటు భోగాపురం ఎయిర్పోర్ట్ రన్ వే, టెర్మినల్, మౌలిక వసతులను క్షుణ్ణంగా సందర్శిస్తారు. అనంతరం మోడీకి ఘనస్వాగతం పలుకుతూ 20 నిమిషాల పాటు భారీ రోడ్డు షో నిర్వహించేలా డిజైన్ చేశారు. మిగిలిన గంట 15 నిమిషాల సమయాన్ని బహిరంగ సభకు కేటాయిస్తారు.
* ఉత్తరాంధ్ర సంస్కృతికి పెద్ద పేట..
ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేసేలా చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఏకంగా 10,000 మంది కళాకారులతో గిరిజన సాంప్రదాయ ధింసా నృత్య ప్రదర్శనను నిర్వహించడం ద్వారా ప్రపంచస్థాయి దృష్టిని ఆకర్షించేందుకు ప్లాన్ చేశారు. రెండు లక్షల మంది ప్రజలతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చే భోగాపురం ప్రాజెక్టును వేగవంతం చేసి.. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభింపజేసి.. ప్రజల్లో ఒక రకమైన సానుకూలతను పెంచాలని చంద్రబాబు భావించారు. అందుకు ఈ ప్రారంభోత్సవ వేడుకలను ఒక సానుకూల అంశంగా మార్చుకోవాలని చూస్తున్నారు.
* ఒకరోజు ముందే పింఛన్లు..
ప్రతి నెలా ఒకటో తేదీన ప్రభుత్వం పింఛన్ల పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభం ఉండడంతో యంత్రాంగం మొత్తం అటువైపే దృష్టి పెట్టింది. అందుకే ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో ఒకరోజు ముందే పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఈ నెల 31న లబ్ధిదారులకు పింఛన్లు అందించాలని ఆదేశాలు జారీ చేసింది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తోంది.








